లెక్కలన్నీ చూడు అంకెల్లా ఉండు..!
లోతుకెళ్ళి చూస్తే మజా ఉండు..!
గణితమందు రాజకీయ గణితం వేరయా..!
ఇది బీజేపీ స్కెచ్ రా మామ..!!
ఇది చదవటానికి కామెడీగా అనిపిస్తుంది కానీ, సీరియస్ అంశమే. బీహార్ లో “రాజకీయ గణితం” తెలుసుకోలేదు కాబట్టే ఆర్జేడీ ఓడింది, నితీష్ దెబ్బతిన్నారు, చివరికి ఎగ్జిట్ పోల్స్ కూడా అంచనా వేయలేకపోయాయి. వీటిని బాగా ఒంటపట్టించుకుంది కాబట్టి చక్రం తిప్పింది. అనుకున్నది సాధించింది. ఇవేమిటో, బీహార్ లో ఏం జరిగిందో కాస్త లోతుగా వెళ్లి తెలుసుకుందాం..!!
ఓట్లు.., సీట్లు లెక్క ఇదీ..!!
అందరి కంటే ఎక్కువ ఓట్లు (23 శాతం) వచ్చిన ఆర్జేడీకి 76 సీట్లు వచ్చాయి. బీజేపీకి 19 శాతం ఓట్లు వస్తే సీట్లు మాత్రం 73 వచ్చాయి. ఓట్ల శాతం 4 ఉంటే, సీట్లు తేడా 3 ఉంది. నిజానికి ఈ ఓటింగ్ శాతం అంటే ఆర్జెడీకి కనీసం 88 స్థానాలు రావాలి. కానీ చాలా నియోజకవర్గాల్లో తక్కువ తేడాతో కోల్పోయింది. ఈ పార్టీకి రావాల్సిన ఓట్లు చీలిపోయాయి. ఆ ఫలితమే సీట్లు తగ్గడం. ఆ ఫలితమే ఆర్జెడీకి దెబ్బ పడి, బీజేపీ అనుకున్నది సాధించడం. ఆర్జేడీ కోసం బీజేపీ ఎమ్ఐ ఎమ్ అస్త్రాన్ని వాడింది అంటే నమ్మగలరా..!? ఎంఐఎం కి బీజేపీకి అసలు పడదు కదా..? ఈ పార్టీ బీజేపీకి ఎలా సాయపడింది అనేది తెలుసుకోవాల్సిందే..!
వ్యతిరేక ఓట్లు చీలితే బీజేపీకి లాభమేగా..!!
అయోధ్య రామమందిర నిర్మాణం నేపథ్యంలో బీజేపీకి ముస్లింలు పూర్తిగా దూరమయ్యారు. ఆ ఓట్లు ఆ మందిర భూమి పూజ తర్వాత వచ్చిన మొదటి ఎన్నిక కావడంతో “ముస్లింల ఓట్లు తమకు రావు అని గ్రహించిన బీజేపీ.. మాకు రానివి.., ప్రత్యర్థికి కూడా దక్కకూడదు అనే ప్లాన్ వేసింది. ఇక్కడ బీజేపీని ఓడించాలి అని లక్ష్యంతో దిగిన ఎంఐఎం మహాకూటమితో కలవకుండా సొంతంగా పోటీ చేసింది. ఒకటిన్నర శాతం ఓట్లు వచ్చాయి.., కానీ 5 స్థానాలు గెలిచింది. ఇక్కడే 5 శాతం ఓట్లు వచ్చిన ఎల్జీపి మాత్రం ఒక్క స్థానమే గెలిచింది. ఇదే రాజకీయ గణితం అంటే.
కొన్ని కీలక పాయింట్లు..!!
* ముస్లిం ఓట్లు చీల్చిన ఎంఐఎం బాగా లాభపడింది. ఇదే పార్టీ ఆర్జేడీ నేతృత్వంలోని ఎంజీబీతో జత కట్టి ఉంటే కనీసం మరో పది, పదిహేను స్థానాలు ఆ కూటమికి వచ్చేవి. ఎంఐఎం శత్రువుగా ఉన్న బీజేపీ కి అధికారం కాస్త దూరమయ్యేది. కానీ అలా జరగలేదు. ఇదే లాజిక్కు.
* ఎల్జేపీ దళితుల ఓట్లు చీల్చింది. 28 నియోజకవర్గాల్లో జేడీయూ కి దెబ్బ వేసింది. ఒక్కో నియోజకవర్గంలో సగటున 20 వేలు ఓట్లు చీల్చి జేడీయూని గెలవకుండా చేసింది.
* అంటే ఇక్కడ ఎంఐఎం ద్వారా ఆర్జెడీకి పడాల్సిన ఓట్లని దూరం చేసి.., ఇటు ఎల్జేపీ ద్వారా నితీష్ కి పడాల్సిన ఓట్లని దూరం చేసి.. ఓట్లు – సీట్లు లాజిక్కుల్లో బీజేపీ విజయం సాధించింది. తమకు పాడనీ ఓట్లు ప్రధాన ప్రత్యర్థికి పడకూడదు.. ఏవో చిన్న పార్టీలకు పడాలి అనేది బీజేపీ లక్ష్యం. అది నెరవేరి.., ఎంఐఎం కి బాగా కలిసి వచ్చింది.
* సో.. ఈ పాయింట్లు అన్ని ఎగ్జిట్ పోల్స్ ముందే అంచనా వేయలేవు. ఇవి చీకట్లో జరుగుతాయి. ఎగ్జిట్ పోల్స్ వెలుతురులో మాత్రమే అభిప్రాయం సేకరణ చేస్తాయి. బీజేపీ లాంటి పార్టీలు ఉన్నప్పుడు.., అటువంటి ఆలోచనలు ఉన్నప్పుడు ఇలా ఎగ్జిట్ పోల్స్ చేసినా యూజ్ ఉండదు. సుకుమార్ సినిమాలాగా ముందే ఊహించి రెమెడీ ఆలోచించుకుని, సిద్ధం చేయాలి. అది సినిమాల్లో సాధ్యం అవుతుంది. రియాలిటీలో బీజేపీకి ఎదురొడ్డే, రెమెడీగా అడుగులు వేసే పార్టీ లేదు. అందుకే బీజేపీ గాలి అంతగా ఉంది..!