Amaravathi Visakha ; ఉద్యమం అంటే స్వతహాగా ఉవ్వెత్తున లేచేదా..!? మీడియా వీడియోల్లో చూపేదా..!? పోరాటం అంటే కన్నీటి నుండి మొదలయ్యెదా..!? పత్రికల్లో ఫోటోల కోసం చేసేదా..!?
ఆందోళన అంటే ఆవేదన నుండి ఆరంభమయ్యేదా..!? అరగంట చేసి తీసేసేదా..!?
వందల రోజుల తరబడి చేస్తున్న అమరావతి ఉద్యమం అసలు రూపం ఇదేనా..!? మొన్న మొదలైన విశాఖ ఉక్కు ఉద్యమం కూడా ఇదేనా..!? నిజానికి అమరావతి ఉద్యమం – ఉక్కు ఉద్యమానికి సంబంధమే లేదు. కానీ ఎన్నికలు, ఓటింగ్ లో మాత్రం ఈ రెండు ఉద్యమాలు ఒకదానితో ఒకటి పోటీ పడ్డాయి..!!
Amaravathi Visakha ; ఉద్యమం ఎందుకు..? ఎవరికీ వ్యతిరేకంగా..!?
రాష్ట్రంలో 2019 నవంబరులో మూడు రాజధానుల నిర్ణయం వెల్లడయింది. నాటి నుండి అమరావతి ప్రాంతంలో విజయవాడకి కూతవేటు దూరంలో ఉన్న ఏడు మండలాల్లో “అమరావతి పరిరక్షణ” ఉద్యమం జరుగుతుంది. ఇప్పటికి 400 రోజుల వరకు పూర్తి చేసుకుంది. ఆ ఉద్యమంలో పాల్గొనే చాలా మందికి భూములు ఆ గ్రామాల్లో ఉన్నప్పటికీ విజయవాడ నగరంలో వ్యాపారాలు, ఉద్యోగాలు, ఉపాధి ఉంది. అంటే ఆ ఉద్యమం నూటికి నూరు శాతం విజయవాడ రాజకీయాన్ని ప్రభావితం చేసేదే..! అటువంటి ఉద్యమం పుట్టింది, చేస్తున్నది మొత్తం సీఎం జగన్/ వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే… కానీ మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం వైసీపీకి గంపగుత్తగా ఓట్లు పడ్డాయి. ఏ మాత్రం తడబాటు లేకుండా వైసీపీకి మేయర్ పీఠం దక్కింది. ఆ పార్టీ కూడా ఊహించనంతగా.., టీడీపీ ఏ మాత్రం తేరుకోలేనంత ఏకపక్షంగా విజయవాడలో వైసీపీ నెగ్గింది. అంటే అమరావతి ఉదయం ఎవరికీ వ్యతిరేకంగా చేస్తున్నట్టు..? ఎవరి కోసం చేస్తున్నట్టు..? ఎవరి ప్రద్బలంతో చేస్తున్నట్టు..!?
మొదటి నుండి అనుమానాలే..!!
అమరావతి ఉద్యమం చుట్టూ మొదటి నుండి అనేక అనుమానాలు ఉండేవి. ఆ ఉద్యమకారుల అతి చేతలు, మాటలు, ఫోటోలు, వీడియోలు, మీడియాల్లో కవరేజీల్లో చూస్తే ఇది సహజమైన ఉద్యమం కాదు.. కృత్రిమ ఉద్యమం.. ఎవరో బలవంతంగా చేయిస్తున్న ఉద్యమం అనేలా ఉండేది. కానీ మరోవైపు “అయ్యో… కడుపు కాలిన రైతులు. భూములిచ్చిన రైతులు.. వారి స్థానాల్లో మనం ఉండి ఆలోచించాలి… ఉద్యమం నిజమేనేమో.., ఆవేదన వాస్తవమేనేమో.. అనిపించేది..” అంతలోనే వారి అతి చేష్టలు విసిగుపుట్టించేవి. ఇప్పుడు ఆ అమరావతి ఉద్యమం అసలు రంగు బయటపడింది. నిజంగా అమరావతి ఉద్యమ ప్రభావమే ఉంటే.. కృష్ణా, గుంటూరు జిల్లాలో వైసీపీకి వ్యతిరేకత ఉండాలి. ఆ వ్యతిరేకత విజయవాడ, గుంటూరు కార్పొరేషన్ ఎన్నికల్లో కనిపించాలి. కానీ అదేమి లేదు. వైసీపీకి ఏకపక్ష విజయం దక్కింది. సో.. ఆ ఉద్యమంపై ఇక అనుమానాలు అక్కర్లేదు. ఆ నిరసనలపై ఇక సందేహాలే అక్కర్లేదు. అది ఒక పార్టీ, ఒక నాయకుడు నడిపిస్తున్న కృత్రిమ ఉద్యమమే..!
