శ్రావణమాసం అమావాస్యను పొలాల అమావాస్య అంటారు. ఈరోజు అనేక ప్రాంతాలలో పశువులను, చెట్లను, పాడిని పూజిస్తారు. అయితే ఈ రోజు కొందరు వ్రతం కూడా చేసుకుంటారు..
ఒక కుటుంబం లో ఏడుగురు కొడుకులు. అందరికీ పెళ్లిళ్ళు చేస్తారు. అందులో, ఏడో కోడలికి ఏట పిల్లాడు పుడతాడు. కానీ పోలాల అమావాస్యరోజు చనిపోతాడు. అలాగా ఆరు సంవత్సరాలు జరుగుతుంది. అప్పటికే ఆమె తోడికోడళ్ళు దెప్పటం మొదలుపెడతారు – ఆమె వలన వారు ఆపండుగ జరుపుకోలేకపోతున్నారు అని. ఆ బాధ భరించలేక ఏడవ సంవత్సరం పిల్లాడు కోన ఊపిరితో ఉండగానే అతడిని ఒక చాపలో చుట్టేసిఉంచేస్తుంది. అందరూ పూజ చేసుకుంటారు. అది అయ్యాక, ఆమె ఆ బాబుని భుజం మీద వేసుకుని స్మశానానికి ఏడుస్తూ వెళ్తుంది.
అదిచూసిన పార్వతీపరమేశ్వరులు వృద్ధదంపతుల రూపంలో ఎదురయ్యి “ఎవరమ్మా నీవు? ఎవరా బాబు? ఎందుకు ఏడుస్తున్నావు?” అనిఅడుగుతారు. దానికి ఆమె – “ఎవరైతే ఏమిటమ్మ – మీరు ఆర్చేవారా తీర్చేవారా?” అని అడుగుతుంది. దానికి వారు – “మేమే ఆర్చేవారము -తీర్చేవారము – చెప్పవమ్మా” అంటారు. ఆమె తన గోడు చెప్పుకుంటుంది. వారు ఓదార్చి అంతా శుభం కలుగుతుంది అని చెప్పి వెళ్ళిపోతారు.అప్పుడు ఆమె భుజం మీద ఉన్నా బిడ్డతో సహా, ఇదివరకు చనిపోయిన బిడ్డలు కూడా లేచి వచ్చేస్తారు.
వారిని చూసిన ఆశ్చర్యంలో ఆదంపతులను చూద్దాం అని తిరిగేసరికి వారు ఉండరు. అప్పుడు – అది పార్వతీపరమేశ్వరులు అని తెలుసుకుని ఆనందంగా ఇంటికివెళ్ళిపోతుంది. అక్కడ ఆమె తోడికోడళ్ళు ఈమె అదృష్టానికి అబ్బురపోయి క్షమార్పణ చెప్పుకుంటారు. అప్పటినుండి ఆమె ప్రతి ఏటతప్పకుండా పోలాల అమావాస్య పూజ జరుపుకుంటుంన్నారు.”
ఆ కథ అక్షింతలు చదివినవాళ్ళు, విన్నవాళ్లు తలపై వేసుకుంటారు. తరువాత పూజలో పసుపు కొమ్ముకు దారం కట్టి తోరం చేసి ఆ తోరాన్ని పూజ అయ్యాక ఆ పసుపుకోమ్మును చిన్నపిల్లలుకు కడతారు. అది వారికి రక్షగా వుంటుంది అని భావిస్తారు.