AP New Ministers: ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గ ప్రక్షాళనకు కసరత్తు జరుగుతోంది. ఈ నెల 11వ తేదీ నూతన మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న 24 మంది మంత్రులు రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖలను సీఎం వైఎస్ జగన్ కు అందజేశారు. కొత్తగా ఎవరెవరికి మంత్రి పదవులు లభిస్తాయి..? పాత మంత్రుల్లో ఎవరెవరికి తిరిగి అవకాశం ఇస్తారు..? అనే దానిపై అనేక సందేహాలు, ఉహాగానాలు సాగుతున్నాయి. పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం మేరకు పాత మంత్రులు నిరుత్సాహ పడకుండా వాళ్లకు ప్రత్యేకమైన పదవులు కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. వాళ్లకు జిల్లా అభివృద్ధి మండలి చైర్మన్ లాంటి ప్రోటోకాల్ పదవి ఇచ్చి వాళ్ల సేవలను పార్టీకి వినియోగించుకోనున్నారని సమాచారం. జిల్లాకు ఒక మంత్రి పదవి ఇవ్వనున్నారు. ఏ జిల్లా నుండి ఎవరికి మంత్రివర్గంలో అవకాశం ఇవ్వనున్నారు అనేది పరిశీలిస్తే…
శ్రీకాకుళం జిల్లా నుండి పలాస ఎమ్మెల్యే సిదిరి అప్పలరాజు మంత్రిగా ఉన్నారు. ఆయననే మంత్రివర్గంలో కొనసాగించే అవకాశం ఉంది. ఒక వేళ ఆయనను కొనసాగించని పక్షంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావుకు మంత్రి వర్గంలో అవకాశం కల్పించనున్నారు. రాజకీయంగా ఈ జిల్లా యాక్టివ్ కాబట్టి అవసరమైతే ఇద్దరికీ అవకాశం కల్పించే అవకాశం ఉంది. స్పీకర్ తమ్మినేని సీతారామ్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. విజయనగరం జిల్లాలో విజయనగరం ఎమ్మెల్యే కొలగట్ల వీరభద్రస్వామి పేరు పరిశీలనలో ఉంది. ఈయన ఆర్యవైశ్య సామాజికవర్గానికి చెందిన నాయకుడు. దాదాపుగా ఆయనను జగన్ మంత్రి వర్గంలోకి తీసుకోనున్నారు. ఒక వేళ ఈయనకు అవకాశం ఇవ్వకపోతే బొత్స సత్యనారాయణ సోదరుడు గజపతినగర్ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య కు ఇవ్వవచ్చు. అయితే వీరభద్రస్వామికే దాదాపు కన్ఫర్మ్ అయినట్లు సమాచారం.
పార్వతీపురం మన్యం జిల్లా నుండి సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొర కి మంత్రిపదవి ఇచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒక వేళ ఎస్టీ మహిళకు ఇవ్వాల్సి వస్తే వి కళావతికి అవకాశం దక్కవచ్చు. పార్టీ ద్వారా అందుతున్న సమాచారం మేరకు రాజన్న దొరకే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా నుండి అరకు ఎమ్మెల్యే శెట్టి ఫల్గుణ పేరు పరిశీలనలో ఉంది. ఈ జిల్లా నుండి ఫల్గుణకు ఇస్తే పార్వతీపురం నుండి కళావతిని మంత్రివర్గంలోకి తీసుకుంటారు. విశాఖపట్నం జిల్లాలో ఆరుగురు ఎమ్మెల్యేలు ఉండగా అందులో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇద్దరిలో ఒకరు గాజువాక ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు ఆయనను తొలగించారు. ఇక భీమిలి ఎమ్మెల్యే తిప్పాల నాగిరెడ్డికి మంత్రి పదవి వరిస్తుందని అందరూ అనుకుంటున్నారు. కానీ ఆయనకు చాన్స్ లేదని తెలుస్తోంది. విశాఖపట్నం జిల్లా నుండి ఎవరికీ మంత్రి పదవి ఇవ్వడం లేదని సమాచారం.
