AP Politics: ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో పార్టీ అధినేత చంద్రబాబు ఓటములపై పోస్టుమార్టం చేస్తున్నారు. పార్టీలో కోవర్టులను ఏరి పారేసి ప్రక్షాళన చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే పార్టీలో ప్రక్షాళన మొదలైంది. ఆ ప్రక్షాళన ఒక హెచ్చరికలతో ఆగిపోతుందా ? ఒకరిద్దరు సస్పెండ్ లతో ఆగిపోతుందా ? మళ్లీ పాత చింతకాయ పచ్చడిలా టీడీపీ మళ్లీ పాత తరహాలోకి వెళుతుందా ? లేదా ఈ సస్పెన్షన్లు ఇంకా కొనసాగుతాయా ? అనేది చాలా ఆసక్తికరంగా మారింది. చాలా నియోజకవర్గాల్లోని గ్రామ స్థాయి నాయకులు ఇన్ చార్జిలపై ఫిర్యాదులు చేస్తున్నారు. వాళ్లే అధికార పార్టీకి కోవర్టులుగా మారిపోయారు. వాళ్లే అమ్ముడుపోయారు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల వద్ద డబ్బులు తీసుకుని పార్టీని బలహీనపరుస్తున్నారు అని ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీ చేస్తున్న స్పాన్సర్డ్ పాలిటిక్స్ లో టీడీపీకి చెందిన కొంత మంది ఇన్ చార్జిలు పావులుగా ఉన్నారు. సంపాదించుకుంటున్నారు అనేది ప్రధాన ఆరోపణ.
AP Politics: 25 మంది ఇన్ చార్జిల పై ఆరోపణలు
నిజానికి నియోజకవర్గ ఇన్ చార్జిలు అంటే ఎమ్మెల్యేలతో సమానమైన హోదా. రాబోయే ఎన్నికల్లో గెలిస్తే వాళ్లే ఎమ్మెల్యేలు. వీళ్లే రాజకీయ ప్రత్యర్ధులతో కలిసిపోయి అమ్ముడుపోతే పార్టీ సమాధి అయిపోతుంది కదా. ఇది పార్టీ భవిష్యత్తుకు చాలా ప్రమాదం. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు డివిజన్ లెవల్ లో సమీక్షలు నిర్వహిస్తూ మండల స్థాయి నాయకులనే గుర్తించారు. నియోజకవర్గ ఇన్ చార్జిలు కూడా ఇలా ఉన్నారు అనేది కార్యకర్తల ఆరోపణ. రాష్ట్ర వ్యాప్తంగా 25 మంది ఇన్ చార్జిల పై ఈ రకమైన ఆరోపణలు ఉన్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీ నాయకులు చేస్తున్న అక్రమ వ్యాపారాల్లో భాగస్వాములు అయి వాటాలు తీసుకుంటున్నారని సమాచారం. వీళ్ల సమాచారం కూడా పార్టీ అధిష్టానం వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వీళ్లపై పార్టీ చర్యలు తీసుకుంటుందా లేదా అనే దానిపై చర్చ జరుగుతోంది.
త్వరలో కొన్ని సస్పెన్షన్లు
నియోజకవర్గ స్థాయి ఇన్ చార్జి ని సస్పెండ్ చేస్తే అతను పార్టీని చాలా దెబ్బతీసే అవకాశాలు ఉంటాయి. సున్నితమైన అంశం. అసలే కష్టాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీకి ఇది పెద్ద తలనొప్పిగా మారుతుంది. అలా కాకుండా డివిజన్, మండల స్థాయిలో నాయకులను సస్పెండ్ చేసి మిగిలిన వారికి హెచ్చరికలు జారీ చేస్తే వాళ్లు అప్రమత్తమయ్యే అవకాశం ఉంటుంది. అందుకే చంద్రబాబు దిగువ స్థాయిలో చర్యలకు ఉపక్రమించారు. అసలే చావు బతుకు మధ్య ఐసీయులో ఉన్న పార్టీని బ్రతికించుకోవాలంటే చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి త్వరలో పాదయాత్రో, బస్సు యాత్రో చేయనున్నారు. ఇటువంటి సమయంలో 25 మంది ఇన్ చార్జిలపై చర్యలు తీసుకుంటే పార్టీ ఇంకా మైనస్ లోకి వెళ్లే ప్రమాదం ఉంది. అందుకే వాళ్లను పిలిచి వాళ్ల వివరాలను చెప్పి అప్రమత్తం చేసే అలోచనలో పార్టీ ఉంది. పార్టీ ప్రక్షాళన ఇదే విధంగా రెండు మూడు నెలల పాటు కొనసాగే అవకాశం ఉందని సమాచారం. నెల్లూరు, కుప్పంతో పాటు అనేక నియోజకవర్గాల్లో కోవర్టులు ఉన్నారు. వీళ్లందరిపై టీడీపీ నిఘా పెట్టిందనీ, త్వరలో కొన్ని సస్పెన్షన్లు ఉంటాయనేది సమాచారం.