సనాతన ధర్మం ఆచరించే ప్రతీ ఒక్కరూ ప్రతీరోజు దైవారాధన చేస్తారు. ఈ సమయంలో మొదట చేసే పని ఘంటారావం అంటే ఘంటను కొట్టడం. ఎందుకు అనేది చాలామందికి తెలియదు.
ఆగమార్ధంతు దేవానం, గమనార్ధంతు రాక్షసాం.. అనే శ్లోకాన్ని చదివి ఘంట కొడుతాం.
దేవుని ముందు పూజ చేసేటప్పుడు శ్రావ్యమైన జేగంట మ్రోగిస్తారు. దేవతలకు ఆహ్వానం పలకడానికి, రాక్షసులను సాగనంపడానికి ఘంటా రావం చేస్తారు. ఘంటారావం విన్న రాక్షస శక్తులు, దేవతలు వస్తున్నారని లేదా దైవ శక్తులు వస్తున్నాయని గ్రహించి ప్రక్కకు తొలగి పోతాయి. దేవతలుతో పాటు మనకు మంచి ఆలోచనలు రావాలని అలాగే రాక్షసులతో పాటు చెడు ఆలోచనలు పోవాలని పూజ చేసే సమయంలో మాత్రమే ఘంటారావం చేస్తాం. స్త్రీ / పురుషులు ఎవరైనా పూజ సమయం లో గంట మ్రోగించవచ్చు. గంటలు ఇత్తడితో చేసినవి అయితే శ్రావ్యనాదం వస్తుంది. స్టీల్ గంటలు కొట్టవద్దు. పంచలోహాలు, ఇత్తడి వంటి వాటితో చేసినవి మంచివి.