AP Cabinet: ఆంధ్రప్రదేశ్ లో కేబినెట్ మార్పులకు సంబంధించి రాజకీయ వర్గాల్లో అనేక చర్చలు జరుగుతున్నాయి. పలు ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. ఉగాది నాటికి మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ జరుగుతుందని వైసీపీలో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం జగన్ కేబినెట్ లో ముగ్గురు నానిలు ఉన్న సంగతి తెలిసిందే. వీరి గురించి అందరికీ తెలిసిందే. వీరిలో ఆళ్ల నాని. డిప్యూటీ సీఎం మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. ఈ మంత్రి ఏలూరు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరో మంత్రి కొడాలి నాని. గుడివాడ నుండి ప్రాతినిధ్యం వహిస్తూ పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నారు. ఆ తరువాత మచిలీపట్నం ఎమ్మెల్యేగా ఉన్న పేర్ని నాని. సమాచార, రవాణా, సినిమాటోగ్రఫీ మంత్రి బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈ ముగ్గురు నానిలు మూడు కీలకమైన శాఖలను నిర్వహిస్తున్నారు. ఈ ముగ్గురులో ఇద్దరు ఆళ్ల నాని, పేర్నిలు కాపు సామాజికవర్గ కోటా నుండి మంత్రులు అయ్యారు. కొడాలి నాని కమ్మ సామాజికవర్గం. కేబినెట్ మార్పులు జరిగే క్రమంలో ఈ ముగ్గురు మంత్రులుగా కొనసాగుతారా..? వీరి స్థానంలో వేరే వారికి జగన్ అవకాశం ఇస్తారా..? అనేది ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్ గా ఉంది.
AP Cabinet: కాపు సామాజికవర్గం నుండి విపరీతమైన పోటీ
కాపు సామాజికవర్గంలో మంత్రులుగా పై ఇద్దరితో పాటు బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్, కురసాల కన్నబాబులు ఉన్నారు. రెడ్డి సామాజికవర్గంలో నలుగురు మంత్రులు ఉండగా, కాపు సామాజికవర్గం నుండి మాత్రం అయిదుగురు మంత్రులు ఉన్నారు. ఇప్పుడు ఈ అయిదుగురిని పక్కన పెట్టి కొత్తగా మరో అయిదుగురిని తీసుకుంటే బాగుంటుంది అని సీఎం జగన్మోహనరెడ్డి ఆలోచనగా ఉందని అంటున్నారు. ఎందుకంటే కాపు సామాజికవర్గం నుండి చాలా మంది ఎమ్మెల్యేలు వైసీపీలో ఉన్నారు. ఆ సామాజికవర్గం నుండి మంత్రి పదవులు ఇవ్వాలంటే విపరీతమైన పోటీ ఉంది. ఉదాహరణకు తూర్పు గోదావరి జిల్లాలోనే ఇద్దరు రాజాలు ఉన్నారు. ఒకరు జక్కంపూడి రాజా, మరొకరు దాడిశెట్టి రాజా ఉన్నారు. కాపు సామాజికవర్గం నుండి చూసుకుంటే గ్రంధి శ్రీనివాస్, అంబటి రాంబాబు, సామినేని ఉదయభాను, తోట త్రిమూర్తులు ఇలా చాలా మంది ఉన్నారు. ఈ సామాజికవర్గం నుండి అయిదుగురికి మంత్రిపదవులు ఇవ్వాలంటే కేబినెట్ లో ఉన్న అయిదుగురుని బయటకు పంపించాలి.
Read More: YS Viveka: వివేకా కేసులో దారుణ నిజాలు..! వైసీపీకి బిగుస్తున్న ఉచ్చు..?
AP Cabinet: పార్టీలో కీలక బాధ్యతలు..?
పేర్ని నాని అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నారు. వివాదాస్పద అంశాలపై కూడా తెలివిగా మాట్లాడుతున్నారు. ప్రభుత్వాన్ని ఢిఫెన్స్ చేసే విధంగా సబ్జెక్ట్యే మాట్లాడుతున్నారు. ఉన్న మంత్రుల్లో కాస్త సబ్జెక్ట్ పరంగా వ్యంగ్యంగా మాట్లాడటంలో పేర్ని నాని దిట్ట అని చెప్పుకోవచ్చు. ప్రభుత్వంపై విమర్శ వచ్చినప్పుడు దానిపై ప్రతి విమర్శలు చేయడం కూడా ఒక కళ. ఆ కళ పేర్ని నానిలో బాగా ఉందని అంటుంటారు. ప్రస్తుతం జగన్ మంత్రి వర్గంలో సబ్జెక్ట్ పై అనర్గళంగా మాట్లాడే నలుగురైదుగురు మంత్రుల్లో పేర్ని నాని ఒకరు. ఇప్పుడు ఆయనను పక్కన పెడితే ఆయన స్థానం భర్తీ చేయడం ఎలా..?. ఇదే జిల్లా నుండి చాలా మంది మంత్రి పదవులను ఆశిస్తున్నారు. పేర్ని నానిని ఒక వేళ పక్కన పెట్టినా మరో కీలకమైన పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అదే విధంగా ఆళ్ల నాని, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబులను పక్కన పెట్టినా వారికి పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
AP Cabinet: తలశిల రఘురామ్ లేదా వసంత
ఇక కొడాలి నాని విషయానికి వస్తే కమ్మ సామాజికవర్గం నుండి ఉన్న ఏకైక మంత్రి ఆయన. ఈ సామాజికవర్గం నుండి వైసీపీలో పోటీ ఉంది. అదే జిల్లా (కృష్ణా)లో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ మంత్రి పదవిని ఆశిస్తున్నారు. అలానే ఇటీవల ఎమ్మెల్సీ ఇచ్చిన తలశిల రఘురామ్ కు మంత్రి పదవి ఇస్తారన్న చర్చ పార్టీలో జరుగుతోంది. అదే విధంగా ఈ సామాజికవర్గం నుండి మంత్రి పదవులు ఆశిస్తున్న వారు చాలా మందే ఉన్నారు. మొదటి నుండి జగన్మోహనరెడ్డితో పాటు ఉంటూ జగన్ అన్ని కార్యక్రమాలను దగ్గర ఉండి పర్యవేక్షిస్తూ వచ్చిన తలశిల రఘురామ్ కు మంత్రి పదవి ఇస్తే మాత్రం కొడాలి నానిని బయటకు పంపడం ఖాయమనే మాట వినబడుతోంది. అప్పుడు కొడాలి నానికి పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఈ ముగ్గురు నానిలు కేబినెట్ నుండి బయటకు వచ్చేస్తున్నట్లే అన్న ప్రచారం పార్టీలో జరుగుతోంది.