పురాణం.. అనేక దేవతామూర్తులు, రాక్షసులకు సంబంధించిన గాథలు. వీటిలో అనేక ఆసక్తి కథలు, ఆలోచించాల్సిన రహస్యాలు ఉన్నాయి. అయితే పండితుల వాదన ప్రకారం పురాణాలలో అనేక కల్పితాలు మధ్యకాలంలో సంభవించాయని అంటారు.
ఏది ఏమైనా నాటి పూర్వీకుల కథలు నేటి తరానికి వారసత్వాలు అనడంలో సందేహం లేదు. వాటిలోని మంచిని తీసుకుని ముందుకుపోవాలి. పురాణగాథలు వినడం వల్ల పిల్లలో అనేక రకాల ఆలోచనా పద్ధతులు, సమస్య సాధనా పద్ధతులు తెలుస్తాయి అనడంలో సందేహం లేదు. నేటి పబ్జీ, వీడియో గేమ్ల కంటే పురాణాలే బెస్ట్ అనడంలో సందేహం లేదు. పురాణాల గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం… ‘అష్టాదశ పురాణాలు’ అని వింటూ ఉంటాం. అయితే ఆ పద్ధెనిమిది పురాణాల పేర్లూ ఒకపట్టాన గుర్తుకు రావు. ఒకవేళ అన్నింటిపేర్లూ తెలిసినా, ఏ పురాణంలో ఏముందో తెలియదు. అనంతంగా ఉన్న ఈ పౌరాణిక విజ్ఞానాన్ని, అపారమైన వేదరాశిని వేదవ్యాసుడే అంశాల వారీగా విభజించాడు. వేదవ్యాసుడు పురాణాలను రచిస్తే, వాటిని మహాపౌరాణికుడు సూతుడు శౌనకాది మునులకు చెప్పాడు. వారిద్వారా ఇవి లోకానికి వె ల్లడి అయ్యాయి. ఎంతో విస్తారమైన ఈ పురాణాలను మనం చదవలేకపోయినప్పటికీ, అసలు ఆ పురాణాలేమిటి, ఏ పురాణంలో ఏముందో రేఖామాత్రంగా అయినా తెలుసుకోగలిగితే అవకాశం ఉన్నప్పుడు విపులంగా తెలుసుకోవచ్చు. ఈ పురాణాలన్నీ శ్లోకాల రూపంలో ఉంటాయి. అన్నింటిలోకీ మార్కండేయ పురాణం చిన్నది కాగా, పద్మపురాణం పెద్దది.
మత్స్యపురాణం
మత్స్యరూపంలో ఉన్న మహావిష్ణువు మనువనే రాజుకు చెప్పిన ఈ పురాణంలో కాశీక్షేత్ర ప్రాశస్త్యం, యయాతి, కార్తికేయుడు వంటి రాజుల గొప్పదనాన్ని, ధర్మమంటే ఏమిటో, ఆ ధర్మాన్ని ఆచరించే విధానాలేమిటో విష్ణుమూర్తి వివరిస్తాడు.
కూర్మపురాణం
కూర్మావతారం దాల్చిన విష్ణుమూర్తి చెప్పిన ఈ పురాణంలోఖగోళ శాస్త్రం గురించి, వారణాసి, ప్రయాగ వంటి పుణ్యక్షేత్రాల గురించి వర్ణన కనిపిస్తుంది.
వామన పురాణం
పులస్త్య మహర్షి నారద మహామునికి చెప్పిన ఈ పురాణంలో శివపార్వతుల కల్యాణం, గణేశ, కార్తికేయుల జన్మవృత్తాంతాలు, రుతువుల గురించిన వర్ణనలు కనిపిస్తాయి.
వరాహపురాణం
వరాహావతారం దాల్చిన విష్ణువు భూదేవికి తన జన్మవృత్తాంతం, ఉపాసనా విధానం, ధర్మశాస్త్రాలు, వ్రతకల్పాలు, భూమిపై ఉన్న వివిధ రకాల పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలు ఈ పురాణంలో కనిపిస్తాయి.
గరుడ పురాణం
గరుడుని వివిధ సందేహాలపై విష్ణువు చెప్పిన వివరణ ఇది. ఇందులో గరుడుని జన్మవృత్తాంతంతోబాటు జనన మరణాలంటే ఏమిటి, మరణానంతరం జీవుడు ఎక్కడికి వెళతాడు; ఏ పాపానికి ఏ శిక్షపడుతుంది… వంటి విషయాలుంటాయి.
