ఏబీఎన్ ఆర్కే కొత్తపలుకు.., వీకెండ్ కామెంట్ లు భలే గమ్మత్తుగా ఉంటాయి. ఒక ముందస్తు వ్యూహం.., ఒక దీర్ఘ కాళికా రాజకీయ లక్ష్యం.., ఒక పసుపు జెండా నెత్తిన మోసే బాధ్యత.. వెరసి ఆర్కే వారి రాతలు వారం వారం వండుతుంటారు. ఈరోజు బీజేపీ- వైసీపీ కలిసి టీడీపీని దెబ్బకొడుతున్నాయి అంటూ రాసుకొచ్చి… టీడీపీపై “సానుభూతి ఏడుపు వ్యూహం” పండించారు. అది నేరుగా ఓటర్లకు ఒక సూచన. “వైసీపీ- బీజేపీ ఒకటే బాబులు… టీడీపీనే గ్రేట్ అనే ఒక అంతర్గత విత్తనాన్ని ఓటర్లలో నాటడమే దీని లక్ష్యం..!! పైగా అమిత్ సాషా – జగన్ మీటింగ్ లో తిరుపతి ఉప ఎన్నికలో సహకారం పై చర్చ అంటూ తన ఊహని కథనంలో పండించారు.
బీజేపీకి జగన్ ఆర్ధిక సాయమట..!!
ఈ రాతల్లో కొన్ని విడ్డూరాలు చెప్పుకుందాం..! “తిరుపతి సీటు దాదాపు బీజేపీకి ఖాయమే. జనసేన మాటకు విలువ లేకుండా, పవన్ ని ఏ మాత్రం పట్టించుకోకుండా తిరుపతి సీటు నుండి బీజేపీ పోటీకి దిగడం దాదాపు ఖాయమే” అంటూ రాశారు. మరో సందర్భంలో “తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీకి వైసీపీ అధినేత జగన్ ఆర్థికసాయం” అందించడానికి కూడా సిద్ధంగా ఉన్నారట..! ఇక్కడే ఆర్కే అడ్డంగా దొరికిపోతున్నారు.
* బీజేపీ ఇప్పుడు ఆర్ధిక సాయం అర్ధించే స్థితిలో లేదు. బీజేపీకి కోట్లకు కోట్లు ఫండ్ గా ఇవ్వడానికి తెలుగు రాష్ట్రాల్లోనే అనేక మంది సిద్ధంగా ఉన్నారు. మేఘా కృష్ణారెడ్డి బీజేపీకి దగ్గరవుతున్న విషయం ఆర్కేకి తెలుసో లేదో..!? ఆయన పార్టీ తిరుపతి ఉప ఎన్నిక ఖర్చుగా ఫండ్ కూడా ఇవ్వడానికి సిద్ధమయ్యారనేది బీజేపీ అంతర్గత టాక్..!
* ఇదీ కాకుండా… బీజేపీకి మరింత మంది ఆర్ధిక దన్నుగా సిద్ధంగా ఉన్నారు. దిలీప్ కంస్ట్రక్షన్స్ కంపెనీ ప్రస్తుతం రాష్ట్రంలో జాతీయ రహదారుల పనులు చేస్తుంది. మహారాష్ట్ర కి చెందిన ఈ కంపెనీ రాష్ట్రంలో బీజేపీకి పెద్ద ఆర్ధిక దన్ను. ఒంగోలు – చీరాల రూ. 357 కోట్ల ప్రాజెక్టు.., విజయవాడ – గుండుగొలను జాతీయ రహదారి ఆరులైన్లు రూ. 1600 కోట్ల ప్రాజెక్టు.., అనకాపల్లి – పెందుర్తి – ఆనందపురం జాతీయ రహదారి రూ. 370 కోట్ల ప్రాజెక్టులు చేస్తున్నది ఈ కంపెనీనే. బీజేపీకి రాష్ట్రంలో ఎప్పుడైనా ఆర్ధిక దన్నుగా ఉండేది ఈ కంపెనీ. ఇవన్నీ తెలియక.. జగన్ బీజేపీకి ఆర్ధిక సహకారం ఇస్తున్నట్టు రాసుకొచ్చారు. దీని ఉద్దేశం “బీజేపీ – వైసీపీ” ఒకటే … టీడీపీ ఒంటరి అనే సానుభూతి డ్రామాలు పండించి.., ఓట్ల వేట మొదలు పెట్టడమే ఆర్కే లక్ష్యం.
“ప్రజలారా..!? గ్రహించండి..” ఆర్కే వారి మాట..!!
ఇక వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మోసం.. ఈ చేతితో ఇచ్చి.. మళ్ళీ తీసుకోవడమే అనేలా ఆర్కే కథనంలో ఇచ్చారు. అందుకు ఉదాహరణలుగా ఆటో డ్రైవర్లకు రూ. 10 వేలు ఇవ్వడం చెప్పారు. కానీ నేతన్న హస్తం కింద రూ. 24 వేలు, కాపునేస్తాం ద్వారా రూ. 18 వేలు , విద్యాకానుకలు, విద్యాదీవెనలు, ఇళ్ల పట్టాలు ఎలా వెనక్కు తీసుకుంటారు. ఈ పథకాలను కూడా మోసం అని ఆర్కే ఎలా అనగలరు..? పైగా ప్రజలు గ్రహించడం లేదు, ఇది మోసం అన్నట్టు ఏడుపు రాతలు రాశారు. అందుకే ప్రజలారా గ్రహించండి. ఆర్కే రాతల్లో వాస్తవాలు గ్రహించండి..! ఆయన అంతర ఉద్దేశాలు గ్రహించండి..!