కరోనా నేపథ్యంలో ఈ ఏడాది అమర్నాథ్ యాత్రకు రోజుకు 500 మంది భక్తులను మాత్రమే అనుమతి ఇస్తామని జమ్ము కాశ్మీర్ ప్రభుత్వం వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం జమ్మూ-కాశ్మీర్ లెఫ్టనెంట్ గవర్నర్ అడ్వైజర్ ఆర్ ఆర్ భట్నాగర్, డీజీపీ దిల్బాగ్ సింగ్ అమర్నాథ్ ఆలయాన్ని సందర్శించారు. యాత్రికుల భద్రతా ఏర్పాట్లు ఇతర అంశాలపై సమీక్ష జరిపారు.
దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఏడాది కేవలం రోజుకు 500 మంది భక్తులకు మాత్రమే అనుమతి ఇస్తామని జమ్మూ-కాశ్మీర్ చీఫ్ సెక్రటరీ బీవీఆర్ సుబ్రహ్మణ్యం శనివారం ప్రకటించారు. జమ్మూ నుంచి రోజుకు 500 మంది భక్తులు అమర్నాథ్కు వెళ్ళవచ్చని అయన తెలిపారు.
కరోనా ప్రభావం నేపథ్యంలో. జమ్మూ-కశ్మీరులో ప్రవేశించే భక్తులకు కోవిడ్-19 స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ వర్తిస్తుందని చెప్పారు. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సబ్ కమిటీతో అమర్నాథ్ యాత్ర కోసం జరుగుతున్న ఏర్పాట్లపై చీఫ్ సెక్రటరీ శనివారం చర్చించారు. జమ్మూ-కశ్మీరులో ప్రవేశించే భక్తులు తప్పని సరిగా కోవిడ్-19 పరీక్షలు చేయించుకోవాలని, నెగెటివ్ రిపోర్టు వచ్చే వరకు క్వారంటైన్లో ఉండాలని తెలిపారు. గతంలో యాత్రికుల శిబిరాలుగా ఉపయోగపడిన భవనాలను ఈ ఏడాది క్వారంటైన్ సెంటర్లుగా ఉపయోగిస్తామని చెప్పారు.
అమర్నాథ్ గుహ హిందువుల పుణ్యక్షేత్రం. ఈ ఆలయం 3,888 మీటర్ల ఎత్తులో జమ్మూ కాశ్మీర్ రాజధానికి 141 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ క్షేత్రానికి పహల్ గాం గ్రామం నుంచి వెళ్ళాలి. హిందువులకు ఈ పుణ్యక్షేత్రం అతి పవిత్రమైనది. జీవితంలో ఒక్కసారైనా దర్శించాలని కోరుకుంటారు. ఈ గుహ చుట్టూ ఎత్తైన మంచుకొండలు ఉంటాయి. వేసవి కాలంలో తప్ప మిగిలిన సంవత్సరం మొత్తం మంచుతో కప్పబడే ఉంటాయి అమర్నాథ్ కొండలు. ఆ కాలంలోనే వేలల్లో భక్తులు కొండలు ఎక్కి అమర్నాథ్ గుహను చేరుకుంటారు. ఈ గుహలో ఉండే శివుడు మంచు రూపంలో ఉంటాడు. ఈ మంచు శివలింగాన్ని చూసేందుకు ఎన్నో సవాళ్ళతో కూడిన ప్రయాణం చేస్తారు భక్తులు.