అనకాపల్లి జిల్లా నుండి అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమరనాథ్ పేరు మంత్రివర్గంలో దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. కాకినాడ జిల్లాలో తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా పేరు దాదాపు కన్ఫర్మ్ అయ్యింది. కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా ఉన్న ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. కోనసీమ జిల్లా నుండి అమలాపురం ఎమ్మెల్యే విశ్వరూప్, రామచంద్రాపురం ఎమ్మెల్యే చెన్నుబోయిన వేణుగోపాల కృష్ణ లు ఉండగా చెన్నుబోయిన వేణుగోపాల కృష్ణను మరల మంత్రివర్గంలో కొనసాగించనున్నారు. తూర్పు గోదావరి జిల్లా నుండి రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పేరు ప్రముఖంగా వినబడుతోంది. ఆయనకు ఇవ్వని పక్షంలో గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు పేరు పరిశీలించే అవకాశం ఉంది.
పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రస్తుతం ఇద్దరు మంత్రులుగా ఉన్నారు. ఈ జిల్లా నుండి భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కు దాదాపు కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. క్షత్రియ కోటాలో నరసాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజుకు కూడా అవకాశం ఉన్నట్లు సమాచారం. ఏలూరు జిల్లా నుండి దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి పేరు ప్రచారంలో ఉన్నప్పటికీ కమ్మ సామాజిక వర్గం నుండి వేరే వాళ్ల పేరు ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. ఈ జిల్లా నుండి నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు పేరు దాదాపు ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. లేని పక్షంలో తెల్లం బాలరాజు పేరు పరిశీలనలో ఉంది. కృష్ణాజిల్లా నుండి పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ పేరు దాదాపు ఫైనల్ అయ్యింది. ఈ జిల్లా నుండి పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్ధసారధి, జోగి రమేష్ లు మంత్రి పదవులను ఆశిస్తుండగా చివరకు జోగి రమేష్ కే అవకాశం ఇస్తున్నట్లు సమాచారం. ఒక వేళ జోగి రమేష్ కు ఇవ్వకపోతే పార్ధసారధికి అవకాశం ఇవ్వవచ్చు. ఎన్టీఆర్ జిల్లాలో కూడా పరిస్థితి కీలకంగానే ఉంది. ఈ జిల్లాలో నందిగామ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహనరావు సోదరుడు ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ సీఎం జగన్మోహనరెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఎస్సీ కోటాలో జగన్మోహనరావు కు అవకాశం ఉంది. ఒక వేళ మొండితోక జగన్మోహనరావు కు అవకాశం ఇవ్వకపోతే ఈ జిల్లా నుండే అదే సామాజికవర్గానికి చెందిన తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి పేరు పరిశీలన లో ఉంది. కాపు సామాజికవర్గ కోటాలో జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను పేరు కూడా పరిశీలనలో ఉంది. ఈ జిల్లా నుండి సామినేని ఉదయభానుతో పాటు రక్షణ నిధికి లకు అవకాశం ఉంది.
గుంటూరు జిల్లా నుండి గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తాఫా లేదా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి లలో ఒకరికి అవకాశం ఇవ్వవచ్చు. నారా లోకేష్ ను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ఆళ్ల రామకృష్ణారెడ్డికి అవకాశం ఉంది. ఒక వేళ ఆర్కేకి ఇవ్వని పక్షంలో ముస్తఫా పేరు కన్పర్మ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బాపట్ల జిల్లా నుండి వేమూరు ఎమ్మెల్యే మేరుగ నాగార్జున పేరు దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఆయన కాకపోతే బ్రాహ్మణ సామాజివర్గం నుండి కోనా రఘుపతి పేరు ఫైనల్ చేసే అవకాశం ఉంది. పల్నాడు జిల్లాలో చిలకలూరిపేట ఎమ్మెల్యే విడతల రజని సీరియస్ గా ట్రై చేస్తున్నారు. అయితే పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావును కమ్మ సామాజికవర్గ కోటాలా ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ జిల్లా నుండి కాంపిటేషన్ బాగా ఉంది. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అంబటి రాంబాబు, విడతల రజని, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇలా నలుగురు మంత్రి పదవులను ఆశిస్తున్నారు. ఈ జిల్లా నుండి శంకరరావు కు అవకాశం ఇవ్వకపోతే విడతల రజనికి ఛాన్స్ దక్కవచ్చు.
