Corona Deaths: “ఒరేయ్ మనిషీ.. నిన్నేరా..! మనిషి – మరమనిషి – మహర్షి నువ్వు కానిది ఏంటి..!? నువ్వు తాకనిది ఏది..!? నువ్వు గెలవనిది ఏముంది..? నువ్వు అందుకోనిది ఎక్కడుంది..!? ఒక్క కరోనా తప్ప…! ఈ ఒక్క మహమ్మారి తప్ప నువ్వు అన్నీ గెలిచేసావు. కానీ ఇప్పుడు చూసావా..? నువ్వు గెలిచినవే ఇప్పుడు నిన్ను చూసి గేలి చేస్తున్నాయి. నీకు గాలి దొరకడం లేదు. నీరు కాపాడడం లేదు. భూమి మోయడం లేదు. చివరికి చితి కూడా కాలడం లేదు..!”
పుట్టుక – చావు మనిషి ధర్మాలు. ఆపలేవు. ఆగలేవు. ఇవి ప్రాకృతిక నియమాలు. నువ్వు ఎంత బతుకు బతికినా చివరికి ఆ చితికి చేరాల్సిందే. అక్కడ ఆ కట్టె కాలాల్సిందే. ఆ చోట నీ మసి కావాల్సిందే. నువ్వు మట్టిలో కలవాల్సిందే..! కానీ ఒక్కటి ఆలోచించావా..!? ఈ కరోనా రాసిన కాఠిన్యంలో నీకు చివరికి ఆ చితి కూడా భారమవుతుంది. అక్కడ కట్టె కాలడం లేదు. అక్కడ చితికి కట్టె దొరకడం లేదు. కట్టె కూడా నీపై పగబట్టిందేమో..!!
Corona Deaths: గాలే కాదోయ్ కట్టె దొరకడం లేదట..!?
దేశంలో నిన్నటి వరకు నీకు గాలి దొరకడం లేదు అనేది ఒక వార్త. కానీ ఇప్పుడు పోయిన ప్రాణాలు కాల్చడానికి కట్టె దొరకడం లేదు అనేది తాజా వార్త. గాలి దొరకడం లేదు. ఆక్సిజన్ అందడం లేదు. ఏదోలా చేసి ప్రాణవాయువుతో ప్రాణాలు నిలబెట్టుకోవాలని చూసిన సగటు మనిషికి.. ఇప్పుడు కన్ను మూసాక కట్టె కూడా కరుణించడం లేదు. దేశం మొత్తం మీద కరోనా మృతులను కాల్చడానికి కట్టెలు దొరకడం లేదు. కొరత వచ్చింది. మూడు రోజుల నుండి ఈ పరిస్థితి ఉంది. దహన సంస్కారాలకు కట్టెలు దొరకడం లేదు. పచ్చి కట్టెలు కోసం చెట్లు నరికేస్తున్నారు. కానీ అవీ కాలడం లేదు. చూసావా..!? మనిషికి చితికి కూడా ఎన్ని కష్టాలొచ్చాయో..!?
నీ తోటి మనుషులే చూడు..!!
దేశంలో రోజుకి 500 లేదా 600 సహజ మరణాలు ఉండేవి. ప్రమాదాలు, హత్యలు, ఆత్మహత్యలు పక్కన పెట్టేస్తే.. సహజ మరణాలు అంతే.. కానీ ఇప్పుడో…? ఢిల్లీలో నిన్న ఒక్కరోజే 350 మంది మరణించారు. హైదరాబాద్ లో పూర్తిగా లెక్కలు చెప్పడం లేదు కానీ… 120 మంది వరకు మరణించారు. ఏపీలో రోజుకి సగటున 100 మంది మరణిస్తున్నారు. దేశం మొత్తం మీద రోజుకి 5 వేల చావులు వస్తున్నాయి.. ఇవన్నీ కరోనా కాఠిన్యతతో వస్తున్న చావులే. ఓ మనిషీ చూసావా..!? ఒకప్పుడు రోజుకి 500 , 600 మరణాలు మాత్రమే నమోదయ్యే చోట… ఇప్పుడు కేవలం కరోనా కారణంగానే రోజుకి 5 వేల మరణాలు అంటే మాటలు కాదు..! అందుకే కట్టెలు దొరకడం లేదు. పచ్చిగా ఉన్న కట్టెలు ఏవో ఒకటి అని తీసుకొస్తున్నా కట్టెలు కాలడం లేదు. చివరికి మనిషికి చితి కూడా భారంగా మారినట్టుంది..!