ఏపిలో మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందా ..? రాదా..! 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని వైసీపీకి ఏకంగా 151 సీట్లు, 156 లక్షల ఓట్లు వచ్చాయి. దాన్ని ఈ మూడేళ్లలో జగన్మోహనరెడ్డి ఎంత మేరకు నిలబెట్టుకున్నారు..? మళ్లీ రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉందా.. ? జగన్మోహనరెడ్డి చెబుతున్నట్లు 175కి 175 వచ్చేస్తాయా..? లేదా.. ఆ 151 సీట్లు వస్తాయా..? లేదా తగ్గుతాయా..? అనేది రాజకీయ వర్గాల్లో సందేహంగా ఉంది. మన తెలుగు రాష్ట్రాలకు, జర్నలిస్ట్ లకు మంచి వారధి. పూర్తి స్థాయి జర్నలిస్ట్ కాదు. పూర్తి స్థాయి రాజకీయ నాయకుడు కాదు. మధ్యస్తంగా ఉన్నది ఏబీఎన్ ఆర్కే. ఆయన మంచి బిజినెస్ మ్యాన్. ఆ తరువాతే జర్నలిస్ట్. బిజినెస్ మ్యాన్ కంటే, జర్నలిస్ట్ కంటే ముందు రాజకీయ నాయకుడు అని చెప్పుకోవచ్చు. పైకి కనబడే రాజకీయ నాయకుడు కాదు కానీ బ్యాక్ రౌండ్ పాలిటిక్స్ చేస్తుంటారు. తెరవెనుక వ్యూహాలు ఇచ్చే వారు కూడా రాజకీయ నాయకులతో సమానమే. ఉదాహారణకు ప్రశాంత్ కిషోర్ (పీకే) మాదిరిగా. ఈయనకు టీడీపీ అంటే ఎంత పిచ్చి, ప్రేమో, ఆ కులం అంతే ఎంత అభిమానమో, టీడీపీ కోసం, చంద్రబాబు కోసం ఎన్ని అబద్దాలు ఆడుతుంటారో, వైశ్రాయ్ హోటల్ రాజకీయం (ఎన్టీఆర్ ను పదవీచిత్యుడిని చేయడంలో) లో ఆయన ఓ పొలిటికల్ జర్నలిస్ట్ గా చంద్రబాబు వెంట ఉండి ఆయన నిర్వర్తించిన పాత్ర. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన జర్నలిస్ట్ గా పని చేసిన పత్రికనే కొనుగోలు చేసి యజమాని అయి ఉదంతం అందరికీ తెలిసిందే. అటువంటి ఏబీఎన్ ఆర్కే తన కొత్త పలుకులో “మళ్లీ జగన్మోహనరెడ్డి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. మూడు సంవత్సరాలకే ఆయన పని అయిపోయింది. ఒక్క సారి అధికారం ఇవ్వండి 30 ఏళ్లు అధికారంలో ఉండేలా పాలన అందించి జనాల నమ్మకాన్ని గెలుచుకుంటాను అని చెప్పిన జగన్మోహనరెడ్డి మూడేళ్లలోనే ప్రజల నమ్మకాన్ని కోల్పోయారు” అన్నట్లుగా రాశారు.
బటన్ నొక్కుడు కార్యక్రమం కొనసాగించడం ఎలా..?