* కేవలం మీడియాలో మాత్రం కవరేజీ కోసం చేసే ఉద్యమంలా అమరావతి మారిపోయింది. సినిమాల ఫంక్షన్లులాగా ఉద్యమం వంద రోజులు, 200 రోజులు, ఏడాది అంటూ అతి కవరేజీతో ఏ మాత్రం ప్రయోజనం లేదని ఇప్పుడిప్పుడే అర్ధమవుతుంది..!!
విశాఖలో ప్రభావం అంతంతే..!!
ఇక విశాఖ గురించి కూడా కొన్ని ప్రాక్టీకల్ వాస్తవాలు మాట్లాడుకోవాలి. “విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు” అంటే విశాఖ ఉక్కు విశాఖాధి మాత్రమే కాదు… ఆంధ్ర ప్రదేశ్ మొత్తానికి అనే వాక్కు అది. కానీ నిజానికి ఇది విశాఖలో కూడా పూర్తిగా ఈ సెంటిమెంట్ లేదు. విశాఖలో దాదాపు 20 లక్షల జనాభా ఉంటారు. అంటే సుమారుగా 5 లక్షల కుటుంబాలు. దీనిలో విశాఖ స్టీల్ ప్లాంట్ పై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన కుటుంబాలు 50 వేలు మాత్రమే ఉంటాయి. సో.. విశాఖ ఓవరాల్ జనాభాలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభావం పది శాతంపై మాత్రమే. కాకపోతే ప్రాంతీయత, సెంటిమెంట్ కూడా కొంత పని చేస్తే మరో 15 శాతం మందికి విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమంపై మనసు ఉంటుంది. అందుకే ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. టీడీపీకి రావాల్సిన ఓటింగ్ తో పాటూ ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ పై విపరీతంగా మనసు పారేసుకున్న కొన్ని ఓట్లు టీడీపీకి వెళ్లాయని అర్ధమవుతుంది. ఆ ఉద్యమం చూసి, ఫ్యాక్స్ చూసి, మీడియాలో కవరేజీ చూసి వైసీపీ కూడా కొంత ఆందోళనకు గురయింది. కానీ ఓటింగ్ లో ఆ ఫలితం రాలేదు. సో.. ప్రస్తుతానికి విశాఖ ఉక్కు ఉద్యమం కూడా పూర్తిస్థాయిలో రూపుదిద్దుకోలేదు. మీడియానే కాస్త అతి చూపిస్తుంది.. మీడియాని చూసి కొన్ని మాటల పులులు అతి మాట్లాడుతున్నాయి.. అనేది మాత్రం తేలినట్టే..!!
(మొత్తం చదివిన తర్వాత ఉద్యమాలు గొప్పవి.. కించ పరచరాదు.. వైసీపీ ప్రలోభం, పోలీస్ బలం, డబ్బు చూపించింది కాబట్టి వైసీపీ గెలిచింది లేకపోతే ఫలితం వేరేలా ఉండేది…. మేము కావాలనే ఉద్దేశపూర్వకంగా రాసాము అనే అభిప్రాయానికి వస్తారేమో …. కానీ నిజమైన ఉద్యమం ప్రలోభాలు, పోలీసులు, డబ్బులకు లొంగదు అనే విషయాన్నీ గ్రహించాలి..!!)
– శ్రీనివాస్ మానెం