సీఎం జగన్ ప్లాన్ మార్చారు…! పాత వ్యూహాన్ని వీడి, కొత్త వ్యూహాన్ని సిద్ధం చేసారు. ఒకరకంగా ఓపిక అనే పాఠం నేర్చుకున్నారు. నిపుణుల సలహాలు విన్నారో, తనే ఆలోచన చేశారో, ఓపిక నేర్చుకున్నారో… కారణం ఏదైనా కావచ్చు శాసనమండలి విషయంలో జగన్ కొత్త పంథా ఎంచుకున్నారు. “రద్దు వద్దు… ఓపిక ముద్దు” అనే ధోరణిలోకి మారారు. దానికి కారణాలు ఏంటి..? జగన్ కొత్త వ్యూహాలు ఏంటి? అనేది ఆసక్తికరంగా మారాయి.
రద్దు ఆలోచన వచ్చింది ఇలా…!
మండలిలో ప్రస్తుతం వైసిపి బలం 12 (కొత్తగా చేరిన వారితో కలుపుకుని)… టిడిపి బలం 25 (పార్టీ మారిన వారిని వదిలేస్తే). అందుకే ఏ బిల్లు అయినా టిడిపి మాట ప్రకారమే జరుగుతుంది. వారి వాదన నెగ్గుతుంది. అధికార పక్షం ఎంతగా వ్యూహాలు పన్నినా, వలలు వేసినా రాజధాని వికేంద్రీకరణ బిల్లు మండలిలో చర్చకు రాలేదు. టిడిపి అనుకున్నట్టు సెలెక్ట్ కమిటీకి వెళ్ళింది. అక్కడ జగన్ కి బాగా మండి మండలిలో మనకు బలం లేదు, రద్దు చేసేద్దాం అని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా “మాకు మండలి వద్దు” అంటూ శాసనసభలో తీర్మానం చేసేసి కేంద్రానికి పంపించేశారు. అక్కడ కేంద్రం పరిశీలించి, పార్లమెంటులో చర్చకు పెట్టి, ఆమోదించి, రాజ్యసభ ఆమోదించిన తర్వాత రాష్ట్రపతికి పంపిస్తే ఆయన ఆమోదిస్తే మండలి రద్దు అయినట్టు నోటిఫికేషన్ వస్తుంది. దీనికి ఏడాది పైగా సమయం పడుతుంది. ప్రస్తుతం ఆరు నెలలు గడిచింది, ఆ బిల్లు కేంద్రం పరిశీలనలోనే ఉంది.
జగన్ కొత్త వ్యూహం ఏమిటంటే…!
మండలి రద్దు వద్దు అని జగన్ అనుకుంటున్నారట. రద్దు చేసే కంటే ఓపిక పట్టడమే మంచిది అనే ధోరణికి వచ్చారట. అందుకే మండలికి ప్రాధాన్యత ఇస్తూ మంత్రులను అక్కడికి పంపిస్తూ బిల్లులను కూడా పంపిస్తున్నారు. దీనికి కొన్ని కారణాలున్నాయి. * మండలి రద్దు చేయాలంటూ తీర్మానం చేసి కేంద్రానికి పంపించి ఆరు నెలలు గడిచింది. ఇప్పటికీ బిజెపి దీన్ని పట్టించుకోలేదు. * ఎలాగూ ఆరు నెలలు గడిచింది. ఇంకో ఏడాది ఓపిక పడితే మండలిలో తమకు బలం పెరుగుతుంది. * మండలిలో ఇక రాబోయే కొత్త సభ్యులు ఎవరైనా వైసిపి వారే ఉంటారు. సరిగ్గా ఏడాదిన్నరలో మండలిలో కాకలు తిరిగిన టిడిపి వాళ్ళు యనమల, ,లోకేష్ వంటి వారు మాయమవుతారు. వారి పదవి కలం పోతుంది. టిడిపికి ఉన్న బలం దృష్ట్యా ఉన్న వాళ్ళ పదవీ కలం ముగిస్తే కొత్తగా నాలుగు స్థానాలే వస్తాయి. * అంటే 2021 డిసెంబర్ నాటికి మండలిలో వైసిపి బలం 35 కి చేరుతుంది, టిడిపి బలం 8 కి పడిపోతుంది. సో… ఓపిక నేర్చుకున్న జగన్ అదే బాట పట్టారు. * ఒకవేళ టిడిపి నుండి ఎవరైనా ఎమ్మెల్సీలు తమ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉంటె ఒకరు, ఇద్దరు కాకుండా ఒకేసారి ఏడుగురిని లాగేయాలనేది మరో వ్యూహం. సో… మండలి విషయంలో పిలక ని తీసుకెళ్లి కేంద్రానికి ఇచ్చే కంటే తామే ఓపిక పడదాం అనే పాఠం నేర్చుకుని జగన్ ఇలా ఆలోచిస్తున్నారు.