లోకకల్యాణం కోసం, కరోనా వ్యాధి ని అరికట్టాలని శ్రీవారిని ప్రార్థిస్తూ సుదర్శన చక్రానికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేపట్టారు.ఆ తర్వాత తిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో సాంగోపాంగ అష్టాక్షరీ, ద్వాదశాక్షరీ మహాసుదర్శన సహిత విశ్వశాంతి మహాయాగం ఘనంగా జరిపించారు. ఈ సందర్భంగా “ఓం నమో నారాయణాయ” అష్టాక్షరి మంత్రాన్ని, “ఓం నమో భగవతే వాసుదేవాయ” ద్వాదశాక్షరీ మంత్రాన్ని జపించి హోమం నిర్వహించారు. ఈ సమయంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామివారు, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామివారు మంగళాశాసనాలు అందించారు.
ఈ సందర్భంగా శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు మాట్లాడుతూ ప్రపంచ ప్రజల ఆరోగ్యం కోసం మొదటగా ధర్మగిరిలో ధన్వంతరి మహాయాగాన్ని టిటిడి నిర్వహించిందని, ఆ తరువాత చతుర్వేద పారాయణం, పారమాత్మకోపనిషత్ పారాయణం, యోగవాశిస్టం పారాయణం జరిగాయని వివరించారు. స్వామివారి ఆశీస్సులతో నిర్వహించిన విశ్వశాంతి మహాయాగం వల్ల ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు సిద్ధిస్తాయని తెలిపారు. వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ శ్రీ కుప్పా శివసుబ్రమణ్య అవధాని మాట్లాడుతూ కరోనా వ్యాధి నుండి మానవాళిని రక్షించాలని స్వామివారిని కోరుతూ వేదపాఠశాలలో 30 రోజులుగా వేదపారాయణం జరుగుతోందన్నారు.
స్వామి వారి ఆశీస్సులతో విశ్వశాంతి మహాయాగాన్ని పూర్ణాహుతితో పూర్తి చేశామన్నారు. ఇందులోభాగంగా ఋగ్వేదం, సామవేదం, అధర్వణ వేదం, శుక్ల యజుర్వేదం, కృష్ణ యజుర్వేద పారాయణం, దివ్య ప్రబంధ నారాయణం, శ్రీ వేంకటాచల మహాత్మ్యం, శ్రీమద్రామాయణ పారాయణం సుందరకాండ పారాయణం చేపట్టినట్టు చెప్పారు. యాగాన్ని నిర్వహించిన వేద విజ్ఞాన పీఠం ఆచార్యులు శ్రీ మోహనరంగాచార్యులు మాట్లాడుతూ “ఓం నమో నారాయణాయ” అనే అష్టాక్షరి మంత్రాన్ని, “ఓం నమో భగవతే వాసుదేవాయ” అనే ద్వాదశాక్షరీ మంత్రాన్ని పఠించిన వారికి శ్రీవారి ఆశీస్సులతో బాధలు తొలగిపోయి, సకల శుభాలు కలుగుతాయని తెలిపారు. కార్యక్రమంలో ఈ యాగంలో టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, శ్రీవారి ఆలయ ఓఎస్డి శ్రీ పాల శేషాద్రి, తదితరులు పాల్గొన్నారు.