కార్తీక మాసం అనగానే దీపారాధన, తులసి పూజ, వనభోజనాలు, కార్తీక స్నానం వంటి వాటికి ప్రత్యేకం. వీటితోపాటు పెద్దలు ఈ నియమాలన్నింటికీ ఉసిరిని కూడా జోడించారు.
ఉసిరికాయ మీద వత్తిని వెలిగించడం, క్షీరాబ్ది ద్వాదశినాడు తులసితో పాటుగా ఉసిరిని కూడా పూజించడం, ఉసిరి చెట్టు నీడన వనభోజనాలు చేయడం, వీలైతే ఉసిరి నీడ పడుతున్న నీటిలో స్నానం చేయడం వంటి ఆచరణలు మంచివని సూచించారు. మన ఆరోగ్యానికీ, పర్యావరణానికి మేలు చేసే వృక్షాలను దేవతా మూర్తులుగా భావించి కొలవడం మన ఆచారాలలోని గొప్ప విషయం. అందుకనే అత్యంత విశిష్టమైన తులసితో పాటుగా ఉసిరికి కూడా కార్తీక మాసంలో ప్రాధాన్యత ఇచ్చారు.
ఉసిరి పురాణగాధ క్షీరసాగరమథనం తరువాత అమృతం కోసం దేవదానవుల మధ్య జరిగిన పెనుగులాటలో కొన్ని చుక్కలు నేల మీద పడ్డాయనీ, అదే ఉసిరి చెట్టుగా మారిందినీ ఓ నమ్మకం. సకల వ్యాధులనూ నివారించి దీర్ఘాయువుని ప్రసాదించే అమృతంతో ఉసిరిని పోల్చడం సహేతుకంగానే తోస్తుంది. ఇక ఉసిరికి ఆయుర్వేదంలో ఉన్న ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే.
బాలింత దగ్గర నుంచి పండుముసలి వరకు ఆహారంలో ఉసిరి తప్పనిసరిగా తినాలనేది మన పూర్వీకలు చెప్తున్నారు.ప్రస్తుతం కూడా సీవిటమిన్ ఇచ్చే ఉసిరి గురించి అందరూ తెలుసుకుంటూ వాడుతున్నారు. ఆమ్ల గుణం కనిపిస్తుంది కాబట్టి దీనికి ఆమలకము లేదా ఆమ్లా అని పిలుస్తారు. ఇక కార్తీక మాసంలోనే ఉసిరికి ఎందుకంత ప్రాధాన్యత అనేక కారణాలు కనిపిస్తాయి. చలి విజృంభించే కార్తీక మాసాన కఫసంబంధమైన, జీర్ణసంబంధమైన వ్యాధులు అనేకం వచ్చే అవకాశం ఉంటుంది. ఉసిరిని తీసుకోవడం, ఉసిరికి దగ్గరగా ఉండటం వల్ల ఈ దోషాలు కొంతవరకూ పరిహరిం పబడతాయి.
ఉసిరిలోని విటమిన్ సి ఈ మాసంలో వచ్చే కఫ సంబంధమైన జబ్బులను నివారిస్తే, అందులోని పీచు, ఆమ్ల గుణాలు జీర్ణ సంబంధ సమస్యలను తీరుస్తాయి. అందుకే కార్తీక మాసం యావత్తూ ఉసిరికి సంబంధించిన నియమాలు కనిపిస్తాయి. మరీ ముఖ్యంగా క్షీరాబ్ది ద్వాదశినాడు `ధాత్రి సహిత లక్ష్మీనారాయణస్వామినే నమః` అంటూ విష్ణుమూర్తిని కొలుచుకుంటారు (ధాత్రి అంటే ఉసిరి). ఉసిరిని సాక్షాత్తూ విష్ణుస్వరూపంగా కొలుచుకుంటారు హైందవులు. అలాంటి ఉసిరి కాయలు, కొమ్మలు, చెట్టు సమీపంలో ఉండేలా అనేక నియమాలను ఆచరిస్తారు. ఉసిరిని సేవిస్తారు. అప్పటి వరకూ కురిసిన వర్షాలతో బలాన్ని పుంజుకున్న ఉసరి కూడా ఈ సమయంలో చక్కటి కాయలతో, పచ్చటి కాండంతో శక్తిమంతంగా ఉండి సకల ఆరోగ్యాలనూ అందిస్తుంది.