మానవుడు కర్మబద్ధుడు. స్వతంత్రుడు కాదు. కర్మ ఫలితంగానే జన్మ ఉంటుంది. ఈ జన్మలో అనుభవించగా మిగిలిన కర్మ ఫలాన్ని మళ్లీ జన్మలో అనుభవించక తప్పదు. జీవుల కష్టసుఖాలకు, లాభనష్టాలకు ఇతరులు కారణం కాదు. భార్యా బిడ్డలు, మిత్ర సంయోగ, వియోగాలు పురాకృత కర్మ ఫలితాలే.
అష్టైశ్వర్యాలు, ఇంద్ర భోగాలను అనుభవించేవారిని కూడా కాలరూపమనే మృత్యువు వెంబడించి కబళిస్తుంది. వారు సకల సౌభాగ్యాలూ అనుభవించడానికి వారి పూర్వజన్మ సుకృతమే కారణమని రామాయణము చెబుతోంది.పురాకృత కర్మ ఫలాన్ని బ్రహ్మాది దేవతలు కూడా తప్పించుకోలేరు. ఉదాహరణకు.. ఇంద్రుడు వృత్తాసురుడనే రాక్షసుని చంపగా బ్రహ్మ హత్యా దోషం ఆయన్ను వెంబడించింది. దీంతో ఇంద్రుడు భీతచిత్తుడై పరుగెత్తి మానస సరస్సులో ఒక తామర తూడులో దూరి సన్నని తంతువుల్లో కలిసిపోయి వెయ్యి సంవత్సరములు అజ్ఞాతవాసం గడిపి కర్మ ఫలాన్ని అనుభవించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇంద్రుని బ్రహ్మ హత్యా దోషాన్ని విభజించి, పాప విముక్తి కలిగించాడు. ఇంద్రుడు అశ్వమేధయాగం చేసి మళ్లీ తన సింహాసనంపై కూర్చోగలిగాడు.
దుర్లభమైన మానవ జన్మ లభించినప్పుడే మానవులు మంచి పనులు చేయాలి. అది కూడా ఫలాపేక్ష లేకుండా చేయాలి. చేసిన మంచి పని తాలూకూ ఫలితాన్ని భగవదార్పణం చేయాలి. అప్పుడే మోక్షం లభిస్తుంది. జననమరణ చక్రభ్రమణం నుంచి ముక్తి కలుగుతుంది. పుణ్య పాప కర్మలు మిశ్రమముగా పక్వానికి వచ్చినప్పుడు జీవుడు మానవ జన్మ ఎత్తుతాడు. కర్మ ఫలముగా సుఖములను, దుఃఖములను అనుభవిస్తాడు. కర్మ ఫలముని అనుభవించటమే కాక కొత్త కర్మలు కూడా చేసే అవకాశం కేవలం మానవ జన్మలోనే కలుగుతుంది. పరమాత్మని అందుకోవడానికి కావలసిన కర్మలు చేసే అధికారం, జ్ఞానం వున్నా ఈ మానవ జన్మ ఉత్తమోత్తమమైనది, దుర్లభమైనది. “జంతూనాం నర జన్మ దుర్లభం” అని శంకరులు వివేక చూడామణి లో తెలియచేసారు. ఇలాంటి ఉత్తమమైన మానవ జన్మని సార్ధకం చేసుకోడానికి ప్రతి ఒక్కరు కృషి చెయ్యాలి.