Sri Dharbaranyeswara Swamy Temple: నవగ్రహాల్లో అత్యంత శక్తిమంతుడు శని అనేది అందరికీ తెలిసిందే. ఆయన వాహనం కాకి. గోచారరీత్యా శని 12 రాశుల్లో సంచారం పూర్తి చేయడానికి మొత్తం 30 సంవత్సరాల సమయం పడుతుంది. 30 సంవత్సరాలకు ఒక సారి ప్రతి ఒక్కరిపై ఏల్నాటి శని ప్రభావం ఉంటుంది. ఏల్నాటి శని రాశిలో సంచరిస్తే వ్యవహారాల్లో చిక్కులు, వ్యాపారాల్లో ఒడిదుడుకులు, ఊహించని మార్పులు, అనారోగ్యం, తరచూ ప్రయాణాలు జరుగుతుంటాయి. శని జన్మరాశిలో సంచరిస్తే: ఆరోగ్య భంగం, నీలాపనిందలు, భాగస్వాములతో వైరం, మనశ్శాంతి లోపం, ధనవ్యయం, రుణబాధలు, వృత్తి, వ్యాపారాల్లో చికాకులు, స్థానచలన సూచనలు ఉంటాయి. శని రెండవ రాశిలో సంచరిస్తే ఆశలు కల్పించి నిరాశ కల్పిస్తాడు. రుణబాధలు, అనారోగ్యం, మానసిక ఆందోళన వంటి ఫలితాలు ఉంటాయి. శని ప్రభావం నుండి విముక్తి పొందాలంటే..ఏ క్షేత్రాన్ని సందర్శించాలి. ఆ క్షేత్ర విశిష్టతలు ఏమిటి అనేవి తెలుసుకుందాం.
కేంద్ర పాలిత ప్రాంతం పాండిచ్చేరిలో అతి పురాతన ఆలయం
శనీశ్వరుని ఆలయాల్లో అతి పురాతనమైనది ధర్బారణ్యేశ్వరుని ఆలయం. ఇది కేంద్ర పాలిత ప్రాంతం పాండిచ్చేరి రాష్టం కారైకాల్ జిల్లాలోని తిరునల్లారు పట్టణం లో ఉంది. ఈ ఆలయాన్ని సుమారు మూడు వేల సంవత్సరాలకి పూర్వం నిర్మించినట్లుగా తెలుస్తోంది. ఈ ఊరు పేరులోనే అర్ధం ముడిపడి ఉంది. నల + ఆరు నల్లారు, నల అంటే నలుడు, ఆరు అంటే విముక్తి అని అర్దం , ఆరు అన్నది తమిళపదం. నలుడు అంటే నల మహారాజు శని ప్రభావం నుంచి విముక్తి పొందిన ప్రదేశం ఇది .ఇక్కడి స్వామి వారిని దర్భారణేశ్వరుడు గా పిలుస్తుంటారు. స్వామి వారిని దర్శించే సమయంలో భక్తులు దర్భలను ముడి వేస్తుంటారు. ఈ విధంగా చేయడం వల్ల శని దోషాలు నివారించబడతాయని భక్తుల నమ్మిక.ఈ ఆలయాన్ని సందర్శించే భక్తులు ప్రమిదలలో దీపాలు వెలిగించి స్వామి వారి ముందు ఉంచుతారు. గర్భగుడిలోని పెద్ద శివలింగం దర్భారణ్యేశ్వరుడుగా పూజలు అందుకుంటారు. దర్భారణ్యేశ్వరుని పూజించుకొని ఎడమ వైపున ఉన్న అమ్మ వారి కోవెలకు వెళుతూ ఉంటే గర్భగుడి ఆనుకొని శనీశ్వరుని మందిరం వుంటుంది . అంటే ధర్బారణ్యేశ్వరునికి ద్వారపాలకునిగా శనీశ్వరుడు ఉంటారు.
దక్షిణ భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన ఆలయం
ఇక్కడ శనీశ్వరుని దర్శించుకున్న తరువాత అమ్మ వారిని దర్శించుకోవడం ఆనవాయతీ. ఇక్కడ భక్తులు యిచ్చే దానాలు , తైలాభిషేకాలు పూజారులు నిర్వర్తిస్తారు. అమ్మ వారిని ‘భోగామృత పొన్ మొళియాశ్’ అని పిలుస్తూ ఉంటారు.దక్షిణ భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన దేవాలయాలలో ఇది ఒకటిగా భావిస్తారు. శని గ్రహానికి అంకితం చేసిన నవగ్రహ ఆలయాలలో ఇది ఒకటి. భక్తులు స్వామివారికి పూజలు చేయడానికి ముందు నల తీర్థంలో స్నానం చేస్తారు. కొన్ని సంవత్సరాల నుంచి భక్తులు ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. శనీశ్వరుడి ఆలయంలో దేవుడి ఒక చేయి దీవెనలు ఇస్తున్నట్లుగా ఉంటుంది.
