అనంత పద్మనాభ స్వామి అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది అనంత సంపద. ఆ స్వామి దేవాలయాలు దేశవ్యాప్తంగా పలు ప్రదేశాలలో ఉన్నాయి. అలాంటి పవిత్రమైన దేవాలయం హైదరాబాద్కు చేరువలో ఉన్న అనంతగిరి పచ్చని కొండల, రమణీయ ప్రకృతిలో ఉంది. ఆ దేవాలయ విశేషాలు తెలుసుకుందాం…
అనంతపద్మనాభుడు అనగా నాభి (బొడ్డు) యందు పద్మమును కలిగి అంతము లేనివాడు అని అర్ధం. శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం శ్రీమహావిష్ణువు ఆలయం. ఈ ఆలయం వికారాబాదు సమీపంలో కలదు. దీనిని అనంతగిరి అనంతపద్మనాభ స్వామి దేవాలయం అని అంటారు. ప్రాచీన దేవాలయాల్లో ఇది ఒకటి . హైదరాబాద్కి 75 కిలో మీటర్ల దూరంలో, వికారాబాద్ పట్టణానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న అనంతగిరి కొండల్లో వెలసింది.
పురాణాలలోస్కంద పురాణం ప్రకారం ఈ దేవాలయం ద్వాపర యుగంలో “మార్కండేయ” ఋషి నిర్మించాడని ప్రతీతి. ఈ ప్రాంతంలోని ప్రశాంతమైన వాతావరనానికి ఆకర్షితుడైన మార్కండేయ ముని అనంతగిరి కొండలలో యోగ సాధన చేయుటకు సంకల్పిస్తాడు. ప్రతి రోజూ మార్కండేయ ముని తన యోగ సాధనతో అనంతగిరి నుండి కాశీ వెళ్ళి గంగా నది లో పవిత్ర స్నానమాచరించేవాడు. ఒక రోజు ఉదయం ప్రాతః కాలంలో ద్వాదశి ప్రవేశించుట వలన ఆయన కాశీకి వెళ్లలేకపోతాడు. శివుడు ఆయన స్వప్నంలో దర్శనమిచ్చి ఆయనకు గంగా జలాన్ని స్నానమాచరించుటకు ఏర్పాట్లు చేస్తాడు.
రాజర్షి ముచికుందుడు అనేక సంవత్సరాల పాటు రాక్షసులతో యుద్ధం చేసి అనంతగిరిలో విశ్రాంతి తీసుకొనుటకు వచ్చి పూర్తి నిద్రలోనికి వెళ్తాడు. ఆయన దేవేంద్రుని ద్వారా “ఎవరు ఆయన నిద్రాభంగం కలిగిస్తారో వారు అగ్నికి ఆహుతి అవుతారు” అనే వరాన్ని పొంది యున్నాడు. కాలయవనుడు అనే రాక్షసుడు ద్వారకా నగరాన్ని చేరుకుని కృష్ణుడు, బలరాములను తీసుకుని అనంతగిరి ప్రాంతానికి వచ్చి ముచికుందుని నిద్రాభంగం కలిగించి ఆయన మరణిస్తాడు.
కృష్ణుడు ముచికుందునకు “అనంత పద్మనాభస్వామి” రూపంలో దర్శనమిస్తాడు. కృష్ణుడు ముచికుందునికి శాశ్వత స్థానం ప్రపంచంలో కల్పించుటకు ఒక నది రూపం అనుగ్రహిస్తాడు. అదే నది ప్రస్తుతం మూసీ నదిగా పిలువబడుతుందని ప్రజల నమ్మకం.ఇక్కడ దేవాలయంలో స్వామి విగ్రహం తిరువనంతపురంలోని విగ్రహం మాదిరిగానే ఉంటుంది. రమణీయమైన ప్రకృతితో ఈ ప్రదేశమంతా అహ్లాదకరంగా ఉంటుంది. ధ్యానం చేసుకోవడానికి ఈ ప్రదేశం అత్యంత అనుకూలంగా ఉంటుంది.