వైసీపీ ప్లీనరీ ముగిసింది. ఆ పార్టీ శాశ్వత అధ్యక్షుడుగా వైఎస్ జగన్ ను ఎన్నుకున్నారు. ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలుగా ఉన్న వైఎస్ విజయమ్మ తన పదవికి రాజీనామా చేశారు. పార్టీ ప్రాధమిక సభ్యత్వం నుండి తప్పుకుంటున్నట్లు తెలిపారు. తన కుమార్తె వైఎస్ షర్మిల పక్క రాష్ట్రంలో రాజకీయ పార్టీ పెట్టి తన తండ్రి వైఎస్ఆర్ ఆశయాల సాధన కోసం ఒంటరిగా పోరాటం చేస్తున్నందున ఆమెకు అండగా ఉండేందుకే వైఎస్ఆర్ సీపీ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే ఆ పార్టీ అంతర్గత, కుటుంబ వ్యవహారాన్ని ఏబీఎన్ ఆర్కె తన కొత్త పలుకులో తన దైన స్టైల్ లో వండి వార్చారు. ఓ పక్క బీజేపీకి జగన్ దత్త పుత్రుడుగా అభివర్ణించిన ఆర్కె .. మరో పక్క జగన్ జైలుకు వెళితే పార్టీ పగ్గాలు తన భార్య చేతిలో ఉండాలన్న భావనతో తల్లి విజయమ్మను సాగనంపారు అన్నట్లుగా రాశారు. విజయమ్మ రాజీనామా వెనుక జగన్నాటకం ఉందని పేర్కొన్నారు.
ఇన్నాళ్లు తేలంది ఈ రెండేళ్లలో తేలతాయా..?
జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుండి జగన్ జైలుకు వెళితే.. అన్న పేరుతో చాలా సార్లు ఆయన వ్యతిరేక మీడియా కథనాలు వచ్చాయి. భారతికి ఐఎఎస్ లతో తర్ఫీదు కూడా ఇస్తున్నారంటూ వార్తలు షికారు చేశాయి. జగన్మోహనరెడ్డి పాలన మూడేళ్లు గడిచిపోయాయి. మరో రెండేళ్లు ఉంది. ప్రస్తుతం జగన్ అక్రమాస్తులకు సంబంధించి కేసులు సీబీఐ కోర్టులో విచారణ దశలోనే ఉన్నాయి. తీర్పు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. భారత దేశ చట్టాల ప్రకారం కింది కోర్టు తీర్పులే ఫైనల్ కావు. ఆ తరువాత హైకోర్టు, సుప్రీం కోర్టు ఉంది. జగన్ పై కేసులు నమోదు చేసి దాదాపు 13 సంవత్సరాలు దాటి పోయింది. మరో ఏడాది రెండేళ్లలో ఒక కొలిక్కి వస్తాయన్న నమ్మకం కూడా లేదు. ఇవన్నీ కూడా తెలిసి జగన్ జైలుకు వెళితే … అన్నట్లుగా రాసుకొస్తున్నారు.
జగన్ కుటుంబంలో ఒంటరి అయ్యారుట
మరో పక్క వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీత కు తన పులివెందుల సీటు ఆఫర్ చేస్తున్నట్లుగా ప్రచారంలో ఉందని కూడా రాశారు. వాస్తవానికి ఆమె వైద్య వృత్తిలో బిజీగా ఉన్నారు. రాజకీయాల పట్ల ఆమెకు అంతగా ఆసక్తి కూడా లేదు అన్నది అందరికీ తెలిసిందే. సునీత వ్యక్తిత్వాన్ని కించపరిచేందుకే జగన్ ఇలా చేస్తున్నారన్నట్లుగా ఇచ్చారు. మరో పక్క వైఎస్ఆర్ కుటుంబంలో ఆయన ఒక్కరే ఉన్నారనీ, మిగిలిన వారు అందరూ దూరమయ్యారు అన్నట్లుగా ఆర్కె తన ఆర్టికల్ లో పేర్కొన్నారు. మరో విషయం ఏమిటంటే.. బిజేపీ పెద్దలు ఆయనను కేసుల నుండి తప్పించేందుకు సిద్దంగా లేరని, తమ పార్టీని కబలించే వ్యూహాలను అమలు చేస్తారని జగన్ భావిస్తున్నారని పేర్కొంటూనే.. జగన్ కు బీజేపీ గట్టి సపోర్టు ఉందనీ, ప్రధాని మోడీకి నిజమైన దత్తపుత్రుడు జగన్ అని రాసుకొచ్చారు. తరచు జగన్.. పవన్ కళ్యాణ్ ను చంద్రబాబుకు దత్తపుత్రుడు అని విమర్శిస్తున్న నేపథ్యంలో ఆర్కె కొత్తగా మోడీకి జగన్ దత్తపుత్రుడు అన్నట్లుగా రాసుకొచ్చి కౌంటర్ ఇచ్చినట్లుగా ఉంది.