తెలుగు ప్రజలు ఎంత అదృష్టవంతులో..! అన్ని రంగులూ వారికి న్యూస్ ఛానెళ్ళలోనే కనిపిస్తున్నాయి. పచ్చ, బ్లూ, పింకు, ఎరుపు.. ఇక కాషాయ రంగు కూడా రానుంది. ఏ ఛానెల్ రంగు ఏమిటో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. మిడి మిడి లోకం తెలుసుకుంటున్న పిల్లలు కూడా ఏ ఛానెల్ ఎవరి తొత్తో ఇట్టే చెప్పేస్తారు. అయితే ఏ మాటకామాటే చెప్పుకోవాలి. ఈ ఛానెళ్ల రంగుల పోటీలో బీజేపీ వెనుకబడింది. ఆలస్యంగా గుర్తించింది. అందుకే ఇక వేట మొదలు పెట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కనీసం మూడు చానెళ్లు ఉండేలా చర్యలు ఆరంభించింది. అప్పుడే అడుగు కూడా వేసేసింది..!
రాజ్ న్యూస్ షురూ… రవి ప్రకాష్ గురు..!!
“న్యూస్ ఆర్బిట్” ఇది వరకే చెప్పినట్టు రాజ్ న్యూస్ బీజేపీ మయం అయిపోయింది. రవిప్రకాష్ ని తీసుకుని, కీలక బాధ్యతలు కట్టబెట్టి న్యూస్ మొత్తం ఆయనకే అప్పగించింది. చైర్మన్ ఎవరో తామిలాయన ఉంటారు. సీఈఓగా ఎవరో లింగారెడ్డి ఉంటారు. ఈ రెండు పోస్టులు తప్ప ఇన్పుట్, అవుట్ ఫుట్, న్యూస్ ఎడిటర్ వంటి కీలక పోస్టులన్నీ రవి ప్రకాష్ బ్యాచ్ కె అప్పగించింది. అందుకే టీవీ 9 , తొలివెలుగు, మోజో టీవీల్లో తనతో కలిసి నడిచిన రఘు, రేవతి వంటి వారికి రవి ప్రకాష్ రాజ్ న్యూస్ లో నీడనిచ్చారు.
ఆల్రెడీ ఆ ఛానెల్ కేసీఆర్ పై యుద్ధం కూడా మొదలెట్టేసింది. కేసీఆర్ తప్పులను కెలుకుతూ రెండు స్టోరీలను వేసింది. ప్రమోలు చాలా ఘాటుగా రవిప్రకాష్ స్టైల్ లో ఉన్నాయి. అవి బాగానే పేలాయి. కానీ రాజ్ న్యూస్ అనే పేరు జనాలకు చేరడమే చాల రోజులు పడుతుంది. ఆ పై కేసీఆర్ కి వ్యతిరేకంగా వెళ్లడం.., ఎమ్మెర్వోలను మేనేజ్ చేయడం, కేబుల్ ఆపరేటర్లను మేనేజ్ చేయడం పెద్ద తతంగమే. చూద్దాం.. రవి ప్రకాష్ సారధ్యంలో రాజ్ న్యూస్ ఏం సాధిస్తుందో..!? ఇక మరో రెండు చానెళ్లను కూడా బీజేపీ తీసుకోబోతుంది.
ఒకటి చాలదుగా… ఇంకో రెండు..!!
టీడీపీకి ఈటీవి, ఏబీఎన్, టీవీ 5 ఉన్నాయి. వైసీపీకి సాక్షి, అప్పుడప్పుడూ ఎన్ టీవీ, టీవీ 9 అండగా ఉంటాయి. జనసేనకు 99 టీవీ, ప్రైమ్ 9 న్యూస్ ఉన్నాయి. బీజేపీకి రాజ్ న్యూస్ ఒక్కటే చాలదుగా. అందుకే ఇప్పుడు రంగు వేసుకోవడానికి కొన్ని చానెళ్లు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఐ న్యూస్, హెచ్ ఎమ్ టీవీ వంటి పేరొందిన చానెళ్లు ఉన్నాయి. వాటిని కూడా బీజేపీ తీసుకోవాలనే ఆలోచన ఉందట. ఇప్పుడున్న పరిస్థితులు, పోటీ ప్రపంచంలో ఒక ఛానెల్ ఉంటె పెద్దగా పట్టించుకోరు కాబట్టి… వెంటనే రెండు, మూడు చానెళ్లకు కాషాయ రంగు పూసెయ్యాలని బీజేపీ గట్టిగా భావిస్తుంది. అందుకే మరో నెల రోజుల్లో వాటినీ తేల్చేయనుంది. మొదట దశలో తెలంగాణాలో కేసీఆర్ పై.., ఇక రెండో దశలో ఏపీలో జాగ్రత్తగా న్యూస్ ప్రచారం మొదలు పెట్టనుంది. రాజ్ న్యూస్ అంటే కేసీఆర్ బాధితుడు.., కాద్ధ విధిగా ఉన్న రవి ప్రకాష్ ని పెట్టారు. మరి ఈ చానెళ్లకు ఎవర్ని పెడతారబ్బా..!? ఇప్పటికిప్పుడు కేసీఆర్ తో గోక్కొని, తాడోపేడో తేల్చేసుకుంటాం అనుకునే కసి జర్నలిస్టు బీజేపీకి ఎవరు దొరుకుతారు..!??