స్వామి భక్తి,అంకితభావం, బుద్ధిబలం, స్థిరమైన కీర్తి, నిర్భయత్వం, వాక్ నైపుణ్యం వీటన్నింటి సమ్మేళనం హనుమంతుడు. అందుకే హనుమంతుడు సీతా రాముల దాసుని గా, రామ భక్తుని గా, విజయ ప్రదాత గా, రక్షకునిగా హిందూ మతములో అత్యంత భక్తి శ్రద్ధ లతో కొలుస్తారు. హనుమంతుడు ఆజన్మబ్రహ్మచారి కదా ఆయనకు వివాహమయినట్టు కొన్ని చోట్ల ఉన్నది.దీనివెనుక ఉన్న వాస్తవం ఏమిటి అని చాలా మందికి సందేహము.
హనుమంతుడి గురించిన కథలు పరాశర సంహిత లో కనిపిస్తాయి.
సూర్యభగవానుడికి విశ్వకర్మ కూతురు సంజన తో వివాహం అవుతుంది.
కాని ఆమె సూర్యుడి తేజస్సు తట్టుకోలేక పోతుంది. ఆ వేడి భరించలేక పోవటంతో విశ్వకర్మ సూర్యుడి ని తన తేజస్సు తగ్గించుకోమని వేడుకుంటాడు.
సూర్యుడి అనుమతితో విశ్వకర్మ కొంత వెలుగును తొలగించి అట్లా వచ్చిన వెలుగుతో ఒక అందమైన అమ్మాయిని సృష్టిస్తాడు.
సూర్యుని వర్చస్సుతో రూపొందిన ఆ అమ్మాయి సువర్చల అన్న పేరు పొందుతుంది.
అంత అందమైన అమ్మాయికి వరుడు ఎవరా అని అందరు దేవతలు విచారిస్తూండగా బ్రహ్మ, “శివుని అంశమైన హనుమంతుడు ఆ అమ్మాయికి తగిన వరుడు.” అని సూచిస్తాడు.
హనుమంతుడు పెరిగి పెద్దవాడవుతూండగా అతన్ని విద్యాభ్యాసం కోసం సూర్యుడి వద్దకు పంపిస్తుంది తల్లి.
కాని సూర్యభగవానుడు నిరంతరమూ, గగనతలంలో తిరుగుతూ ఉంటే ఆయన రథంతో పాటుగా తానూ సూర్యభగవానుడికి అభిముఖం గా ఎగురుతూ విద్య నేర్చుకొని హనుమంతుడు సకల విద్యలలోను, వ్యాకరణంలోను పండితుడయ్యాడు.
ఇక్కడ రెండు రకాల కధనాలు ఉన్నాయి.
ఒక వృత్తాంతం ప్రకారం విద్యాభ్యాసం అయిపోయాక సూర్యుభగవానుడు గురుదక్షిణ గా, తన కుమార్తె అయిన సువర్చలను వివాహమాడమని అడుగుతాడు. హనుమంతుడు తన బ్రహ్మచర్యం కొనసాగిస్తూ ఉండగా సువర్చల గంధమాదన పర్వతం మీద తపోనిష్టలో ఉండిపోయింది. దక్షిణ భారత దేశంలో సువర్చలదేవి పేరుతో ఈమె పూజలందుకుంటుంది. ప్రస్తుతం ఈ ఆలయం ఖమ్మం జిల్లాలోని పందిళ్లపల్లిలో ఉంది.