ఇళ్ల స్థలాల పేరిట అధికార పార్టీ నేతలు బరితెగిస్తున్నారు. తక్కువ ధర ఉన్న స్థలాలను తామే స్వయంగా ప్రభుత్వానికి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. తద్వారా రూ. వందల కోట్లు అవినీతికి తెరతీశారు…! ఇదీ ఈరోజు ఆంధ్రజ్యోతిలో కథనం సారాంశం…!
అధికార పార్టీలో ఎమ్మెల్యేలు, నేతలు తిరుగుబాటు చేస్తున్నారు. ప్రభుత్వ పాలనపై వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారు. మాటల దాడి చేస్తున్నారు. ఇది త్వరలోనే పురి విప్పి మరింత ఎక్కువవుతుంది…! – ఇదీ ఈనాడులో ఈరోజు వచ్చిన కథనం సారాంశం…!
జగను కత్తి దూశాడు. 2430 అనే జీవో తీసుకొచ్చి ఎల్లో కలం వాడి తగ్గేలా కత్తిని దించాడు. బెదిరితే ఈనాడుకు అనుభవం ఏం కావాలి… వారి పాఠకులు ఏం కావాలి…? బెదిరితే ఆంధ్రజ్యోతి అహం ఏం కావాలి..? రాధాకృష్ణ చేసే భజన ఏం కావాలి…? అందుకే ఆగట్లేదు. ఎల్లో కలం ఆగట్లేదు. వాడి తగ్గించలేదు. మరి జగన్ కత్తి పరిస్థితి ఏంటి..? ఆ 2430 జీవో తీసుకొచ్చి ఏం కావాలి…? ఇక్కడ అదే సమస్య, అదే ఈ కథనంలో చర్చనీయాంశం. ఈ జీవో ఉన్నా ఈ రెండు పత్రికలూ తమ ప్రభుత్వ వ్యతిరేక కథనాలకు ఎలా పదును పెట్టాయో చూద్దాం.
ఈనాడు.. అవసరార్దంగా ఆచితూచి…!
ఈనాడు పత్రికకు నిత్యం ఒక తోక ఉంటుంది. నిప్పు, నిజాయితీ, అవినీతిని చీల్చి చెండాడడం అనే తోక పట్టుకుని ఈనాడు గొప్పలకు పోతుంది. అటువంటి ఈనాడు ఇప్పుడు ఒక సంక్లిష్ట స్థితిలో ఉంది. ఒక వైపు తమ సొంత సామాజికవర్గం, మరో వైపు 1996 లో తాను సీఎం కుర్చీ ఎక్కించిన చంద్రబాబు ఉన్నారు. వీళ్ళు ఉండగా ఈనాడు జగన్ భజన, ప్రభుత్వ భజన చేస్తే చూస్తూ ఊరుకోరు. మరోవైపు ప్రభుత్వ వ్యతిరేక కథనాలు రాస్తే జగన్ చూస్తూ ఊరుకోదు. యాడ్లు పూర్తిగా ఆపేసి, భూముల కేటాయింపుల తోకలు కత్తిరిస్తాడు. అందుకే ఈనాడు ఇప్పుడు ఒకరోజు చంద్రబాబు చంకలో… మరో రోజు జగన్ చంకలో కూర్చుంటుంది. జగన్ కి అనుకూలంగా రెండు రోజులు రెండు మాంచి ప్రత్యేక వార్తలు వండి, వడ్డిస్తూ (మొన్న రాసిన 18 వేలకోట్ల పెట్టుబడులు వార్తా)… మరో మూడు రోజులు జగన్ కి వ్యతిరేక వార్తలు వండి, వారుస్తుంది(మొన్న టిటిడి ఆస్తుల వేలం వార్తా హైలైట్ చేయడం, ఈరోజు ఎమ్మెల్యేల వ్యతిరేక వార్తలు రాయడం..). మిగిలిన రోజుల్లో బాలన్స్ చేస్తుంది. ఇలా ఈనాడు ఆచితూచి అడుగులు వేసుకుంటూ రోజుకొకరు చంక ఎక్కుతూ ఉంటుంది.
ఆంధ్ర జ్యోతి దూకుడుగా… ఏకపక్షంగా…!
ఆంధ్ర జ్యోతి పత్రిక అంటే ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక సామాజికవర్గానికి, ఒక పార్టీకి, ఒక నాయకుడికి అది పూర్తిస్థాయి తోక పత్రిక. టిడిపి అధికారంలో ఉన్నన్నాళ్ళు యాడ్లు, వివిధ మార్గాల్లో ఆర్ధికంగా దున్నుకోవడం… వ్యతిరేక పక్షం అధికారంలో ఉన్నప్పుడు ఉద్దేశ పూర్వక వార్తలు రాస్తూ తమ ఉనికి కాపాడుకోవడం. అయితే కేసులకు భయపడకుండా… చేసేది, రాసేది కాస్త ధైర్యంగా రాయడం రాధాకృష్ణ ప్రత్యేకత. రాసేవి తప్పులైనా వెనకేసుకు రావడం ఆయన శైలి. అందుకే ఆయన ఒక వర్గ మీడియాకు చక్కని ఉదాహరణ. ఇప్పుడు తెలంగాణాలో జంట కడుతూ, ఏపీలో జగన్ తో కయ్యం తో ఉంటూ… నెట్టుకొస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు ఒక కథనం వండారు. నిజానికి ఈనాడులో ఏదైనా ప్రభుత్వ వ్యతిరేక కథనం రాయాలంటే వాళ్ళు ఆధారాలు, ముప్పైమూడు సమాలోచనలు చేసుకుంటారు. కానీ ఎక్కడో చోట దొరుకుతారు. కానీ జ్యోతి మాత్రం ఆధారాలు లేకపోయినా, పుకార్ల ఆధారంగా కథనాలు రాస్తూ భజనలు చేస్తుంది. మరి అందులో భాగమే ఈరోజు కథనం. కొన్ని ప్రచారాలను కథనంగా రాసుకొచ్చింది. దీనిపై కోర్టు వ్యవహారాల వరకు వెళ్తే, ఆ 2430 అనే జీవో తెరపైకి వస్తే ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.