కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగ అంటారు. కొందరు శ్రావణ శుద్ధ చతుర్థినాడు జరుపుకుంటారు. మన పురాణాలలో నాగుల చవితి గురుంచి ఎన్నో గాథలు ఉన్నాయి. దేశమంతట పలు దేవాలయల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి.
ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావముతో అర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భక్తుల నమ్మకం. ఈ మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెముకను ‘ వెన్నుబాము’ అని అంటారు. అందు కుండలినీశక్తి మూలాధారచక్రంలో “పాము” ఆకారమువలెనే వుంటుందని “యోగశాస్త్రం” చెబుతుంది. ఇది మానవ శరీరంలో నిదురిస్తున్నట్లు నటిస్తూ.. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాల్ని గ్రక్కుతూ, మానవునిలో ‘ సత్వగుణ’ సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు ‘ నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విష సర్పపుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది, అందరి హృదయాలలో నివశించే ‘శ్రీమహావిష్ణువు”కు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే … ఈ నాగుపాము పుట్టలో పాలు పోయడంలో గల అంతర్యమని చెప్తారు. దీనినే జ్యోతిష్య పరంగా చూస్తే కుజ, రాహు దోషాలున్నవారు, సంసారంలో బాధలున్నవారు, ఈ కార్తీకమాసంలో వచ్చే షష్టీ, చతుర్దశిలలో మంగళవారము నాడుగాని, చతుర్దశి బుధవారం కలసివచ్చే రోజుకాని దినమంతా ఉపవాసము ఉండి సుబ్రమణ్యస్వామికి ఆవుపాలు పోసి భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే మంచి ఫలితం వస్తుందని ఎందరో భక్తులు తమ అనుభవంతో చెప్తున్నారు.