దేవాలయానికి వెళ్లిన ప్రతీ భక్తుడు తప్పక స్వామి/అమ్మ అనుగ్రహం కోసం తీర్థం తీసుకుంటారు. అయితే ఈ తీర్థం మూడుసార్లు ఇస్తారు. దీని వెనుక రహస్యం ఏమిటో తెలుసుకుందాం..
తీర్ధం యొక్క విశిష్టత ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంట్లో, దేవాలయంలో లేదా ఇంకెక్కడైనా దేవుడిని దర్శించుకున్న తర్వాత తీర్ధం తీసుకుంటాం. దేవునికి పూజ చేసిన తర్వాత తీసుకునే తీర్ధంలో పంచామృతాలు, తులసి దళాలు, సుగంధ ద్రవ్యాలు, మంత్ర శక్తులు ఉంటాయి. దీంతో ఆ తీర్ధం అత్యంత పవిత్రంగా మారుతుంది. మన పురాణాల ప్రకారం తీర్ధం అంటే తరింపజేసేది అని అర్ధం. దీన్ని మూడుసార్లు తీసుకుంటే.. భోజనం చేసినంత శక్తి వస్తుందని అంటారు.
తీర్ధం తీసుకోవడం ద్వారా మన ఆరోగ్యం, ఆధ్యాత్మికత మెరుగవుతాయి. మొదటిసారి తీర్ధం తీసుకుంటే శారీరక, మానసిక శుద్ధి జరుగుతుంది. రెండవసారి తీర్ధం తీసుకుంటే న్యాయ, ధర్మ ప్రవర్తనలు మారుతాయి. ఇక మూడవది పవిత్రమైన పరమేశ్వరుని పరమ పదం అనుకుని తీసుకోవాలి. దేవుడికి పూజలు చేసే పూజారులు ఈ మంత్రం జపిస్తూ భక్తులకు తీర్ధాన్ని ఇస్తారు.
తీర్థం ఇచ్చేటపుడు చెప్పే మంత్రం
‘‘ అకాల మృత్యు హరణం సర్వవ్యాధి నివారణం! సమస్త పాపక్షయకరం శ్రీ పరమేశ్వర/దుర్గావిష్ణు పాదోదకం పావనం శుభం. అని చెప్తారు. దీనిలోనే అన్ని ఉన్నాయి.. అవి అకాల మరణాన్ని తప్పించే శక్తి, అన్ని రోగాల నివారణ, పాపక్షయం. కాబట్టి తీర్థాన్ని పవిత్రమైన మనసుతో స్వీకరిస్తే తప్పక శుభాలు కలుగుతాయి.