ఏడుకొండల వాడు అంటే తిరుమల శ్రీవేంకటేశ్వరుడు గుర్తుకువస్తాడు. ఆయన క్షేత్రం చుట్టూ ఏడు పవిత్ర క్షేత్రాలు ఉన్నాయి. అవి ఆయనకు సంబంధించినవే. వాటిలో ఒకటి సిద్దేశ్వరస్వామికి వరమిచ్చిన క్షేత్రం ఆ క్షేత్ర విశేషాలు తెలుసుకుందాం…
తిరుమల శ్రీ వేంకటేశ్వరాలయానికి చుట్టు ఉన్న ఏడు పురాతన వేంకటేశ్వరాలయాలలో అప్పలాయ గుంటలో వెలసిన శ్రీ వేంకటేశ్వారాలయం ఒకటి. ఒక చిన్న పల్లెలో పంట పొలాల మధ్య వెలసిన అందమైన ఆలయం ఇది.
స్థల పురాణం
శ్రీ వేంకటేశ్వరుడు నారాయణ వనంలో ఆకాశరాజు కుమార్తె పద్మావతిని వివాహమాడి తిరుమలకు కాలినడకన బయలుదేరి వెళ్తూ అప్పలాయగుంటలో తపస్సు చేసుకుంటున్న సిద్ధేశ్వర స్వామిని అభయ హస్తంతో ఆశీర్వదించి, ఈ ఆలయంలో కొలువు దీరాడు. ఆ ప్రదేశంలోని దేవాలయమే అప్పలాయగుంట దేవాలయం. తర్వాత స్వామి ఇక్కడి నుండి కాలినడకన తొండవాడలోని అగస్తేశ్వరుని దర్శించి తర్వాత సమీపంలోనే ఉన్న శ్రీనివాస మంగా పురంలో ఆరునెలలు ఉండి అక్కడి నుండి శ్రీవారి మెట్టు ద్వారా (నూరు మెట్ల దారి) తిరుమల చేరాడని స్థల పురాణం. ఈ ఆలయానికి దక్షిణం వైపున ఎత్తైన కొండ, చుట్టూ పంటపొలాలు ఉండటంతో వాతావరణము చాల ప్రశాంతంగా ఉంటుంది.
ఆలయ ప్రధాన ద్వారం దాటగానే ధ్వజస్తంభం, దాని వెనుక అంతరాళం ఎదురుగా గర్భ గుడిలో శ్రీ వారి దివ్య మంగళ రూపం కనుల విందు చేస్తుంది. శ్రీ వారి ఆలయం ముందు చిన్న కోనేరు, ప్రధాన ఆలయానికి ఎదురుగా చిన్న ఆంజనేయ స్వామి వారి ఆలయము ఉంది. ప్రతి నిత్యం ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామివారికి మంగళ వాయిద్యాలతో పూజాభిషేకాలు నిర్వహించి, తర్వాత శ్రీవారికి అభిషేకాలు పూజలు నిర్వహించి, భక్తులకు దర్శన భాగ్యాన్ని కలుగ జేస్తారు. ఈస్వామిని దర్శనం చేసుకుంటే అప్పుల బాధలు ఉండవని కొందరి విశ్వాసం. అదేవిధంగా ఇది పురాతన వేంకటేశ్వర ఆలయం కాబట్టి ఇక్కడ స్వామి దర్శిస్తే సకల పాపాలు పోతాయని నమ్మకం. తిరుపతి నుంచి ఇక్కడికి బస్సు సౌకర్యం ఉంది.