Bapatla MP: రాష్ట్రంలో బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గం అత్యంత కీలకమైనది. రెండు ప్రధాన రాజకీయ పక్షాలకు సమాన అవకాశాలు, సమానమైన బలాలు ఉన్న కారణంగా ఇది కీలకమైనదిగా పేర్కొనవచ్చు. ఇక్కడ ప్రస్తుతం వైసీపీ ఎంపిగా నందిగం సురేష్ ఉన్నారు. టీడీపికి ఇన్ చార్జిగా శ్రీరాం మల్యాద్రి ఉన్నప్పటికీ పోటీ చేసే అభ్యర్ధిని మార్చే అవకాశాలు ఉన్నాయి. వైసీపీలోనూ కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి. బాపట్ల పార్లమెంట్ పరిధిలో ఎవరి బలం ఏ విధంగా ఉంది..? వైసీపీకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా..? జగన్మోహనరెడ్డి ప్రత్యేకంగా పరిశీలించాల్సిన అంశాలు ఏమి ఉన్నాయి..? పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీల పరిస్థితి ఏమిటి..? అన్న విషయాలను పరిశీలిస్తే..
బాపట్ల పార్లమెంట్ లో ఇప్పటి వరకూ గెలుపు ఓటములు చూసుకుంటే..కాంగ్రెస్ పార్టీ ఆరు సార్లు, టీడీపీ అయిదు సార్లు గెలిచింది. గత ఎన్నికల్లో వైసీపీ నుండి నందిగం సురేష్ గెలిచారు. టీడీపీ అయిదు సార్లు అంటే 1984లో చిమట సాంబు గెలిచారు. ఈయన యాదవ సామాజికవర్గం. మొదటి సారి టీడీపీ నుండి గెలిచారు. 1991లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు గెలిచారు. 1996లో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, 1999లో దగ్గుబాటి రామానాయుడు, 2014లో శ్రీరాం మాల్యాద్రి గెలిచారు. అయిదు సార్లు ఇక్కడ నుండి గెలుపొందిన టీడీపీ 2019లో కేవలం 16వేల ఓట్ల తేడాతో ఓడిపోయింది. వైసీపీ నుండి నందిగం సురేష్ గెలిచారు. 2014లో శ్రీరాం మాల్యాద్రి 30వేల పైచికులు మెజార్టీతో టీడీపీ తరపున గెలిచారు. 2009లో 69వేల మెజార్టీతో కాంగ్రెస్ నుండి పనబాక లక్ష్మి గెలిచారు.
Bapatla MP: రాజకీయ పెత్తనం వాళ్లదే
ఈ పార్లమెంట్ పరిధిలో సామాజిక వర్గ సమీకరణాలను చూసుకుంటే.. సుమారు 14 నుండి 15 లక్షల మంది ఓటర్లు ఉండగా..బీసీ సామాజికవర్గ ఓట్లు ఎక్కువ. ఈ సామాజికవర్గంలో యాదవ, మత్స్యకార, చేనేత, పద్మశాలి కమ్యూనిటీ ఎక్కువ, అదే విధంగా గౌడ, శెట్టి బలిజ ఓట్లు ఉన్నాయి. ఎస్సీ సామాజికవర్గ ఓట్లు లక్షన్నరకుపైగా ఉంటాయి. కమ్మ సామాజికవర్గం ఓట్లు కూడా అధికంగా ఉంటాయి. ముఖ్యంగా పర్చూరు, అద్దంకి, సంతనూతలపాడు లాంటి నియోజకవర్గాల్లో కమ్మ సామాజికవర్గం ఎక్కువ. అదే విధంగా రెడ్డి, కాపు, ముస్లిం సామాజికవర్గ ఓట్లు కూడా గణనీయంగానే ఉంటాయి. అయితే రాజకీయ పెత్తనం మొత్తం కమ్మ సామాజికవర్గం చేతిలోనే ఉంటుంది.
నాలుగు సిగ్మెంట్ లలో వైసీపీ స్ట్రాంగ్
సంఖ్యాపరంగా బీసీ, ఎస్సీ వర్గం ఎక్కువైనప్పటికీ కమ్మ సామాజికవర్గానిదే రాజకీయ పెత్తనం. ఈ పార్లమెంట్ పరిధిలోని బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ బలంగా ఉంది. రేపల్లెలో టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఉన్నారు. వేమూరులో ప్రస్తుతం వైసీపీ బలంగా ఉంది. ఇక్కడ ఎమ్మెల్యేగా మేరుగ నాగార్జన ఉన్నారు. చీరాలలో వైసీపీ, టీడీపీకి సమాన బలాలు ఉన్నాయి. అద్దంకిలో ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఉన్నారు. పర్చూరులో టీడీపీ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు ఉన్నారు. ఇక సంతనూతలపాడులో వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఉన్నారు. ఇక్కడ టీడీపీ, వైసీపీ బలం సమానంగా ఉంది. బాపట్ల, వేమూరులో వైసీపీ బలంగా ఉంది. ఈ నియోజకవర్గాల్లో చూసుకుంటే టీడీపీ, వైసీపీకి కాస్త పోటీ ఇచ్చే పరిస్థితి ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.
Bapatla MP: వైసీపీకి గట్టి పునాదులు
నందిగం సురేష్ అనూహ్యంగా ఇక్కడ ఎంపి అభ్యర్ధి అయి స్వల్ప మెజార్టీతో గట్టెక్కారు. జగన్మోహనరెడ్డికి అత్యంత సన్నిహితుడుగా ఉన్నారు. అయితే పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీలను సమన్వయం చేసే బలమైన నాయకత్వం లేదని అంటున్నారు. కార్యకర్తల బలం ఉంది. ఎస్సీ, బీసీ, ముస్లిం సామాజికవర్గాల్లో బలమైన కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. ఇది వైసీపీకి పునాదిగా ఉపయోగపడుతోంది. అయితే వైసీపీ నుండి వచ్చే ఎన్నికల నాటికి ఎవరు పోటీ చేస్తారు అనేది క్లారిటీ లేదు. నందిగం సురేష్ నే కొనసాగిస్తారా..? అభ్యర్ధి మారతారా..? అనేది చూడాల్సి ఉంది. నందిగం సురేష్ రాబోయే ఎన్నికల్లో తాడికొండ అసెంబ్లీ స్థానం ఇస్తారని అంతర్గతంగా టాక్ నడుస్తోంది. టీడీపీ విషయానికి వచ్చేసరికి ఇన్ చార్జిగా శ్రీరాం మల్యాద్రి ఉన్నారు. ఆయన 2009లో ఓడిపోయారు. 2014లో గెలిచారు. 2019 లో మళ్లీ ఓడిపోయారు. ప్రస్తుతం ఆయన ఇన్ చార్జిగా ఉన్నప్పటికీ రాబోయే ఎన్నికల్లో ఆయన అసెంబ్లీకి పోటీ చేయాలన్న ఆలోచన ఉన్నట్లు చెబుతున్నారు. తాడికొండ లేదా వేమూరు అసెంబ్లీలో పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారు.