మానవుల జీవితం ఏ క్షణం ఏమవుతుందో ఎవరికి తెలియదు. నిత్యం ఏదో ఒక బాధ, ప్రమాదం ఎప్పుడు ఏ ఉపద్రవం వస్తుందో ఎవరు ఊహించలేం.
అయితే వీటన్నింటి నుంచి రక్షించుకోవడానికి మన పూర్వీకులు అనేక పరిష్కారాలు చెప్పారు, వాటిలో మహామృత్యుంజయ మంత్రం ఒకటి. దీన్ని నిత్యం పారాయణం చేస్తే పెద్ద ప్రమాదాలు కాస్తా భరించగలిగేస్థాయిలో వస్తాయి. ఈ మంత్రం విశేషాలు తెలుసుకుందాం… మానవుడి ఆయురారోగ్యాన్ని, శాంతిని, తృప్తిని ఇచ్చేది మహా మృత్యుంజయ మంత్రం. ఇది శుక్లయజుర్వేద మంత్రం. శైవులు దీనిని రుద్రాభిషేకంలో, వైష్ణవులు పాచరాత్ర దీక్షలో హోమ భస్మధారణ మంత్రంగా చెప్పుకుంటారు. ఈ మంత్రం పరమ పవిత్రమైనది, క్షీర సాగర మథనంలో జనించిన హాలాహలాన్ని పరమ శివుడు దిగమింగి మృత్యుంజయుడు అయ్యాడు. ఇది ఒక విధమైన సంజీవని మంత్రం అని చెప్పుకోవచ్చు. ఆపదలు కలిగినపుడు, అనూహ్య సమస్యలు ఎదురైనప్పుడు కూడా దీనిని చదువుకోవచ్చును. ఈ మంత్రానికి సర్వ రోగాలను తగ్గించే శక్తి ఉంది. ఈ మృత్యుంజయ మంతాన్ని శ్రద్ధతో పఠిస్తే, అకాలమృత్యువులు, ప్రమాదాల నుంచి రక్షణ లభిస్తుంది.
మంత్రం
‘‘ ఓం త్రయంబకం యజామహే
సుగంధిం పుష్టి వర్ధనం
ఉర్వారుక మివ బంధనాత్
మృత్యోర్ ముక్షీయ మామృతాత్’’
తాత్పర్యం: అందరికి శక్తి నొసగే ముక్కంటి దేవుడు, సుగంధ భరితుడు అయిన పరమ శివుని నేను (మేము) పూజించుచున్నాం. ఆయన దోస పండును తొడిమ నుంచి వేరు చేసినట్టుగా (అంత సునాయాసముగా లేక తేలికగా) నన్ను (మమ్ము) అమరత్వం కొరకు మృత్యు బంధనం నుంచి విడిపించు గాక.
ఈ మంత్రాన్ని సాధారణంగా ౩ గాని, 9 మార్లు గాని, లేదా త్రిగుణమైన సంఖ్య లెక్కన దీనిని పారాయణం చేస్తారు. ఈ మహా మృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల, దైవ ప్రకంపనలు మొదలై, మనలను ఆవరించి ఉన్న దుష్ట శక్తులను తరిమికొడతాయి. దాంతో మంత్రాన్ని పఠించినవారికి ఓ శక్తివంతమైన రక్షణ కవచం ఏర్పడుతుంది. ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు, దురదృష్టాల నుంచి బయటపడేందుకు, ఈ మహా మృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తుంటారు. ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని ప్రాత: కాలన్నే 108 సార్లు, ప్రదోషకాలంలో 108 సార్లు పఠిస్తే ఎటువంటి రోగాలు దరిచేరవు.
ఏ మంత్రం అయినా భక్తి, శ్రద్ధలతో నియమనిష్టలతో పారాయణం చేస్తేనే ఫలితం లభిస్తుంది. విశ్వాసం ముఖ్యం.