తిరుమల అనగానే ప్రస్తుతం స్వామికి జరుగుతున్న బ్రహ్మోత్సాలు గుర్తుకువస్తాయి. అయితే ఈ ఉత్సవాలు యుగప్రారంభం నుంచే ఉన్నాయనేది ఆయా పురాణాలలో ఉన్నాయి. కానీ వీటికి సంబంధించిన శాసనాలు సైతం ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం…
దాదాపు రెండువేల సంవత్సరాల నుండి సాహిత్యంలో, శాసనాల్లో తిరుమల క్షేత్ర వైభవం అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ ఉంది. శ్రీ వేంకటేశ్వరస్వామి సన్నిధిలో సంవత్సరం పొడవునా జరిగే అనేక ఉత్సవాలు, పండుగలు భక్తులను నిరంతరం తన్మయత్వం చేస్తూనే ఉంటాయి. అక్కడ జరిగే అన్ని వేడుకల్లో ప్రధానమైనవి బ్రహ్మోత్సవాలు. ఈ ఉత్సవాల సమయంలో ప్రపంచం నలుమూలలనుండి లక్షలాది భక్తులు తిరుమలకు వచ్చి, కనులారా స్వామిని చూసి తరిస్తారు. అనేక ప్రాంతాల నుండి వచ్చే భక్తబృందాలు ఆ సమయంలో భజనలు, కోలాటాలు, కీర్తనలు, నాట్యాలు ఇంకా అనేక కళాప్రదర్శనలతో స్వామిని సేవించి, భక్తులకు కనువిందు చేస్తారు. అతి ప్రాచీన కాలానికి చెందిన ఈ బ్రహ్మోత్సవ విశేషాలు వరాహ, పద్మ, బ్రహ్మాండ, భవిష్యోత్తర పురాణాల్లో, భారత, భాగవతాల్లో, ఆగమ శాస్త్రాల్లో, శ్రీ వేంకటాచల మహాత్మ్యంలో, శ్రీ వేంకటాచల ఇతిహాస మాలలో వివరంగా ఉన్నాయి. మొదటిసారిగా సాక్షాత్తూ బ్రహ్మదేవుడే శ్రీ వేంకటేశ్వరునికి ఈ ఉత్సవాలు నిర్వహించాడని, అందుకే వీటిని బ్రహ్మోత్సవాలంటారని పండితులు భావించారు.
తిరుమల, తిరుపతి, తిరుచానూరు, శ్రీనివాస మంగాపురంలలో మొత్తం 1252 శాసనాలు లభించాయి. వీటినే తితిదే శాసనాలంటారు. వీటన్నింటినీ ఆరు సంపుటాల్లో తితిదే ముద్రించింది. ఇందులో తిరుమలలో లభించిన శాసనాలే దాదాపు 800పైగా ఉన్నాయి. ఈ శాసనాలను పల్లవులు, చోళులు, యాదవ రాయ వంశస్థులు, విజయనగర చక్రవర్తులు వేయించారు. ఈ శాసనాలను సమగ్రంగా అధ్యయనం చేస్తే, విభిన్న కాలాల్లో తితిదే వైభవం ఎలా ఉండేదో తెలుస్తుంది. ఈ శాసనాల్లో దాదాపు 70 శాసనాల్లో బ్రహ్మోత్సవ విశేషాలు ఉన్నాయి. దేవస్థాన పరిపాలనా నిర్వహణ ఎక్కువగా తమిళ అధికారుల ప్రాబల్యంలో ఉండడంవలన ఈ శాసనాల్లో ఎక్కువ భాగం తమిళ భాషలో ఉన్నాయి. సాహిత్యంలో బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఆధ్యాత్మిక విషయాలు ఎక్కువగా ఉంటే, శాసనాల్లో ఆయా కాలాల్లో బ్రహ్మోత్సవాల నిర్వహణకోసం చేసిన దానాలు, సమర్పించిన నైవేద్యాలు మొదలైన అనేక వివరాలున్నాయి.
వీటి అధ్యయనం వలన స్వామి వైభవం కళ్ళకుకట్టినట్టు కనిపిస్తుంది. ఉత్సవాల సమయంలో దాతలు కట్టించిన మండపాల్లో దేవుని నిలిపి దాతల పేర్లమీద నైవేద్యాలు సమర్పించేవారు. తిరుమల తిరుపతుల్లో ఇటువంటి మండపాలు దాదాపు 200పైగా ఉన్నట్లు శాసనాలు పేర్కొంటున్నాయి. కొన్ని మండపాలు పూల తోటల్లో ఉండేవి. చాలావరకు ఉత్సవమూర్తి ఊరేగింపు మార్గంలోనే ఇవి ఉండేవి.
సాహిత్యపరంగా బ్రహ్మోత్సవాలు వేల సంవత్సరాలనుండి జరుగుతున్నప్పటికీ, శాసనాల ప్రకారం మొదటి ఆధార క్రీ.శ.966నాటి శాసనంలో ఉంది. పల్లవరాణి సామవై క్రీ.శ.966లో శ్రీనివాసునికి ఒక వెండి ఉత్సవమూర్తిని చేయించినట్లు, బ్రహ్మోత్సవాల సమయంలో ఈ ఉత్సవమూర్తిని ఊరేగించే ఏర్పాటుచేసినట్లు ఈ శాసనంద్వారా తెలుస్తున్నది. ఈ ఉత్సవం అప్పుడు పురట్టాశి మాసంలో, చిత్తా నక్షత్రంలో ప్రారంభమై, అంకురార్పణతో కలిపి పది రోజులపాటు జరుగుతున్నట్లు తెలుస్తున్నది. అప్పటినుండి అనేకమంది రాజులు, రాణులు, రాజోద్యోగులు, మత గురువులు, దేవాలయ అధికారులు, సామలు, సామాన్య భక్తులు బ్రహ్మోత్సవాలు నిరంతరం నిర్విఘ్నంగా జరగడంలో పాలుపంచుకున్నారు. ముఖ్యంగా విజయనగర యుగంలో అత్యంత వైభవంగా ఈ ఉత్సవాలను నిర్వహించేవారు.