ఈ కథనంలో వాస్తవాలు ఉన్నాయా.. ? రియాలిటీ ఏమిటి..? అనేవి ఒక సారి పరిశీలన చేస్తే.. “ఛాన్స్ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి లెక్కలు తప్పుతున్నాయి. సుదీర్ఘకాలం అధికారంలో ఉండటానికి ఆయన ఎంచుకున్న మోడల్ లో ఎక్కడో తేడా కొడుతోంది. ఆయన అంచనాలకు భిన్నంగా క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఉండటాన్ని జగన్ జీర్ణించుకోలేకోపోతున్నారు. రాజ్యాంగానికి విరుద్దంగా పన్నలు ఆదాయాన్ని కొదవ పెట్టి అప్పులు తీసుకోవడంపై రిజర్వ్ బ్యాంకు నేరుగా దృష్టి సారించింది. ఈ విదానం ఆమోదయోగ్యం కాదని షెడ్యుల్ బ్యాంకులను రిజర్వ్ బ్యాంకు హెచ్చరించింది. దీంతో బటన్ నొక్కుడు కార్యక్రమం కొనసాగించడం ఎలా..? అని జగన్ తలపట్టుకుంటున్నారు” అని ఏబిఆర్ ఆర్కే రాసుకొచ్చారు. సాధారణంగా ఇవి అన్నీ ఆర్ధిక కష్టాలు ఉన్న ఏ రాష్ట్రానికైనా వస్తాయి. వాస్తవానికి మన రాష్ట్రంతో పోలిస్తే దేశంలో మరి కొన్ని రాష్ట్రాలు కూడా ఉన్నాయి. దేశంలో ఏడు నుండి పది రాష్ట్రాలు విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నాయి. రాష్ట్ర విభజన నాటికి తెలంగాణ ధనిక రాష్ట్రంగా ఉండేది. ఆ రాష్ట్రానికి హైదరాబాద్ వంటి ఆర్ధిక వనరు ఉన్న రాజధాని ఉంది. కానీ ఆ తరువాత అప్పులు చేసింది. అయితే మన రాష్ట్రం చేసినంత అప్పు ఏ రాష్ట్రం చేయడం లేదని ఏబీఎన్ వాదన. దీనిలో ఎంత వాస్తవం ఉందో మన రాష్ట్రంలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలు మిగిలిన ఈ రాష్ట్రంలో అమలు చేయడం లేదన్నది కూడా అంతే వాస్తవం. కొన్ని కార్పోరేషన్ లు సృష్టించి భవిష్యత్తు ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పు చేస్తొందని అంటున్నారు.
కొద్దిగా కష్టపడి కొన్ని రాజకీయ అడుగులు వేస్తే..
“జగన్మోహనరెడ్డి ఎన్నికల స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ (పీకే) బృందం కూడా క్షేత్ర స్థాయిలో పరిస్తితులు బాగోలేవని నివేదిక ఇచ్చింది. దీంతో జగన్ రెడ్డి మరింతగా కలవరపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ అధికారంలోకి రావడం చాలా కష్టం. చంద్రబాబుకు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. అని ప్రశాంత్ కిషోర్ కూడా తెలంగాణకు చెందిన ప్రముఖ నాయకుడి వద్ద ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించినట్లు ” ఏబీఎన్ ఆర్కే రాసుకొచ్చారు. అయితే ఇది కొంచెం భిన్నంగా ఉంది. ఎందుకంటే … ప్రశాంత్ కిశోర్ రాజకీయ వ్యూహకర్త. రాజకీయ పండితుడు. ఆయన తన ఒక క్లయింట్ గురించి మరొక క్లయింట్ వద్ద మాట్లాడరు. ఏ రాజకీయ వ్యూహాకర్త కూడా ఒక క్లయంట్ గురించి మరొక క్లయింట్ వద్ద మాట్లాడరు. ప్రశాంత్ కిశోర్ ఈ మధ్య ఒక నివేదికను జగన్మోహనరెడ్డికి ఇచ్చిన మాట వాస్తవమే. ఆయన చెప్పిన దానిలో మళ్లీ ప్రభుత్వం రావడం కష్టమే. చాలా కష్టపడాలి. ఇన్ని స్థానాల్లో ఓడిపోయే అవకాశం ఉంది. కాకపోతే కొన్ని ప్రణాళికలు మార్చుకుంటే, కొద్దిగా కష్టపడితే, కొన్ని రాజకీయ అడుగులు వేస్తే 95 నుండి వంద సీట్లు అయినా వస్తాయి, అధికారం నిలబడుతుంది అని ప్రశాంత్ కిషోర్ రిపోర్టు ఇచ్చారుట. ఇది వైసీపీ వర్గాల్లో చర్చ ఉంది. టీడీపీ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది.
