గ్రేటర్ ఫలితం తేలింది. బీజేపీ అనూహ్యంగా లేచింది. మేయర్ కుర్చీ ముంగిట కారు బోర్లా పడింది. ఎంఐఎం కి కింగ్ మేకర్ పేరు దక్కింది..! ఇక్కడ ఎవరి వ్యూహం ఫలించినట్టు..? ఎవరి ప్లాన్ బెడిసికొట్టినట్టు..? ఎవరు ఏమనుకున్నా… ఈ ఫలితం వెనుక చంద్రబాబు సుదీర్ఘ ప్లాన్ మాత్రం వర్కవుట్ అయినట్టే కనిపిస్తుంది. ఇది ఏపీకి, సీఎం జగన్ కి సంకేతం లాగానే అనిపిస్తుంది. బీజేపీ చెవిలో టీడీపీ మంత్రం వినిపిస్తుంది..! అదేమిటో లోతుగా చూద్దాం పదండి..!!
ముందుగా ఈ ఫలితాలు, లెక్కలు చుడండి..!!
* గత గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ గెలిచినా స్థానం కేవమా ఒక్కటే. కానీ ఓ విషయం తెలుసా.., ఆ ఎన్నికల్లో ఓట్లు సాధించడంలో టీడీపీ మూడో స్థానంలో నిలిచింది. అంటే మొత్తం మీద 439047 (13 .11 శాతం) ఓట్లు వచ్చాయి. 530812 ( 15 .85 శాతం) ఓట్లు వచ్చిన ఎంఐఎం 42 డివిజన్లు గెలుచుకుంటే.. వారి కంటే కేవలం ఒకటిన్నర శాతం మాత్రం ఓట్లు తక్కువున్న టీడీపీకి ఒక్కటంటే ఒక్కటే స్థానం వచ్చింది. చాలా డివిజన్లలో టీడీపీ రెండో స్థానంలో నిలిచింది.
* అంటే అదే బలం ఇప్పటికీ ఉంటుంది. టీడీపీ అంటే అభిమానం, ఆప్యాయత ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ ఓట్లు వృథా కాకూడదు. ఈ ఓట్లు పడినా టీడీపీ డివిజన్లు గెలవదు. అందుకే ఈ సారి చంద్రబాబు ఒక వ్యూహం వర్కవుట్ చేశారు.
* నాటి ఎన్నికల్లో టీడీపీ రెండో స్థానంలో నిలిచిన (అంటే 30 శాతం కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న చాలా డివిజన్లలో ఇప్పుడు బీజేపీ గెలిచింది. ఉదాహరణ నల్లకుంట, నాగోల్, సరూర్ నగర్, మూసారాం భాగ్, మల్కాజ్ గిరి, మోండా మార్కెట్, అత్తాపూర్, మున్సూరాబాద్… ఇలా సుమారుగా 20 డివిజన్లలో నాడు టీడీపీ రెండో స్థానంలో ఉంటె.. ఈ 20 లో 16 ఇప్పుడు బీజేపీ గెలుచుకుంది. సో… టీడీపీ ఓట్లు బీజేపీకి మళ్లినట్టు స్పష్టంగా అర్ధమవుతుంది. ఇదేదో యాదృచ్చికంగా జరిగింది కాదు. కమ్మ సామాజికవర్గం ప్రాతినిధ్యం ఎక్కువగా ఉన్న డివిజన్లలో కూడా బీజేపీ జెండా ఎగరేసింది.
ఇప్పుడు అసలు విషయానికి వద్దాం..!!
2018 తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు బాగా దూరారు. కేసీఆర్ ని కెలికారు. టీఆరెస్ ని గట్టిగా గోకారు. ఈ ప్రతీకారం కాస్తా 2019 లో టీఆరెస్ వడ్డీతో సహా ఇచ్చేసారు కేసీఆర్. మరి చంద్రబాబు ఊరుకుంటే ఆ 45 ఏళ్ళ ఇండస్ట్రీ ఏం కావాలి..? కమ్మ బ్యాచ్ ఊరుకుంటే వారి పెత్తనం ఏం కావాలి..? అందుకే ఈ సారి అప్పటిలా కాకుండా.. సైలెంట్ గా తన చాణక్యత చూపించారు. కేసీఆర్ కి దెబ్బ వేశారు. ఆ వడ్డీ, ఈ వడ్డీ కలిపి ఇచ్చేసారు. హైదరాబాద్ లో టీడీపీని, తన అనుకూల వర్గాన్ని బీజేపీకి మళ్లించడం ద్వారా బీజేపీతో స్నేహం కోసం కొంత బాసట వేసుకున్నారు. బీజేపీ గెలుపు వెనుక ఆ పార్టీ శ్రమ, తీవ్ర ప్రచారంతో పాటూ.. చంద్రబాబు పరోక్ష మద్దతు ఉందని పై లెక్కల ద్వారా స్పష్టంగా తెలుస్తుంది.
* ఇది ఇక్కడితో ఆగదు. ఏపీలో జగన్ కి తగులుతుంది. బీజేపీ తో దోస్తీకి చంద్రబాబు వేదిక, సమయం, సందర్భం చూసుకుంటున్నారు. గ్రేటర్ లో తన బలం, బలగం బీజేపీకి ఇవ్వడం ద్వారా చంద్రబాబు ఏపీలో ఏదో ఒకటి కచ్చితంగా ఆశిస్తారు. అదే జరిగితే ఏపీలో డేంజర్ బెల్స్ మోగినట్టే..!! అందుకే జగనూ జరభద్రం..!!
(ఇక కేసీఆర్ పై మూడు వర్గాలు కలిపి చేసిన ముప్పేట దాడి.. గ్రేటర్ లో సామాజికవర్గాల వ్యూహాలు ఎలా ఫలించాయి..? కేటీఆర్ భవితవ్యంపై కొన్ని ఆసక్తికర విశ్లేషణలు “న్యూస్ ఆర్బిట్”లో రేపు చూద్దాం..!)