నయనార్లు అంటే తెలియన భక్తులు ఉండరు. శివ భక్తిలో పండిపోయి ఆ స్వామి అనుగ్రహం పొందిన వారే నయనార్లు. వీరందరూ ఆయా ప్రాంతాలకు, ఆయా కులాలకు అతీతంగా స్వామి అనుగ్రహం పొందారు.
ఎక్కువమంది పేదలు, సామాన్యులు.. కానీ వారి భక్తి మాత్రం అనన్యం. అలాంటి నయనార్లలో తొండనాయనారు ఒకరు. ఆయన విశేషాలు తెలుసుకుందాం…తొండైమండలం ఒక ఊరు. దీనికి కంచి ముఖ్యపట్టణం. ఆగమముల ప్రకారం.. ఇచ్చట పార్వతీదేవి శివుని గూర్చి తపమొనరించినది. ఇచ్చట శివుడు ఏకామ్రనాథుడుగా పిలువబడుతాడు.
తిరుత్తొండారు ఇచ్చటనే జన్మించినాడు. రజకుడుగా పుట్టాడు. శివధ్యానైక తత్పరుడు. శివభక్తులను ఆదరించేవాడు. సేవించేవాడు. వారి ముఖాల్ని చూచి, వారల అవసరములు గుర్తెరిగి వాళ్ళకు సహాయ మందించేవాడు. అందుకని అతనికి తిరుకురిప్పు తొండనాయనారు అని పేరు వచ్చింది. శివభక్తుల బట్టలను ఉతికేవాడు. శివుడు ఇతని భక్తికి మెచ్చి అందరికి అతని విశేషము తెలియపర్చాలనుకున్నాడు.
శివుడు ఒక పేదవానిగా రూపొంది, మెడకు రుద్రాక్షలతో, దేహమంతా విభూతి పుండ్రములతో, చిరిగిపోయిన దుస్తులతో తిరుత్తొండారుకు ప్రత్యక్షమయ్యాడు. అతనిని చూడగానే తిరుత్తొండారుకు మైకం కమ్మింది. తేరుకుని, అతనిని కొలిచాడు. అతనిని ప్రశ్నించాడు. “స్వామీ! మా ఇల్లు, మీ రాకతో పావనమయింది. ఎందుకని మీరు చిక్కిపోయారు? మీ దుస్తులను ఉతికి పెట్టనీయండి. మీకు సేవ చేయనీయండి” అని అర్థించాడు. ఆ శివ భక్తుడు ఒక షరతుతో ఆ బట్టలను ఉతుకుటకు అనుమతిచ్చాడు. ఆ షరతు: ఆ బట్టలు ఉతికి, ఆరవేసి తనకు సూర్యాస్తమయం లోపల అందజేయాలి. లేని యెడల ఒక్కచిక్కిన తను, చలికి చనిపోతాడు అని:” తొండారు ఇందుకు అంగీకరించాడు.
అంగీకరించే సమయానికి ఎండ బాగానే వుంది. వెంటనే ఆ బట్టలను ఉతికాడు. ఆరవేసే సమయానికి పెద్దవాన మొదలిడింది. సూర్యుడస్తమించే సమయం వచ్చింది. ఆ బట్టలు ఆరే పరిస్థితి కనబడలేదు. తొండారు తబ్బిబ్బయ్యాడు. శివభక్తునికి తాను సహాయము చేసే బదులు అతనిని కష్టాలపాలు చేసే స్థితికి వచ్చింది. ఈ పాపాన్ని తలుస్తూ ఆ బట్టలుతికే రాయికి తన తలను వేసి కొట్టుకున్నాడు. దేవుని ప్రార్థించాడు. పరిస్థితిని చూచి ఆక్రందించాడు.
శివుడు ఆ ఆక్రందనకి కరిగి ప్రత్యక్షమై తొండారును అభినందించి, భక్తికి మెచ్చుకొని – ‘త్వరలో నన్ను చేరగలవు. నా దగ్గరే వుండగలవు’ అని అనునయంగా పల్కాడు. తొరుత్తొండారు పరవశించి, శివుని పాదములై బడి తన్మయత్వంతో శివుని నుతించాడు. నయనార్లలో అనేక విశేషాలు వారి చరిత్రను స్మరించుకుంటే చాలు ఆ భోళాశంకరుడు అనుగ్రహం లభిస్తుంది.