AP Politics: రాష్ట్ర రాజకీయాల్లో ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాలు, విజయనగరం జిల్లాలో తొమ్మిది, విశాఖపట్నం జిల్లాలో 15 మొత్తం కలిపి 34 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో కనీసం 20 నుండి 23 సీట్లు గెలుచుకోవాలన్నది రెండు ప్రధాన పార్టీల లక్ష్యం. 2019 ఎన్నికల్లో వైసీపీ ఎక్కువ సీట్లే గెలుచుకుంది. అయితే ఇప్పుడు విశాఖ జిల్లాలో వైసీపీ కొంత బలహీనపడిందని వార్తలు వస్తున్నాయి. గతం మీద చూసుకుంటే టీడీపీ కాస్త బలపడినట్లు ఆ పార్టీ భావిస్తోంది. విశాఖలో తాము పొగొట్టుకున్న బలాన్ని పొందేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. జనసేనతో పొత్తు పెట్టుకుంటే ఇక్కడ టీడీపీగా బాగా కలిసి వచ్చే అంశం. మరో పక్క వైసీపీ గతంలో ఎలాగైతే అత్యధిక స్థానాలు గెలుచుకుందో అదే ఊపుతో అన్నీ స్థానాలు గెలుచుకునేందుకు వైసీపీ కొత్త ఎత్తులు వేస్తోంది. అది ఏమిటంటే…జగన్మోహనరెడ్డి మొదటి నుండి పులివెందుల నుండి పోటీ చేస్తున్నారు. మంచి మెజార్టీతో విజయం సాధిస్తూ వస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో విశాఖ జిల్లాలోని ఏదో ఒక నియోజకవర్గం నుండి జగన్మోహనరెడ్డి పోటీ చేయాలన్నది ఒక ఆలోచన. పార్టీలో ఒక ప్రతిపాదనగా ఉంది. విశాఖను పరిపాలనా రాజధానిగా చేసినందున ఈ ప్రాంతంపై వైసీపీకి, జగన్మోహనరెడ్డికి ప్రత్యేకమైన దృష్టి, ప్రేమ ఉంది అని నిరూపించుకోవాలని భావిస్తున్నారుట.
AP Politics: విశాఖ జిల్లా నుండే జగన్, లోకేష్ పోటీ
విశాఖను పరిపాలనా రాజధానిగా చేయడానికి కొన్ని చట్టపరమైన ఇబ్బందులు వచ్చిన కారణంగా అది ఇప్పటి వరకూ అవ్వలేదు. అందుకే వచ్చే ఎన్నికల నాటికి జగన్మోహనరెడ్డి విశాఖలోని ఏదో ఒక నియోజకవర్గం నుండి పోటీ చేసి తనకు విశాఖపట్నం పట్ల అమితమైన ప్రేమ ఉందని అందుకే ఇక్కడ నుండి పోటీ చేశాను, ఇక్కడ అభివృద్ధి చేస్తాను అని చెప్పడం కోసం ఆ సంకేతాలు ఇవ్వడానికి పోటీ చేయనున్నారనేది ఒక టాక్ నడుస్తోంది. ఇక టీడీపీ నేత నారా లోకేష్ మంగళగిరి నుండి పోటీ చేస్తున్నారు. 2024 నుండి కూడా ఆయన మంగళగిరి నుండే పోటీ చేయడం ఖాయం. ఎక్కడైతే ఓడిపోయానో అక్కడే గెలిచి చూపించాలన్నది ఆయన లక్ష్యం. నాయకుడికి ఆ లక్షణాలు ఉండాలి. ఓడిపోతే ఆ నియోజకవర్గం నుండి పారిపోతే అతన్ని నాయకుడు అనరు. చెడు సంకేతాలు వెళతాయి. అందుకే మంగళగిరిలో పోటీ చేస్తూనే విశాఖ నార్త్ లేదా భీమిలి నుండి కూడా పోటీ చేయాలన్నది నారా లోకేష్ ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది. లేకుంటే విశాఖ నగరంలోని ఏదో ఒక నియోజకవర్గం నుండి పక్కాగా పోటీ చేయాలని భావిస్తున్నారుట. పార్టీ కూడా ఆయన ప్రతిపాదనకు అంగీకరిస్తోందని అంటున్నారు. విశాఖ వేదికగా రెండు పార్టీల్లోని ప్రధాన నాయకులు ఉత్తరాంధ్ర రాజకీయాలను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నారని సమాచారం. వీటిని బట్టి రెండు పార్టీల స్ట్రాటజీని అర్ధం చేసుకోవచ్చు.
గాజువాక నుండి పవన్
మొదటి నుండి జగన్మోహనరెడ్డి గురి విశాఖపట్నంపై ఉంది. అందుకే 2014 ఎన్నికల్లో విశాఖ ఎంపీ స్థానం నుండి జగన్ తల్లి విజయమ్మను పోటీ చేయించారు. కాకపోతే ఆ ఎన్నికల్లో ఆమె ఓడిపోయారు. నారా లోకేష్ విషయానికి వస్తే గతంలో విశాఖ జిల్లా భీమిలి నుండి పోటీ చేయనున్నారని కూడా వార్తలు వచ్చాయి. ఆ తరువాత విశాఖ నార్త్ నుండి పోటీ చేయనున్నారని ప్రచారం జరిగింది. వాస్తవానికి నారా లోకేష్ ఆ రెండింటిలో ఎక్కడ నుండి పోటీ చేసినా అవి సేఫ్ జోన్స్. కానీ ఆయన ఆ రెండింటి నుండి పోటీ చేయకుండా మంగళగిరి నుండి పోటీ చేశారు. అందుకే ఇప్పుడు ఒక రిస్కీ నియోజకవర్గం నుండి మరో సేఫ్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తే బాగుంటుందని పార్టీ ప్రతిపాదనల్లో భాగంగా రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నారని సమాచారం. రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయడం తప్పు కాదు కాబట్టి ఈ పద్ధతిని ఎంచుకున్నారుట. మరో పక్క పవన్ కళ్యాణ్ కూడా గాజువాక నుండి పోటీ చేయనున్నారు. ఇలా ముగ్గురు ప్రధాన పార్టీ నేతలు ఒకే జిల్లాలో పోటీ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెద్ద మలుపుగా చెప్పుకోవచ్చు.