Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నాయకత్వం మీద, ఆయన పరిపాలన మీద ఎవరికీ అనుమానం లేవు. పరిపాలనా దక్షత, ముందుచూపు , పట్టుదల, ప్రాజెక్టులు తీసుకురావడంలో, కష్టపడి పని చేసే విషయంలో ఎవరికి ఎటువంటి సందేహాలు లేవు. ఆయన సీఎం సీటులో కూర్చుంటే మంచి అడ్మినిస్ట్రేటర్ గానే పేరు సంపాదించుకున్నారు. కానీ చంద్రబాబు ఒక నాయకుడుగా మాత్రం చాలా ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్నారు. ముఖ్యంగా పరిపాలన విషయంలో గానీ నాయకత్వం విషయంలో గానీ హామీలు ఇచ్చి విస్మరిస్తారు అన్న చెడ్డపేరు ఆయనపై ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియా యాక్టివ్ గా ఉన్న ఈ సమయంలో కూడా హామీలు ఇచ్చి విస్మరిస్తే యూత్ ఓటర్లు, పట్టణ, గ్రామీణ ప్రాంత ఓటర్లు ట్రోల్ చేసి పడేస్తారు. ఆడుకుంటారు. ఇప్పుడు జగన్మోహనరెడ్డిని హామీలను విస్మరించడం వల్ల ట్రోల్ చేస్తున్నారు. మూడు వేల పెన్షన్ ఇస్తామన్నారు. రూ2500లే ఇస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత విడతల వారీగా అన్నారు. అలానే మెగా డీఎస్సీ అన్నారు. అధికారంలోకి వచ్చిన నోటిఫికేషన్ ఇవ్వలేదు. సీపిఎస్ రద్దు చేస్తామన్నారు. ఇప్పుడు సీపీఎస్ రద్దు విషయం అవగాహన లేమితో హామీ ఇచ్చామంటున్నారు. వైసీపీ విషయాన్ని పక్కన బెడితే.. చంద్రబాబు పార్టీ విషయంలో ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చే పరిస్థితి లేదు. అందుకే చంద్రబాబు మాటలను చాలా మంది నమ్మడం లేదు.
Read More: TDP Janasena: టీడీపీకి డేంజర్ డేస్ ..!? అభద్రత, ఆందోళనలో క్యాడర్..!
Chandrababu: 40 శాతం సీట్లు యువతకు హామీ
ఇటీవల తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సభలో 40 శాతం సీట్లు యువతకు ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే అవి ఏ రకంగా ఇస్తారు అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి చంద్రబాబు చెప్పినట్లు 40 శాతం సీట్లు తెలుగుదేశం పార్టీలో యువతకు ఇవ్వడం అసాధ్యమం అని చెప్పవచ్చు. 40 స్థానాలు అంటే రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో 68 నుండి 70 స్థానాలు యువతకు ఇవ్వాలి. యువత అంటే వాస్తవానికి 18 ఏళ్ల నుండి 35 సంవత్సరాలు. కానీ రాజకీయంగా చూసుకుంటే 18 నుండి 40 ఏళ్ల వయసు వరకు అనుకోవచ్చు. జిల్లాల వారీగా చూసుకున్నా 40 శాతం సీట్లు ఇవ్వడం సాధ్యపడదు. చంద్రబాబు యువతకు ఏదో హామీ ఇవ్వాలి కాబట్టి ఇచ్చినట్లు కనబడుతోంది. సాధ్యాఅసాధ్యాలు చంద్రబాబు ఏమైనా ఆలోచించారా ..?