వాయుపురాణం
వాయుదేవుడు చెప్పిన ఈ పురాణంలో ఈశ్వరుని మాహాత్మ్యం, భూగోళం, సౌరమండల వర్ణనలు కన్పిస్తాయి.
అగ్నిపురాణం
అగ్నిదేవుడు వశిష్టునికి చెప్పిన ఈ పురాణంలో వ్యాకరణం, ఛందస్సు, వైద్యశాస్త్ర రహస్యాలు, జ్యోతిశ్శాస్త్రం, భూగోళ, ఖగోళ రహస్యాలను తెలుసుకోవచ్చు.
స్కాందపురాణం
కాశీఖండం, కేదారఖండం, కుమారిల ఖండం, రేవాఖండం… తదితర ఖండాలుగా ఉండే ఈ పురాణాన్ని స్కందుడే చెప్పాడట. ఇంకా రామేశ్వర క్షేత్ర మహిమ, పూరీ జగన్నాథ ఆలయంతో సహా అనేక పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలుంటాయి. ఇంకా కుమారస్వామి జననం, మహిమలు, శివలీలల ఉంటాయి.
లింగపురాణం
లింగరూప శివ మహిమలతోబాటు, వివిధ వ్రతాలు, ఖగోళ, జ్యోతిష, భూగోళాల గురించిన సమాచారం ఉంటుంది.
నారద పురాణం
బహ్మమానసపుత్రులైన సనక సనంద సనాతన సంపత్కుమారులకు నారదుడు చెప్పిన ఈ పురాణంలో వేదాంగాల గురించి, పలు పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలుంటాయి.
పద్మపురాణం
ఈ పురాణంలో మధుకైటభులనే రాక్షస వధ, రావిచెట్టు మహిమ, పద్మగంధి దివ్యగాథ, గంగా మహాత్మ్యం, గీతాసారం, నిత్యపూజావిధానాల గురించి ఉంటుంది.
విష్ణుపురాణం
పరాశరుడు తన శిష్యుడైన మైత్రేయునికి బోధించిన ఈ పురాణంలో విష్ణుమూర్తి అవతార వర్ణన, ధ్రువ, ప్రహ్లాద, భరతుల చరితామృతం ఉంటుంది.
మార్కండేయ పురాణం
శివకేశవుల మాహాత్మ్యం, ఇంద్ర, అగ్ని, సూర్యుల మాహాత్మ్యం, దేవీ మాహాత్మ్యం వుంటాయి.
బ్రహ్మపురాణం
బ్రహ్మదేవుడు దక్షునికి బోధించిన ఈ పురాణంలో వర్ణధర్మాలు, స్వర్గనరకాల గురించి తెలుసుకోవచ్చు.
భాగవత పురాణం
విష్ణువు అవతారాలు, శ్రీ కృష్ణ జననం, లీలల గురించి మృత్యువుకు చేరువలో ఉన్న పరీక్షిన్మహారాజుకు శుకమహర్షి చెప్పిన పురాణమిది. దీనిని తొలుత వేదవ్యాసుడు శుకునికి బోధించాడు.
బ్రహ్మాండ పురాణం
బ్రహ్మదేవుడు మరీచి మహర్షికి చెప్పిన ఈ పురాణంలో రాధాకృష్ణులు, పరశురామ, శ్రీరామచంద్రుల చరిత్రలు, లలితా మహిమ్నా స్తోత్రం, ఖగోళ విజ్ఞానం గురించిన వివరణ ఉంటుంది.
భవిష్యపురాణం
సూర్యుడు మనువుకు చెప్పిన ఈ పురాణంలో అగ్ని, సూర్యోపాసన విధులతోబాటు, భవిష్యత్తులో జరుగబోయే వివిధ విషయాల గురించిన వివరణ ఉంటుంది.
బ్రహ్మాపవైపర్తపురాణం
ఇందులో గోలోకప్రశంస . భోజననియమాలు.రోగనివృత్తిసాధనాలు.తులసీ, సాలగ్రామమహత్త్వాలు.హోమములోస్వాహకార ప్రాధాన్యము మొదలైన విషయాలు ఇందులో వివరించబడ్డాయి.
వీలున్నప్పుడు ఆయా పురాణాలను చదవండి. వాటిలోని అంతరార్థాలను గ్రహించే ప్రయత్నం చేయండి.