Atmakur Bypoll: నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికల పోలింగ్ నిన్న ముగిసింది. ఫలితాల కోసం ప్రధాన రాజకీయ పక్షాలతో పాటు ఆయా పార్టీల అభిమానులు, ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 26వ తేదీన ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలను వెల్లడించనున్నారు. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో మొత్తం 14 మంది అభ్యర్ధులు రంగంలో ఉన్నప్పటికీ ప్రధాన పోటీ వైసీపీ అభ్యర్ధి మేకపాటి విక్రమ్ రెడ్డి, బీజేపీ అభ్యర్ధి భరత్ కుమార్ యాదవ్ మధ్యనే. ప్రధాన రాజకీయ పక్షాలైన టీడీపీ, జనసేన పోటీలో లేకపోవడంతో వైసీపీ మెజార్టీ అంచనాల్లో ఉంది. వైసీపీ లక్ష మెజార్టీ అంచనా వేసుకుంటుంది. నియోజకవర్గంలో ఎంత శాతం పోలింగ్ నమోదు అయ్యింది. వైసీపీకి మెజార్టీ ఎంత వచ్చే అవకాశం ఉంది. బీజేపీకి ఎన్ని ఓట్లు వస్తాయి అనే విషయాలను ఒక సారి పరిశీలిస్తే…
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Atmakur Bypoll: వైసీపీ గెలుపు నల్లేరుపై నడికే అయినా..
మర్రిపాడు మండలంలో 35వేల ఓట్లకు గానూ 21వేలు ఓట్లు (55 శాతం) పోల్ అయ్యాయి. మర్రిపాడు మండలం వాస్తవానికి వైసీపీకి కంచుకోట. కానీ ఇక్కడ 55 శాతం మాత్రమే పోల్ అయ్యింది. అనంతసాగర మండలంలో 63.6 శాతం పోలింగ్ అయ్యింది. ఆత్మకూరు రూరల్ లో 68.4 శాతం, ఆత్మకూరు మున్సిపాలిటీలో 59 శాతం, ఏఎస్ పేట మండలంలో 62 శాతం, సంగం మండలంలో 67,7 శాతం, చేజర్ల మండలంలో 67.9 శాతం పోలింగ్ అయ్యింది. మొత్తం ఒక లక్షా 37వేల ఓట్లు పోల్ అయ్యాయి. వైసీపీ లక్ష మెజార్టీ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. 8 మంది మంత్రులు, 25 మంది ఎమ్మెల్యేలు ప్రత్యేక దృష్టి పెట్టారు. వాస్తవానికి ఆత్మకూరు నియోజకవర్గంలో వైసీపీ గెలుపు నల్లేరుపై నడికే. అభ్యర్ధి కష్టపడకపోయినా 20 – 30వేల మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉంటాయి. అయితే మెజార్టీ లక్ష్యాన్ని చూపించుకునేందుకు వైసీపీ నేతలు ఓటర్ల ప్రలోభానికి పంపిణీ చేశారన్న వార్తలు వచ్చాయి.
బీజేపీ 18 నుండి 22 వేల ఓట్లు
ప్రధానంగా ఇక్కడ వైసీపీకి పోటీలో ఉన్న బీజేపీ 18 నుండి 22 వేల మధ్య ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వినబడుతున్నాయి. అనూహ్యంగా బీఎస్పీ అభ్యర్ధికి సైలెంట్ ఓటింగ్ పడినట్లు తెలుస్తొంది. ఈ అభ్యర్ధికి 5 నుండి 7వేల వరకూ ఓట్లు వచ్చే అవకాశం ఉంది. ఇక స్వతంత్ర అభ్యర్ధులు అందరికీ కలిసి సుమారు 6 నుండి 8వేల ఓట్లు పోల్ అయ్యే అవకాశం ఉంది. నోటాకు 5వేల వరకూ ఓట్లు వస్తాయి. పోల్ అయిన మొత్తం ఓట్లలో నాన్ వైసీపీకి పడిన ఓట్లు 39 నుండి 45 వేలు వరకూ ఉండవచ్చు. ఈ లెక్కన వైసీపీకి 95వేల నుండి లక్ష వరకూ ఓట్లు వచ్చే అవకాశం ఉంటుంది. బీజేపికి 22 వేలు పోల్ అయితే వైసీపీకి 78వేల మెజార్టీ వరకూ వచ్చే అవకాశం ఉంది. ఒక వేళ బీజేపీకి ఓట్లు తగ్గితే 85వేల వరకూ వైసీపీకి మెజార్టీ వస్తుంది. అంతకు మించి మెజార్టీ వచ్చే అవకాశం ఉండదు అని రాజకీయ విశ్లేషకుల అంచనా.
వాస్తవానికి 75 నుండి 85వేల వరకూ వైసీపీకి మెజార్టీ వచ్చే పరిస్థితి ఉండగా, వివిధ రాజకీయ పక్షాల అంచనాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. వైసీపీ 90 నుండి 95వేల వరకూ మెజార్టీ వస్తుందని అంచనాలు వేసుకుంటుండగా, టీడీపీ, బీజేపీ వాళ్లు మాత్రం 60వేల మెజార్టీకి మించదు అని లెక్కలు వేస్తున్నారు. ఈ నెల 26వ తేదీన అసలు మెజార్టీ లెక్కలు వెల్లడవుతాయి.