తిరుమల బ్రహ్మోత్సవాలు అంటే అంగరంగ వైభోగంగా జరిగే పవిత్ర ఉత్సవాలు. సాక్షాత్తు శ్రీమన్నరాయణుడు భక్తులను కరుణించి వేంచిసి ఉన్న తిరుమలలో ఏటా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
అయితే వాటికి సంబంధించిన చారిత్రక ఆధారలలో దానాల గురించి నేడు తెలుసుకుందాం… పాలకులు మొదలుకొని సామాన్య ప్రజలవరకు బ్రహ్మోత్సవాల నిర్వహణకోసం అనేక దానాలుచేశారు. అనేకమంది గ్రామాలను, భూములను, ధనాన్ని దానంగా ఇచ్చి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగడానికి తోడ్పడ్డారు. దేవాలయ అధికారులు ఆ దానాల్ని స్వీకరించి దాతలు కోరినట్లుగా ఉత్సవ రోజుల్లో వాహనాల అలంకరణకోసం, ధూప దీప నైవేద్యాలకు, అంగరంగ భోగాలకు ఏర్పాట్లుచేసేవారు. కొందరు బ్రహ్మోత్సవాల్లో ఒక్కోరోజు జరిగే రథోత్సవం, గరుడోత్సవం లాంటి ఉత్సవాలు జరగడానికి ఏర్పాటుచేశారు.
కొందరు పూజలకు, నైవేద్యాలకు దానాలుచేశారు. నైవేద్యానికి పెట్టే పదార్థం, దాని తయారీకి వాడాల్సిన వస్తువులు, వాటి పరిమాణంకూడా నిర్ణయించిన వివరాలు శాసనాల్లో అనేకం ఉన్నాయి. నైవేద్యం పెట్టిన తరువాత దాత భాగానికి వచ్చే ప్రసాదాన్ని కొందరు దాతలు అన్నసత్రాలకు, మఠాలకు సంక్రమింపజేసేవారు. అప్పపడి, సుగియన్ పడి, అతిరసప్పడి, తిరుక్కణామడై, శ్రీడైప్పడి, ఇద్దిలిపడి, తిరుప్పోనాకాం, దద్యోదనం మొదలైన నైవేద్యాల వివరాలు శాసనాల్లో తరచుగ కనిపిస్తాయి. ఏ మండపంలో ఏ నైవేద్యం సమర్దించాలో కొందరు దాతలు సూచించారు. కొందరు ఒక రోజు ఉత్సవానికి అవసరమయ్యే నైవేద్యంకోసం దానం చేస్తే, కొందరు సంవత్సరం పొడవునా జరిగే అన్ని బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లుచేశారు.
కొందరు బంగారు నాణేలను సమర్పించారు. శాసనాల్లో కళంజు, చక్రపొన్, రేఖైపొన్, వరాహేలు, గట్టవరహాలు, పొన్, మాడ, పణం, నర్పణం మొదలైన నాణేల వివరాలు అనేక శాసనాల్లో కనిపిస్తాయి. మామూలు రోజుల్లోకంటే బ్రహ్మోత్సవ సమయాల్లో భక్తులు అధికంగా ఉంటారు కాబట్టి ప్రసాదాలు కూడా ఎక్కువగా తయారుచేసేవారు. అందుకే ఇటువంటి ఉత్సవాల సమయంలో దాతల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. దాతలు నిర్దేశించినట్లుగా నైవేద్యాలు, ఇతర సేవలకు వినియోగించి మిగిలిన ధనంతో చెరువుల్ని తవ్వించడం, మరమ్మత్తులు చేయించడంలాంటి ప్రజాసంక్షేమ కార్యక్రమాలకు వినియోగించేవారు. అప్పటి సమర్ధవంతమైన దేవాలయ పరిపాలనా వ్యవస్థకు ఇదొక మంచి ఉదాహరణగా భావించవచ్చు.