AP Cabinet: ఆంధ్రప్రదేశ్ లో మంత్రి వర్గ పునర్వవస్థీకరణ లేదా మంత్రి వర్గ మార్పులకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చేసింది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు. ఉగాది నాటికి మంత్రి వర్గ పునర్వవస్థీకరణ జరిగే అవకాశాలు ఉన్నాయనీ, మంత్రివర్గం నుండి తొలగించిన మంత్రులకు పార్టీ బాధ్యతలను అప్పగించనున్నారని “న్యూస్ ఆర్బిట్” గతంలోనే కథనాన్ని ఇవ్వడం జరిగింది. మంత్రులుగా చేసిన వారికి పార్టీ జిల్లా ఇన్ చార్జిలుగా అప్పగించబోతున్నారు అని డిసెంబర్ లోనే “న్యూస్ అర్బిట్” ప్రచురించింది. ఇప్పుడు అదే జరగబోతున్నది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిన్న కేబినెట్ అత్యవసర భేటీలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఇప్పటి వరకూ ఉన్న మంత్రి వర్గంలో ఒక డ్రాబాక్ ఉంది. అది ఏమిటంటే మంత్రుల్లో చాలా మంది వారి శాఖలకు సంబంధించి సబ్జెట్ ను ఎవరూ మాట్లాడరు. ఉదాహరణకు తీసుకుంటే.. మంత్రి కొడాలి నాని ఫౌర సరఫరాల శాఖ మంత్రి అని ఎవరూ ఠక్కున చెప్పే పరిస్థితి లేదు. ఆ శాఖకు సంబంధించిన విషయాలపై పది రోజులకు ఒక సారో నెలకు ఒక సారో మాట్లాడితే ఆయన ఫలానా శాఖ మంత్రి అని జనాలకు తెలుస్తుంది. అంతే కానీ తన శాఖ విషయాన్ని మరచి ప్రతిపక్ష పార్టీ నాయకులను పరుష పదజాలంతో తిట్టడమే పనిగా పెట్టుకోవడంతో ఆయనను ఆ శాఖ మంత్రేగానే చాలా మంది వ్యంగ్యంగా విమర్శిస్తుంటారు.
AP Cabinet: ఏ శాఖకు ఎవరు మంత్రో తెలియదు
అలానే మన మంత్రివర్గంలో ఉన్న తానేటి వనిత ఏ శాఖ మంత్రి అంటే చాలా మంది చెప్పలేని పరిస్థితి. ఏ శాఖకు ఎవరు మంత్రి అని కూడా చాలా మందికి తెలియదు. ఆయా శాఖ పై ఆ మంత్రులు ఎంత పట్టు సాధించారు అంటే చెప్పడం కష్టమే. కొంత మంది మంత్రుల వరకూ పని తీరు భేష్ అని చెప్పవచ్చు. అందులో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఆర్ధిక శాఖ నిర్వహణకు చాలా కష్టపడుతున్నారు. అలానే విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, విద్యుత్, అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, దివంగత పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తదితరులు వారి శాఖలకు న్యాయం చేశారు. గుర్తింపు తెచ్చుకున్నారు. తానేటి వనిత, పుష్పశ్రీవాణి, అంజాద్ బాషా, శంకర నారాయణ, కృష్ణదాస్, అప్పలరాజు, వేణుగోపాల కృష్ణ తదితర మంత్రులు ఎవరు ఏ శాఖ అంటే చెప్పడం కష్టమే. ఎందుకంటే ఆ మంత్రులు ఆ శాఖలకు సంబంధించి రివ్యూలు చేయకపోవడం, ఆ శాఖల ప్రగతిపై మీడియాతో మాట్లాడకపోవడం, ప్రజలకు వివరించకపోవడం, ప్రజల ముందు రాకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడుతోంది.
ఇటువంటి తప్పులు పునరావృత్తం కాకుండా
ఇటువంటి తప్పులు పునరావృత్తం కాకుండా రాబోయే మంత్రివర్గంలో జగన్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మంత్రులు వారి శాఖలకు సంబంధించి 50 శాతం అయినా పట్టు సాధించాలి. ఆ శాఖపై రివ్యూలు చేయాలి, ప్రజలకు వివరించాలి. అప్పుడే మంత్రి పదవులకు వారు న్యాయం చేసిన వారు అవుతారు. వారు మాజీలు అయిన తరువాత కూడా వారి చేసిన కార్యక్రమాలను ప్రజలు గుర్తుంచుకుంటారు. ఫలానా మంత్రి హయాంలో ఈ పని జరిగింది అని ప్రజలు చెప్పుకుంటారు. అటువంటిది ఈ మూడు సంవత్సరాల్లో లేదు. రాబోయే రెండు సంవత్సరాలు ఇటువంటి పొరబాట్లు లేకుండా జగన్మోహనరెడ్డి చర్యలు తీసుకుంటారని, మంత్రులు వారి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారని ఆశిద్దాం.