నల తీర్ధం పురాణ గాథ
ఈ ఆలయ సమీపంలో ఉన్న కొలను (నలతీర్ధం) కు ఓ పురాణ గాథ ఉంది. శని ప్రభావంతో నల మహారాజు జూదంలో రాజ్యాన్ని కోల్పోతారు. ఆ తర్వాత భార్య దమయంతితో కలిసి అడవులకు వెళ్లిపోవడం జరుగుతుంది. వంట వారిగా, రథాన్ని నడిపే వారిగా అనేక కష్టాలను అనుభవిస్తారు. ఆ సమయంలో పూర్వ జ్ఞానం కలిగిన నలుడు శనీశ్వరుని రకరకాలుగా స్థుతించి తనకు శని ప్రభావము నుంచి ముక్తిని కల్గించాలని ప్రార్థించగా, శనీశ్వరుడు ధర్భలతో కూడుకొని యున్న అరణ్యంలో స్వయంభూ శివలింగానికి ఎదురుగా ఉన్న కొలనులో స్నానం చేసి తడి బట్టలతో శివుని దర్శించుకుంటే విముక్తి కల్గి పూర్వ వైభవం కలుగుతుందని చెప్తారు. నలుడు శనీశ్వరుడు చెప్పిన ప్రదేశం వెతుకుంటూ వెళ్లి అక్కడ స్వయంభూ లింగాన్ని కనుగొని ఎదురుగా వున్న కొలనులో స్నానం చేసి శివలింగాన్ని దర్శించుకొని శని ప్రభావం నుంచి ముక్తి పొందాడనేది స్థల పురాణం. అందుకే ఆలయ సమీపంలో ఉన్న కొలను ను నల తీర్ధంగా పేర్కొంటుంటారు. ఇప్పటికీ భక్తులు నలతీర్ధం లో ( నలుడు స్నానం చేసిన కొలను ) స్నానం చేసి తడిబట్టలతో శివుడిని, శనీశ్వరుడిని దర్శనం చేసుకొన తిరిగి నలతీర్ధం లో స్నానం చేసి ఆ బట్టలను అక్కడే విడిచిపెట్టి కొత్తబట్టల ధరించి వెనుకకు తిరిగిచూడకుండా వెళ్లిపోతుంటారు. నలమహారాజు ఇక్కడే శని దేవుడి అనుగ్రహాన్ని పొందినందున ఇక్కడ నల దమయంతుల విగ్రహాలతో పాటు, నలతీర్థం … నల కూపం కనిపిస్తూ ఉంటాయి. వీటిని దర్శించడం వలన దోష నివారణ జరుగుతుందని భక్తుల విశ్వాసం.
రెండున్నరేళ్లకు ఒక సారి శని పెయెర్చి ఉత్సవం
ఈ ఆలయాన్ని వేలాది మంది భక్తులు సందర్శించి శని ప్రభావం నుండి విముక్తి పొందుతుంటారు. ఈ ఆలయం రెండు ప్రాకారాలలో ఉంటుంది. అయిదు అంతస్థుల గోపురంతో చాలా విశాలమైన ఈ ఆలయంలో ముఖ్య ద్వారం దాటుకొని లోపలకి వెళితే విశాలమైన ఆవరణ ఉంటుంది. ఓ పక్క ఆఫీసులు, మరో పక్క అర్చన మొదలైన సేవలకు కావలసిన టికెట్ల కౌంటర్లు ఉంటాయి. మరోపక్క నూనెదీపాలు వెలిగించి ఉంచడానికి వెదురుకర్రలతో నిర్మించిన ప్రదేశం ఉంటాయి. ఇక్కడి స్వామి వారికి నిత్య అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. ఇక ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒక సారి శని పెయెర్చి పేరుతో ఉత్సవాన్ని నిర్వహిస్తుంటారు.
ఈ క్షేత్రానికి ప్రయాణ మార్గం ఇలా
విమాన మార్గం..తిరునల్లార్ కు సమీపంలో అంటే సుమారు 150 కిలో మీటర్ల దూరంలో ట్రిచీ ఎయిర్ పోర్ట్ ఉంది. దేశంలోని ప్రధాన నగరాల నుండి మరియు చెన్నై నుండి ట్రిచీ ఎయిర్ పోర్టుకు చేరుకుని అక్కడ నుండి క్యాబ్ లేదా టాక్సీ లలో తిరునల్లూర్ చేరుకోవచ్చు. తిరునల్లార్ లో రైల్వే స్టేషన్ లేదు. తిరునల్లార్ సమీపంలోని మైలదితిరై అనే రైల్వే స్టేషన్ ఉంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుండి ఇక్కడికి రైళ్లు వస్తుంటాయి. ఇక్కడి రైల్వే స్టేషన్ కు చేరుకున్న భక్తులు క్యాబ్ లేదా ప్రభుత్వ వాహనాల ద్వారా కొద్దీ నిమిషాల్లో తిరునల్లార్ చేరుకోవచ్చు. తమిళనాడు లోని ప్రతి పట్టణం నుండి, కరైకాల్ నుండి ప్రభుత్వ, ప్రైవేటు వాహనాల్లో రోడ్డు మార్గం ద్వారా తిరునల్లార్ ను ఈజీగా చేరుకోవచ్చు.