తిరుమల శ్రీవారిని ఏడుకొండలూ ఎక్కి చూడలేకపోతేనేం.. స్వయంభువుగా ప్రత్యక్షమైన చిన్న తిరుపతి అయినా చూస్తే చాలు అనకుంటారు చాలామంది భక్తులు.పరమ పవిత్రమైన “ద్వారకా తిరుమల”ను దర్శించుకుంటుంటారు. అయితే ఆ క్షేత్ర విశేషాలు, పురాణగాథలను తెలుసుకుందాం…
ఏలూరు పట్టణం నుంచి 42 కిలోమీటర్ల దూరంలోనున్న శేషాద్రి కొండపైన శ్రీ వేంకటేశ్వర స్వామివారు “ద్వారకా తిరుమల”లో కొలువుదీరి ఉన్నారు. స్వయంభువుగా ప్రత్యక్షమైన స్వామివారిని చీమలపుట్ట నుంచి వెలికి తీసిన ద్వారక అనే ముని పేరు మీదుగా ఈ ఆలయానికి ద్వారకా తిరుమల అనే పేరు వచ్చనట్లు పూర్వీకుల కథనం. సుదర్శన క్షేత్రమైన ఈ ద్వారకా తిరుమల చిన్న తిరుపతిగా కూడా ప్రసిద్ధి చెంది.. అశేష భక్త జనావళి నీరాజనాలు అందుకుంటోంది.
” తిరుమల” స్వామివారికి మ్రొక్కిన మ్రొక్కును “చిన్న తిరుపతి”లో తీర్చుకున్నా అదే ఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం. అయితే చిన్నతిరుపతిలో తీర్చుకునేందుకు మ్రొక్కిన మ్రొక్కును చిన్నతిరుపతిలోనే తీర్చుకోవాలని భక్తులు, స్థానికులు ప్రగాఢంగా నమ్ముతుంటారు. ఇక్కడ స్వామివారిని కలియుగ వైకుంఠ వాసునిగా భావించి సేవిస్తారు. తిరుపతికి వెళ్ళలేని భక్తులు తమ ముడుపులను, తలనీలాలను, మొక్కుబడులను ఇక్కడ సమర్పిస్తే తిరుపతి స్వామివారికి చెందుతాయని భావిస్తారు.
స్థల పురాణం
ఈ క్షేత్రం రాముని తండ్రి దశరథ మహారాజు కాలం నాటిదని భావిస్తారు. “ద్వారకుడు” అనే రుషి తపసు చేసి స్వామివారి పాదసేవను కోరాడు. కనుక పాదములు పూజించే భాగ్యం అతనికి దక్కింది. పైభాగము మాత్రమే మనకు దర్శనమిస్తుంది. విశిష్టాద్వైత బోధకులైన శ్రీ రామానుజాచార్యులు ఈ క్షేత్రాన్ని దర్శించినారనీ, అందరూ స్వామి పాదపూజ చేసుకొనే భాగ్యం కలిగించడానికి మరొక నిలువెత్తు విగ్రహాన్ని స్వయంవ్యక్త ధ్రువమూర్తికి వెనుకవైపు పీఠంపై వైఖాన సాగమం ప్రకారం ప్రతిష్ఠించారని అంటారు. స్వయంభువుగా వెలసిన, అర్ధభాగం మాత్రం దర్శనమిచ్చే, ప్రతిమను కొలిచినందువలన మోక్షం సిద్ధిస్తుందనీ, తరువాత ప్రతిష్ఠింపబడిన పూర్తిగా కనుపించే ప్రతిమను కొలిచినందువలన ధర్మార్ధకామ పురుషార్ధములు సమకూరుతాయనీ భక్తుల విశ్వాసం.
ఇక.. ద్వారకా తిరుమలలోని స్వామి వారికి అభిషేకం చేయకపోవటం మరో విశేషంగా చెప్పవచ్చు. ఎందుకంటే.. స్వామివారిపై ఒక చిన్న నీటి బొట్టుపడినా.. అది స్వామివారి విగ్రహం క్రిందనుండే ఎర్రచీమలను కదుల్చుతుందని అభిషేకం చేయరు. గుడి సంప్రదాయం ప్రకారం ప్రతి సంవత్సరం వైశాఖ, ఆశ్వయుజ మాసాలలో రెండు కళ్యాణోత్సవాలు జరుపుతుంటారు. ఎందుకంటే.. స్వామివారు స్వయంభువుగా వైశాఖ మాసంలో దర్శనమిచ్చారనీ, సంపూర్ణ విగ్రహాన్ని ఆశ్వయుజ మాసంలో ప్రతిష్టించిన కారణంగా అలా చేస్తుంటారు.
