తిరుమల అంటే చాలు అందరికీ గుర్తుకువచ్చేది శ్రీవారు. తిరుమల కొండ పాదభాగన వెలిసిన శివుడే కపిలేశ్వరుడు. ఆ క్షేత్ర విశేషాలు తెలుసుకుందాం…తిరుమల తిరుపతి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పుణ్య క్షేత్రం. ఇక్కడ శ్రీవేంకటేశ్వరుని ఆలయంతోబాటు అన్నీ వైష్టవాలయాలే… గోవిందరాజ స్వామి ఆలయం
కోదండ రామాలయం, కళ్యాణ వేంకటేశ్వరాలయము, వరదరాజ స్వామి ఆలయము, పద్మావతి అమ్మవారి ఆలయం మొదలగునవన్నీ వైష్ణవాలయాలే. కాని తిరుమల కొండ పాద భాగాన అలిపిరికి అతి సమీపంలో ఒక శివాలయమున్నది. అదే కపిల తీర్థము. కపిలతీర్థం శేషాద్రికొండ దిగువన, ఏడుకొండలకు వెళ్ళే దారిలో ఉంది. కపిల తీర్ధమునకు చక్రతీర్థం లేదా ఆళ్వార్ తీర్థం అని కూడా పిలుస్తారు. కృతయుగములో పాతాళలోకంలో కపిలమహర్షి పూజించిన కపిలేశ్వరస్వామి, ‘కపిలలింగం’గా పేరొందింది. త్రేతాయుగములో అగ్ని పూజించిన కారణంగా ‘ఆగ్నేయలింగం’ ఇది.
సాధారణంగా శివక్షేత్రాలలో విష్ణువు, వైష్ణవ క్షేత్రాలలో శివుడు క్షేత్రపాలకుడిగా ఉంటారు. ఇక్కడ తిరుమలకు క్షేత్రపాలకుడు శివుడు కాబట్టి ఆయన ఈ కొండకింద వెలిసాడని కొందరు పేర్కొంటారు.ఈ ఆలయం తి.తి.దే. వారి ఆద్వర్యంలో ఉంది, శివరాత్రి పండుగ, బ్రహ్మొత్సవాలు వైభవంగా జరుగుతాయి.. గొప్ప వైష్ణవ క్షేత్రమైన తిరుపతిలో ఓ శైవక్షేత్రం కూడా ఉంది. అదే కపిలతీర్థం. తిరుపతికి ఉత్తరంగా, తిరుపతి కొండలకు ఆనుకుని అలిపిరి దిగువకు వెళ్తే మనోహరమైన ఈ తీర్థం కనిపిస్తుంది. ముఖ్యంగా, వర్షాకాలంలో ఇక్కడకు వస్తే… ప్రకృతి సుందర జలపాత దృశ్యాలు చూపుతిప్పనివ్వవు. ఇక్కడి ప్రశాంత వాతావరణం.
ఈ తీర్థం ఎలా ఏర్పడిందంటే…కృతయుగంలో కపిల మహర్షి ఇక్కడ ఈశ్వరుని కోసం ఘోర తపస్సు చేశాడట. ఆ తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు పాతాళంనుంచి భూమిని చీల్చుకుని ఇక్కడ వెలిశాడని స్థలపురాణం. కపిలముని తపస్సు కారణంగా ఇక్కడ కొలువైనది ఈశ్వరుడు కాబట్టి ఈ స్వామికి కపిలేశ్వరుడు అని పేరు వచ్చింది. ఇక్కడి లింగాన్ని కూడా కపిల లింగం అంటారు. ఆ తరువాత త్రేతాయుగంలో అగ్నిదేవుడు ఈ క్షేత్రంలో ముక్కంటిని పూజించాడట. అందువల్ల, ఈ లింగాన్ని ఆగ్నేయ లింగమనికూడా పిలుస్తారు. ఇక్కడ కపిలేశ్వరుడు కామాక్షీదేవి సమేతంగా కొలువయ్యాడు. ఈ ఆలయానికి ఉన్నత శిఖరమా అనిపించేలా ఉంటాయి తిరుమల కొండలు.
ఆ కొండలమీది నుంచి గలగలా పారుతూ, 20 అడుగుల ఎత్తునుంచి ఆలయ పుష్కరిణిలోకి దూకుతుంది ఆకాశగంగ. ఈ పుష్కరిణినే కపిలతీర్థం అంటారు. ఈ తీర్థాన్ని శైవులు కపిల తీర్థమనీ, వైష్ణవులు ఆళ్వార్ తీర్థమనీ పిలుస్తారు. కపిలతీర్థంలో కపిలేశ్వర స్వామితోపాటు కాశీవిశ్వేశ్వరుడు, సహస్రలింగేశ్వరుడు, లక్ష్మీనారాయణుడు, శ్రీకృష్ణుడు, అగస్త్యేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు కూడా ఉన్నారు.ఈసారి తిరుపతి వెళ్లినప్పుడు తప్పక ఈ క్షేత్రాన్ని సందర్శించి రండి. ఈ క్షేత్రం ప్రకృతిశోభతో పరమపావనంగా శోభిస్తుంటుంది.