భక్తులు తమ జీవితంలో గుడికి పోవడం సర్వసాధరణ అంశం. ప్రతీ ఊరిలో దేవాలయంలో మొట్టమొదట మనకు కన్పించేది ధ్వజస్తంభం. అలాగే ఇతర స్తంభాలు. వాటి వెనుక ఉన్న విశేషాలు పరిశీలిద్దాం..
ఆలయంలో ధ్వజస్తంభం మాత్రమే కాకుండా ఇతర స్తంభాలు ఉంటాయి. ముఖ్యంగా ఇవి పూర్వకాలం నిర్మించిన దేవాలయాలలో ఎక్కువగా కన్పిస్తాయి వాటిలో రాతితో నిర్మించి పైన దీపం ఏర్పాటు చేస్తే దాన్ని దీపస్తంభం అంటారు. ఉత్తరాది ఆలయాల్లో చెట్టుకు కొమ్మలున్నట్లు ఒక స్తంభానికి వందకు పైగా దీపాలను అమర్చే దీపస్తంభం ప్రతీ గుడిలో ఉంటుంది. విశేష పండుగలప్పుడు భక్తులు దీపాల్ని వెలిగిస్తారు. ఒక రాతిస్తంభం పైన చిన్న గూడు చేసి అందులో నంది ఉంచితే దాన్ని నందిస్తంభం అంటారు. ఇది ప్రతి శివాలయంలో ఉంటుంది. అలాగే విష్ణ్వాలయంలో రెండు చేతులూ జోడించి నిలుచున్న గరుడ విగ్రహం పైనగానీ స్తంభం మొదల్లో గానీ ఉంచితే దాన్ని గరుడస్తంభం అంటారు. ఇంకా శూలం వంటి ఆయుధాన్ని నాటి ఏర్పాటు చేసే శూలస్తంభం… పశువుల్ని మొక్కుకుని ఆలయానికి సమర్పించేప్పుడు వాటిని కట్టే యూపస్తంభం.
ప్రధానంగా విశాఖపట్నం సమీపంలోని సింహాచలంలో కప్పస్తంభం… హంపిలోని సప్త స్వరస్తంభాలు… తిరుమలలోని వరాహ స్తంభం ఇలా చాలా స్తంభాలు విశేషమైనవి. ఈ స్తంభాలను దర్శించినా, తాకినా, వీటి దగ్గర ఏ కోరికలు కోరుకున్నా, మొక్కుకున్నా అనుకున్న పనులు నెరవేరుతాయని ఆగమశాస్త్రాలు చెబుతున్నాయి. ఈసారి దేవాలయాలకు వెళ్లినప్పుడు అక్కడుండే స్తంభాలను చూసి వాటి వెనుక ఉన్న రహస్యాలను తెలుసుకోండి. మన ఆచారాలు, దేవాలయ నిర్మాణ రహస్యాలను కనుగొని రాబోయే తరాలకు వారసత్వాన్ని అందిద్దాం. సైంటిఫిక్ విషయాలను పరిశోధించి అందరికీ తెలియపరుద్దాం.