Vasant Panchami 2023: హిందూ మత గ్రంథాలలో వసంత పంచమి లేదా శ్రీపంచమికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ పవిత్రమైన రోజున సరస్వతి మాత జన్మించిందనీ, అందుకే ఈ రోజున ఆ తల్లిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని నమ్ముతారు. ఈ పర్వదిన పవిత్ర నదుల్లో స్నానం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయనీ, ఎంతో పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మిక. మాఘ మాసంలో వచ్చే శుద్ధ పంచమిని వసంత పంచమి అంటారు. అదే విధంగా వసంత రుతువుకు స్వాగతం పలికే పండుగగా శాస్త్రాలలో పేర్కొనబడి ఉంది. దేశ వ్యాప్తంగా వసంత పంచమి పండుగగా ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ ఏడాది వసంత పంచమిని జనవరి 26 (రేపు) గురువారం నాడు జరుపుకుంటారు. ఈ రోజు నుండి దేశంలో వసంత రుతువు ఆరంభం అవుతుంది.
అక్షరాభ్యాసాలు, వివాహాలకు ఉత్తమమైన రోజు
కొన్ని ప్రాంతాల్లో వసంత పంచమి పర్వదినాన్ని సరస్వతి పూజగా జరుపుకుంటారు. సరస్వతి దేవి జ్ఞాన స్వరూపిణి, శాస్త్రం, కళలు, విజ్ఞానం, హస్త కళలు తదితరాలు సరస్వతీ దేవి అంశాలుగా పండితులు చెబుతుంటారు. ఈ సందర్భంగా చదువుల తల్లి సరస్వతి దేవి చల్లని చూపుల కోసం ప్రత్యేకంగా విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు పూజలు చేస్తారు. ఈ రోజున తల్లిదండ్రులు వారి చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేస్తారు. వివాహాలు చేసుకోవడానికి కూడా ఉత్తమమైన రోజుగా భావిస్తుంటారు.
Vasant Panchami 2023: వసంత పంచమి శుభ మూహూర్తం
వసంత పంచమి ఈ ఏడాది జనవరి 25 లేక జనవరి 26 వ తేదీయా అన్న కన్ఫూజన్ ఉంది. ఎందుకంటే పంచమి తిధి జనవరి 25వ తేదీ బుధవారం మధ్యాహ్నం 12,34 గంటలకు ప్రారంభం అవుతుంది. జనవరి 26వ తేదీ గురువారం ఉదయం 10.28 గంటలకు ముగుస్తుంది. పంచాంగం ప్రకారం ఉదయం తిధి ప్రకారమే పరిగణలోకి తీసుకుంటారు కాబట్టి ఈ సారి వంసత పంచమిని జనవరి 26 (రేపు) గురువారం రోజున జరుపుకుంటారు. పూజకు అనువైన సమయం ఉదయం 7,07 గంటల నుండి 12.35 గంటల వరకు. అంతే కాకుండా అక్షరాభ్యాసాలు చేయడానికి ఇది ఉత్తమమైన సమయం. వసంత పంచమి రోజున పలు రకాల వస్తువుల కొనుగోలునకు శుభప్రదంగా భావిస్తుంటారు. ఈ పండుగ పర్వదినం రోజున ప్రతి పాఠశాల, కళాశాలలతో పాటు ప్రముఖ బాసలోని సరస్వతి దేవి ఆలయంలో, నూజివీడు సమీపంలో ఉన్న సరస్వతి దేవి ఆలయంలో పూజలు నిర్వహిస్తారు.
పూజా విధానం
వసంత పంచమి రోజున వేకువ జామునే నిత్ర లేచి తలస్నానం చేసి పసుపు లేదా తెలుపు రంగులో ఉండే ఉతికిన వస్త్రాలు ధరించాలి. శుభ్రమైన నీటితో పూజా స్థలాన్ని లేదా పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. అనంతరం సరస్వతి మాత ఫోటో లేదా విగ్రహాన్ని ప్రతిష్టించి పసుపు రంగులో ఉండే వస్త్రాలను సమర్పించాలి. అనంతరం అమ్మవారికి పసుపు రంగులో ఉండే పువ్వులు, అక్షింతలు, చందనం, ధూపం, దీపం సమర్పించాలి. తదుపరి సరస్వతి మాతకు పసుపు రంగులో ఉండే మిఠాయిలను నైవేద్యంగా పెట్టాలి. పూజా సమయంలో సరస్వతీ వందనం, సరస్వతీ మంత్రాలను పఠించాలి.
Vasant Panchami 2023: బాసర జ్ఞాన సరస్వతి ఆలయం విశిష్ఠత
తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా ముథోల్ మండలం బాసరలో ప్రఖ్యాతి చెందిన జ్ఞాన సరస్వతి ఆలయం ఉంది. భారత దేశంలో గల రెండే రెండు ప్రముఖ సరస్వతి దేవాలయాల్లో ఒకటి కశ్మీర్ లో ఉండగా, రెండవది బాసరలో ఉంది. ఏపిలో నూజివీడు ప్రాంతంలో ప్రత్యేకంగా సరస్వతి దేవి ఆలయాన్ని తర్వాత నిర్మించారు. బాసరలో జ్ఞాన సరస్వతి అమ్మావరు మహాలక్ష్మి, మహాకాళి సమేతురాలై కొలువు తీరి ఉన్నారు. ఇక్కడి మందిరం చాళుక్యుల కాలంలో నిర్మించబడింది. బాసర క్షేత్రాన్ని వేద వ్యాసుడు ప్రతిష్టించినట్లు స్థల పురాణం చెబుతోంది. ఈ ఆలయంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. వేకుమజాము 2 గంటల నుండి అమ్మవారికి అభిషేకం ప్రారంభిస్తారు. అయితే ఆ సమయంలో భక్తులకు అనుమతి ఉండదు. రేపు వసంత పంచమి పర్వదినం సందర్భంగా ఉదయం 7 గంటల నుండి 8 గంటల మధ్య రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి, ఎమ్మెల్యేలు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.