Rudraksha : పవిత్ర జలాలతో ఆ మాలను
రుద్రాక్ష జపమాలతో జపం చేసుకోవడం వలన మంత్రసిద్ధి కలుగుతుంది. జపం చేయడానికి ముందు జప మాలను సుగంధ జలాలతో శుభ్రం చేయాలి. ఆ తరువాత ఆవుపాలు, ఆవుపేడ, ఆవునెయ్యి, ఆవుపెరుగు, ఆవు పంచతం తో తయారైన పంచ గవ్యాన్ని ఆ మాల మీద వేసి ఆ తర్వాత మళ్ళీ పవిత్ర జలంతో శుభ్రం చేయాలి. అలా చేసిన తర్వాత జపించదలచుకున్న మంత్రాలను న్యాసంచేసుకోవాలి. శివాస్త్ర మంత్రం జపిస్తూ ప్రతి రుద్రాక్షను స్పృశించాలి. మూల మంత్రాన్ని న్యాసం చేసి ఆ తర్వాత, మళ్ళీ పవిత్ర జలాలతో ఆ మాలను శుభ్రం చేసుకోవాలి. తర్వాత పరిశుభ్రమైన పీఠం మీద పెట్టి అప్పుడు పార్వతీ పరమేశ్వరులను ఆ మాలలోకి ఆవాహన చేసుకోవాలి. అలా చేసిన మాలను ప్రతిష్ఠిత మాల అని పిలుస్తారు. అది అన్ని కోరికలను తీరుస్తుంది అని చెప్పబడింది.
Rudraksha : రుద్రాక్షను ధరించిన పశువులు సైతం
రుద్రాక్ష జపమాలతో ఏ దేవతా మంత్రానైన్నా జపం చేసుకోవచ్చు. అటువంటి పవిత్ర మాలను శిరసున గానీ, మెడలోకానీ, చెవికి ఆభరణం గా కానీ, ధరించ వచ్చంటారు. జపం చేయడం అవగానే కళ్ళకద్దుకొని యధావిధిగా మాలను ధరించ వచ్చు. స్నాన,జప, దాన, హోమ, సురార్చన,వైశ్వదేవ, శ్రాద్ధ,ప్రాయశ్చిత, దీక్షా కాలాలలో రుద్రాక్ష మాలలను వేసుకుంటే విశేష ఫలితం దక్కుతుంది అని చెప్పబడింది. ఒకరు వేసుకున్న రుద్రాక్షమాలను వేరొకరు వేసుకో కూడదు. దింతో పాటు శుచిగా లేని సమయాలలో కూడా రుద్రాక్షమాలలను వేసుకోకూడదు అని దేవీ భాగవతంలో స్పష్టంగా తెలియచేయబడింది. రుద్రాక్ష విశిష్టత ఎంతటిది అంటే , రుద్రాక్ష చెట్టు నుంచి వచ్చిన గాలి సోకినంత మాత్రాన , గడ్డిపరకలు కూడా పుణ్యలోకాలకు చేరుతాయని పురాణాలు తెలియచేస్తున్నాయి. రుద్రాక్షను ధరించిన పశువులు సైతం రుద్రత్వం పొందుతాయని జాబాలశ్రుతి తెలియచేస్తుంది. ఈ కారణంగా కాస్తంత సంప్రదాయం తెలిసిన వారు రుద్రాక్షను ధరిస్తుంటారు. ఇక ఋషులు, మునులు, యోగులు రుద్రాక్షను వేసుకోకుండా కనిపించరు. జపం మీద శ్రద్ధ పెరగటానికి కూడా రుద్రాక్ష కారణం అవుతుంది అని పరిశోధకులు తెలియచేస్తున్నారు.
శివలోక ప్రాప్తి
అందుకే రుద్రాక్ష మాలతో జపం చేస్తే అనంత పుణ్యఫలం దక్కుతుంది. చేతులకు, మెడకు,వక్షస్థలానికి, చెవులకు, శిరస్సుకు రుద్రాక్షలను ఆభరణాలు గా పెట్టుకున్న వాడు సాక్షాత్తుగా రుద్రుడి తో సమానమని దేవీ భాగవతంలో నారదుడు తెలియచేస్తున్నారు. ఇంకా రుద్రాక్షను ధరించి మరణిస్తే కుక్క కూడా ముక్తిని పొందుతుందని, ఇరవై ఒక్క రుద్రాక్షలను సంపాదించి ధరించగలిగితే శివలోక ప్రాప్తికలుగుతుంది అని దేవీ భాగవతంలోని ఒక కధాంశం తెలియచేస్తుంది. రుద్రాక్షధారణ రక్తపోటు లాంటివి కూడా నియంత్రించగలదని కొందరు పరిశోధకులు సైతం తెలియచేస్తున్నారు.