మనిషి జీవితంలో ఎలా బతకాలి.. దేవుడిని ఏం కోరుకోవాలి.. ఈ జీవితాన్ని ఎలా గడపాలి.. ఎలా ముగించాలి.. ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల గురించి ఓ చక్కటి శ్లోకం ఉంది. అది జీవిత సత్యాలను ఆవిష్కరిస్తుంది. మనకు మార్గం చూపుతుంది. గుడికి వెళ్లినప్పుడు…. దర్శనం అయ్యాక.. గుడి నుండి బయటకు వచ్చే ముందు గుడి మండపంలో కానీ.. ప్రాకారం లోపల కానీ.. కొంతసేపు కూర్చుని ఈ శ్లోకం చదవాలి.
అది ఏమిటంటే.. “అనాయాసేన మరణం.. వినాధైన్యేన జీవనం.. దేహాంతే తవ సాన్నిధ్యం
దేహిమే పరమేశ్వరం.” దీని అర్ధం ఏమిటంటే.. “అనాయాసేన మరణం”.. అంటే.. నాకు నొప్పి లేక బాధ కానీ లేని తేలికైన మరణాన్ని ప్రసాదించు అని. ఇదేమి కోరిక అనిపిస్తుంది కానీ.. చాలా మంది జీవితాంతం మహరాజుల్లా బతికి చివరకు మరణం ముందు దారుణమైన బాధ అనుభవిస్తారు.
ఈ లోకం లోకి రావడం, ఈ లోకం నుంచి వెళ్లడం రెండూ మన చేతుల్లో లేవు. ఈ లోకం నుంచి నొప్పి లేకుండా వెళ్లిపోవడం ఓ వరమే. ఇక రెండోది.. “వినా ధైన్యేన జీవనం” అంటే.. ఎవరి మీదా ఆధారపడకుండా, నేను జీవితంలో ఎవరి ముందూ తలవంచకుండా, ఎవరినీ నొప్పించకుండా, నేను ఎవరి వద్దా చులకన కాకుండా ఉండే జీవితాన్ని ప్రసాదించు అని.
ఇక చివరిది.. “దేహాంతే తవ సాన్నిధ్యం”.. అంటే.. మృత్యువు నావద్దకు వచ్చినప్పుడు నేనునిన్ను దర్శించుకునే విధంగా దీవించు… దేహిమే పరమేశ్వరా.. అంటే.. ఓ పరమేశ్వరా నాకు ఈ క్రింది మూడు వరములను ప్రసాదించమని నిన్ను ప్రార్ధిస్తున్నాను. ఈమూడు వరాలు మనకు లభిస్తే.. జీవితం ధన్యమే. పనిగట్టుకుని భగవంతుడిని పూజ మందిరం లో నే సేవించాలని ఏమి లేదు . ప్రతి నిత్యం నామస్మరణా చేస్తూనే పనుల్లో మునిగి ఉంటె పరమాత్ముడు తప్పకుండ అనుగ్రహిస్తాడు .