జిల్లాల వారిగా ఉదాహరణలు
జిల్లాల వారిగా ఉదాహరణలు తీసుకుంటే.. శ్రీకాకుళం జిల్లాలో పది నియోజకవర్గాలు ఉంటే బెందాళం అశోక్, గౌరు శిరీష 40 ఏళ్ల పైబడి 45 ఏళ్ల లోపు ఉంటారు. మిగిలిన ఇన్ చార్జిలు అందరూ 50 ఏళ్ల పైబడిన వారే. ఈ జిల్లాలో 40 శాతం అంటే నాలుగు స్థానాలు ఇవ్వాలి. కానీ ఈ జిల్లాలో ఆ పరిస్థితి కనబడటం లేదు. విజయనగరం జిల్లాలో 9 అసెంబ్లీ స్థానాలు ఉండగా సుమారు ముగ్గురు లేదా నలుగురికి ఇవ్వాలి. ఈ జిల్లాలో అడిది గజపతిరాజు, బేబీ నాయన, కమిడి నాగార్జున లు సుమారు 40 సంవత్సరాల వయసులో ఉన్నారు. విశాఖపట్నం జిల్లా చూసుకున్నట్లయితే 16 నియోజకవర్గాలు ఉన్నాయి. 40 శాతం అంటే ఆరు లేదా ఏడు సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. చింతలపూడి విజయ్, వంగలపూడి అనిత, కిడారి శ్రావణ్ కుమార్ మాత్రమే సుమారు 40 ఏళ్ల వయసు వారు ఉన్నారు. అయితే వీరిలో కిడారి శ్రావణ్ కుమార్ సీటు ఇచ్చే అవకాశం లేదు. అరకు నియోజకవర్గంలో కిడారి శ్రావణ్ కుమార్ కు కాకుండా దొన్ను దొరకు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. ఈయన వయసు 50 ఏళ్లకు పైబడి ఉంటాయి. తరువాత తూర్పు గోదావరి జిల్లాలో 19 స్థానాలు ఉండగా, ఏడు లేదా 8 స్థానాలు యువతకు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ జిల్లాలో ఆదిరెడ్డి భవానీ, యనమల కుటుంబం నుండి రాజేష్ గానీ దివ్య, మాగంటి మురళీ మోహన్ కుమార్తె రూప, జ్యోతుల నెహ్రూ కుమారుడు నవీన్ ఇలా నలుగురు మాత్రమే 40 ఏళ్ల వయసు వారు కనబడుతున్నారు. మరో నలుగురిని టీడీపీ ఎక్కడి నుండి తీసుకువస్తుంది.
ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో చూసుకున్నట్లయితే 40 ఏళ్ల లోపు ఎవరూ లేరు. ఆ జిల్లాలో 15 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ఉండి ఎమ్మెల్యే రామరాజు వయసు 46, ఆ తరువాత తణుకు మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ వయసు 48 ఉన్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో ఇన్ చార్జిలు అందరూ 50 ఏళ్ల పైబడిన వారే. ఇక కృష్ణాజిల్లాలో 16 అసెంబ్లీ స్థానాలు ఉండగా..తంగిరాల సౌమ్య, కుమార్ రాజా, కేశినేని శ్వేత, జలీల్ ఖాన్ కుమార్తె షబానా, కాగిత కృష్ణప్రసాద్ లు ఉన్నారు. ఆ తరువాత గుంటూరు జిల్లాలో 17 స్థానాలు ఉండగా, ఏడుగురు యువతకు సీట్లు ఇవ్వాలి. కానీ ఇక్కడ ఉంది కోడెల శివరామ్, నారా లోకేష్, రాయపాటి రంగారావు లేదా రాయపాటి శైలజ గానీ ముగ్గురు ఉన్నారు. ప్రకాశం జిల్లాలో 12 స్థానాలు ఉండగా నాలుగు లేదా అయిదు స్థానాలు యువతకు ఇవ్వాలి. కానీ ఇంటూరి నాగేశ్వరరావు మినహా ఎవరూ కనబడటం లేదు. నాగేశ్వరరావు కూడా 40 ఏళ్ల పైబడే ఉంటారు.
Chandrababu: 70 మందికి గానూ 28 మంది మాత్రమే
నెల్లూరు జిల్లాలో 10 స్థానాలు ఉన్నాయి. ఈ జిల్లాలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నారాయణ కుటుంబం నుండి ఇద్దరు కనబడుతున్నారు. రాయలసీమ నాలుగు జిల్లాల్లో 52 స్థానాలు ఉండగా, 40 శాతం అంటే 20 లేదా 21 మంది యువతకు టికెట్లు ఇవ్వాలి. కానీ ఈ జిల్లాల్లో కనబడుతోంది జేసి కుటుంబం నుండి ఒకరు, భూమా కుటుంబం నుండి ఇద్దరు భూమా అఖిలప్రియ, భూమా బ్రహ్మానందరెడ్డి, పరిటాల శ్రీరామ్, భూపేష్ రెడ్డి, గాలి భాను ప్రకాష్, బొజ్జల సుధీర్ లు ఉన్నారు. ఈ నాలుగు జిల్లాల్లో 20 మందికి ఏడుగురు మాత్రమే కనబడుతున్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 70 మందికి గానూ 28 మంది మాత్రమే యువత ఉన్నారు. వీరిలో 24 మంది వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన వారే. తెలుగుదేశంలో పరిస్థితి ఈ విధంగా ఉంటే చంద్రబాబు ఏ ఉద్దేశంతో 40 శాతం యువతకు టికెట్లు అని ఎలా చెప్పారు. యువత అంటే వారసులను ప్రోత్సహించడమేనా.. అలా చూసుకున్నా 24 మందే ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో 40 శాతం సీట్లు అనేది చంద్రబాబు ఇచ్చిన ఉత్తుత్తి హామీ గానే మిగిలిపోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.