ప్రపంచ వ్యాపంగా అన్ని దేశాలను కరోనా కుదిపేస్తున్న విషయం తెలిసిందే. నేటి వరకూ దేశంలో 32,34,474 కరోనా కేసులు నమోదు కాగా 59,449 మంది మరణించారు. 24,67,758 మంది చికిత్స అనంతరం కోలుకొని డిశార్జ్ అయ్యారు. 7,07,267 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మన రాష్ట్రం ఎపిలో చూసుకున్నట్లయితే 3,71,639 మందికి కరోనా సోకగా 2,78,247 మంది కోలుకుని ఆసుపత్రుల నుండి డిశార్జ్ అయ్యారు. 3460 మంది మృతి కరోనా మృతి చెందగా 89,932 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా మహామ్మారి ప్రభావం అన్ని రకాల వేడుకలు,, వివిధ మతాల ఉత్సవాలపైై కూడా పడింది. కరోనా ప్రభావం కారణంగా వినాయక చవితి నవరాత్రి వేడుకలపైనా పడింది. బహిరంగ ప్రదేశాలలో నవరాత్రి ఉత్సవాల నిర్వహణను ప్రభుత్వం నిషేదించిన విషయం తెలిసిందే. అదే మాదిరిగా నెల్లూరులో ప్రతి ఏటా కుల, మత, ప్రాంతాలకు అతీతంగా పెద్ద ఎత్తున జరిగే రొట్టెల పండుగపైనా కరోనా ప్రభావం పడింది.
ప్రతి ఏటా మొహరం పండుగ ముగిసిన మూడవ రోజున నెల్లూరు పట్టణం లోని స్వర్ణాల చెరువులో పెద్ద ఎత్తున రొట్టెల పండుగ జరుగుతుంటుంది. వందల సంవత్సరాల నుండి ఈ పండుగ పెద్ద వేడుకగా జరుగుతుండటం ఆనవాయితీ. ఇక్కడ రొట్టెలు మార్చుకుంటే కోరిన కోర్కెలు తీరతాయని భక్తుల నమ్మిక. ఈ నమ్మకం భక్తుల్లో బాగా ప్రబలడంతో ఆ జిల్లా ప్రజలే కాక ఉభయ తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, కర్నాటక, కేరళ, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన వారితో పాటు ఈ పండుగపై నమ్మకం తో విదేశాల నుండి భక్తులు తరలివస్తుండటం జరుగుతోంది. లక్షలాది మంది భక్తులు ఈ వేడుకలో పాల్గొని ఒకరి కొకరు రొట్టెలు మార్చుకోవడం జరుగుతుంది. తొలి నాళ్లలో ఈ పండుగ ఒక రోజు మాత్రమే జరగ్గా రానురాను ఈ పండుగను అయిదు రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ఈ రొట్టెల పండుగకు ప్రాచుర్యం బాగా పెరగడంతో దీనికి రాష్ట్ర పండుగ హోదా కూడా లభించింది.
రెట్టెల పండుగకు లక్షలాది మంది భక్తులు పాల్గొని రొట్టెలను మార్చుకుంటే కరోనా తీవ్ర స్థాయిలో విజృంభించే ప్రమాదం ఉన్న కారణంగా వందల ఏళ్లుగా జరుగుతున్న ఈ పండగపై ప్రభుత్వం నిషేదం విధించింది. అక్కడి బారాషహీద్ దర్గాలో ఈ నెల 30 వ తేదీ నుండి సెప్టెంబర్ మూడవ తేదీ వరకూ అయిదు రోజుల పాటు గంధ మహోత్సవం నిర్వహణకు మాత్రమే అనుమతి ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే ఈ గంధ మహోత్సవం కూడా కేవలం 20 మందితోనే నిర్వహించు కోవాలని ఆంక్షలు విధించినట్లు సమాచారం.