నాడు వైఎస్ఆర్ పరిస్థితే
గతంలో 2004 లో వైఎస్ రాజశేఖరరెడ్డి 240పైగా స్థానాలతో అధికారంలోకి వచ్చారు. వైఎస్ఆర్ సీఎం అయిన తరువాత రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్ లాంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేసినప్పటికీ 2009 ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ కు అయిదు పది స్థానాలు ఎక్కువ మాత్రమే వచ్చాయి. ఇప్పుడు అదే పరిస్థితి ఉన్నట్లుగా పీకే రిపోర్టు ఉంది. గత ఎన్నికల్లో భారీగా సీట్లు వచ్చినా రాబోయే ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ కు అయిదు పది స్థానాలు ఎక్కువగా ఉంటాయి అన్నట్లుగా పేర్కొన్నట్లు తెలుస్తొంది. ఇది కూడా కొన్ని కొన్ని మార్పులు చేసుకుంటే అధికారాన్ని నిలబెట్టుకోవచ్చు అన్నట్లుగా రిపోర్టు ఇచ్చారని అంటున్నారు. పీకే రిపోర్టులో పూర్తిగా అధికారంలోకి రాదు అని చెప్పలేదు కానీ కొన్ని స్థానాల్లో మార్పులు చేర్పులు చేసుకుని వ్యూహాత్మక అడుగులు వేస్తే అధికారాన్ని నిలబెట్టుకోవచ్చు అన్నట్లుగా చెప్పారుట.
చంద్రబాబు ఎన్నికల ప్రచార సభల్లో చెప్పిందే..
“జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అభివృద్ధి కనుమరుగు అవుతుందని, పోలవరం, అమరావతి ఆగిపోతాయని 2019 ఎన్నికలకు ముందు ఆంధ్రజ్యోతి ప్రజలకు హెచ్చరించింది. ఆనాడు మేము చెప్పిందే ఇప్పుడు జరిగింది. మీడియాను దోషిగా నిలబెట్టాలనుకుంటే పోలవరం, అమరావతిలను పూర్తి చేయవలసి ఉంది. జగన్మోహనరెడ్డి ఆలా చేయకపోవడం వల్ల మీడియా ముఖ్యంగా ఆంధ్రజ్యోతి విశ్వసనీయత పెరిగింది” అని కొత్త పలుకులో రాసుకొచ్చారు ఆర్కే. అయితే ఆంధ్రజ్యోతి చెప్పకముందే చంద్రబాబు ఎన్నికల ప్రచార సభల్లో ప్రతి చోట ఇదే మాటలు చెప్పారు. రాష్ట్రానికి రెండు కళ్లు అయిన పోలవరం, అమరావతిలు జగన్ అధికారంలోకి వస్తే ఆగిపోతాయని చంద్రబాబు ప్రచార సభల్లో పేర్కొన్నారు. ఆ తరువాత ఆంద్రజ్యోతి ఆ పాట ఎత్తుకుంది.
“జగన్ చెప్పేదానికి చేసే దానికి పొంతన ఉండదు. ఈ విషయాన్ని ప్రజలు గుర్తించారు. అందుకే విశ్వసనీయతకు తాను చిరునామా అని చెప్పుకుంటున్నప్పటికీ జగన్ ను ప్రజలు నమ్మడం లేదు. మాట తప్పను, మడమ తిప్పను అని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రిని ప్రజలు హేళన చేయడం మొదలు పెట్టారు. అసత్యాలే పునాదులుగా అభూత కల్పనలను ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన జగన్ ఇప్పుడు అవే అసత్యాలను ప్రచారం చేయడం ద్వారా ప్రజల దృష్టిని తన వైపు మళ్లించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందు కోసం సోషల్ మీడియా వారియర్స్ అంటూ ప్రత్యేక నియామకాలు చేపట్టారు. బటన్ నొక్కి డబ్బులు పంచడానికే తాను ఉన్నాననీ వెరపు లేకుండా బహిరంగంగా చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి పాలనలో రాష్ట్రం పరిస్థితి శ్రీలంక లా కాకుండా మరోలా ఎలా ఉంటుంది” అంటూ కొత్త పలుకులో రాసుకొచ్చారు. అయితే ఈ కథనం టీడీపీని సంతృప్తి పర్చడానికి వారిలో కాన్ఫిడెన్స్ పెంచడానికి కొంత మేర దోషదపడుతుంది అని చెప్పవచ్చు.