ప్రస్తుతం ఉన్న ద్వారకా తిరుమల ఆలయాన్ని మైలవరం జమీందారులు కట్టించారట. విమాన మంటపము, గోపురము, ప్రాకారాలను అప్పారావు అనే వ్యక్తి… బంగారు ఆభరణాలు, వెండి వాహనాలను రాణీ చిన్నమ్మరావు స్వామివారికి సమర్పించినట్లు ఇక్కడ చెప్తారు.
మెట్లు ఎక్కేప్రారంభంలోని పాదుకా మండపంలో స్వామివారి పాదాలుంటాయి. శ్రీవారి పాదాలకు నమస్కరించిన తరువాతే భక్తులు పైకి ఎక్కుతారు. పైకి వెళ్లే మెట్ల మార్గంలో రెండు వైపులా దశావతార విగ్రహాలు భక్తుల్ని పరవశింపజేస్తాయి. మెట్లకు తూర్పున అన్నదాన సత్రం, ఆండాళ్ సదనం.. పడమటివైపు పద్మావతీ సదనం, దేవాలయ కార్యాలయం, నిత్య కళ్యాణ మండపాలుంటాయి.
గర్భగుడిలో స్వయంభువు శ్రీ వేంకటేశ్వర స్వామి అర్ధ విగ్రహం, రామానుజులుచే పూర్తిగా ప్రతిష్టింపబడిన వేంకటేశ్వరస్వామి ప్రతిమలు కన్నుల పండువగా దర్శనమిస్తాయి. ఆ ప్రక్కనే కుడివైపు అర్ధ మంటపంలో తూర్పు ముఖంగా మంగతాయారు, అండాళ్ (శ్రీదేవి, భూదేవి) అమ్మవార్లు కొలువై ఉన్నారు. శుక్రవారం అమ్మవార్లకు విశేష కుంకుమపూజను నిర్వహిస్తుంటారు.
ఆలయం పశ్చిమాన స్వామివారి పుష్కరిణి ఉంది. దీనిని సుదర్శన పుష్కరిణి అని, నరసింహ సాగరమని, కుమార తీర్ధమనీ భక్తులు పిలుస్తుంటారు. ఇక్కడ చక్ర తీర్ధము, రామ తీర్ధము అనే రెండు స్నానఘట్టాలున్నాయి. ఇక్కడి రాళ్ళపై సుదర్శన (చక్రం) ఆకృతి ఉన్నందున ఆ పేరు వచ్చింది. ఇక్కడ ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ ద్వాదశి (క్షీరాబ్ధి ద్వాదశి) నాడు తెప్పోత్సవం జరుపుతారు.
బ్రహ్మపురాణం ప్రకారం కృష్ణ, గోదావరి నదులతో పూదండలా ఆవరించబడిన ఈ పవిత్ర ప్రదేశం చాలా ప్రభావవంతమైనది. అందుకే స్వామివారి కటాక్ష వీక్షణాలకై ఎన్నో ప్రాంతాల నుండి భక్తులు ద్వారకా తిరుమలకు తరలివస్తుంటారు.
ద్వారకా తిరుమలకు రవాణా సౌకర్యం
విజయవాడ – రాజమండ్రి మార్గంలో ఏలూరుకు 41 కి.మీ., భీమడోలుకు 17 కి.మీ., తాడేపల్లి గూడెంకు 47 కి.మీ. దూరంలో ఉంది. ఏలూరు, తాడేపల్లి గూడెంలలో ఎక్స్ప్రెస్ రైళ్ళు ఆగుతాయి. భీమడోలులో ప్యాసింజర్ రైళ్ళు ఆగుతాయి. ఈ పట్టణాల నుండి, చుట్టుప్రక్కల ఇతర పట్టణాల నుండి ప్రతిరోజూ ఏపీఎస్ఆర్టీసీ బస్సులను నడుపుతోంది.