ప్రకాశం జిల్లా నుండి ప్రస్తుతం బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్ లు మంత్రులుగా ఉన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి కి రీజనల్ కోఆర్డినేటర్ పదవి ఇస్తూ యర్రగొండపాలెం ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ ను మంత్రివర్గంలో మరో సారి అవకాశం ఇస్తున్నారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో బాగా కాంపిటేషన్ ఉంది. శ్రీధర్ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి, కొవ్వూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇలా చాలా మంది మంత్రి పదవులు ఆశిస్తున్నారు. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డికి దాదాపుగా కన్ఫర్మ్ అయినట్లుగా తెలుస్తోంది. కర్నూలు జిల్లాలోనూ బాగా కాంపిటేషన్ ఉంది. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, ఆదోని సాయి ప్రతాప్ రెడ్డి, పత్తకొండ ఎమ్మెల్యే శ్రీదేవి లు పోటీ పడుతున్నారు. జయరామ్ నే కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. వాల్మీకి సామాజికవర్గం నుండి జయరామ్ ఒక్కరే ఎమ్మెల్యేగా ఉన్నారు. అనంతపురం, కర్నూలు జిల్లాలో ఆ సామాజికవర్గ ఓట్లు ఎక్కువ. అందుకే ఆయనను కొనసాగించే అవకాశాలు ఉన్నాయి.
నంద్యాల జిల్లా నుండి కూడా హెవీ కాంపిటేషన్ ఉంది. డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మంత్రిగా ఉన్నారు. ఈయన స్థానంలో శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డికి దాదాపు ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. అనంతపురం జిల్లాలోనూ కాంపిటేషన్ ఎక్కువగానే ఉంది. శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి పేరు దాదాపు కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రసాదరెడ్డి కూడా ట్రై చేస్తున్నారు. వీరిద్దరిలో ఒకరికి ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. శ్రీ సత్యసాయి జిల్లా నుండి ప్రస్తుతం పెనుగొండ ఎమ్మెల్యే శంకరనారాయణ మంత్రిగా ఉన్నారు. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, పుట్టపర్తి, కదిరి ఎమ్మెల్యేలు ట్రై చేస్తున్నారు. ఈ జిల్లా నుండి మడకశిర ఎమ్మెల్యే కు అవకాశం ఉందని తెలుస్తోంది. ఒక వేళ మడకశిర ఎమ్మెల్యేకి కాకపోతే ధర్మవరం ఎమ్మెల్యేకి ఇచ్చే అవకాశం ఉంది. వైఎస్ఆర్ కడప జిల్లా నుండి సీఎం జగన్ ఉన్నందున ఆ జిల్లా నుండి ఎవరికీ అవకాశం లేదని అంటున్నారు. అన్నమయ్య జిల్లాలో రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డికి దాదాపు కన్ఫర్మ్ అయ్యింది. ఆయన కాకపోతే ఎస్సీ సామాజికవర్గానికి చెందిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీనివాసరావుకు అవకాశం ఇవ్వవచ్చు.
చిత్తూరు జిల్లా నుండి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రిగా ఉన్నారు. ఈ జిల్లా నుండి విపరీతమైన కాంపిటేషన్ ఉంది. నగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు దాదాపు గా కన్ఫర్మ్ అయినట్లుగా చెబుతున్నారు కానీ చివరకు ఏమి జరుగుతుందో చూడాలి. తిరుపతి జిల్లాలో భూమన కరుణాకర్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, వెంకటగిరి ఆనం రామనారాయణరెడ్డిలు మంత్రి పదవులను ఆశిస్తున్నారు. ఈ జిల్లా నుండి చెవిరెడ్డి భాస్కరరెడ్డికి దాదాపుగా కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. ఒక వేళ ఆయనకు అవకాశం ఇవ్వకపోతే భూమన కరుణాకర్ రెడ్డికి చాన్స్ దక్కవచ్చు. మంత్రి పదవులను ప్రశాంత్ కిషోర్ (పీకే) టీమ్ సర్వే ఆధారంగా ఇస్తున్నట్లు సమాచారం. ఆరు నెలలుగా వాళ్ల పనితీరు, వాళ్ల పట్ల ప్రజలకు ఉన్న అభిప్రాయంతో పాటు సామాజిక సమీకరణాలు చూసుకుని ఎంపిక చేస్తున్నట్లు సమాచారం.