Corona Lockdown: 13 నెలల కిందట దేశం మొదటి సారిగా కరోనా (Corona Virus) భయాన్ని చవి చూసింది. గత ఏడాది మార్చిలో కరోనా పేరు వణికించి.. దేశం మొత్తం లాక్ డౌన్ (Corona Lockdown)కి దారితీసింది. కానీ ఇప్పుడు దేశంలో రోజుకి రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నా ఎక్కడా లాక్ డౌన్ మాటే వినిపించడం లేదు. మహారాష్ట్రలో రోజుకి 70 వేలు వస్తున్నా సోయి లేదు.. పంజాబ్ లో రోజుకి అరలక్ష వస్తున్నా లాక్ డౌన్ మాటే లేదు.. అప్పుడెప్పుడో దీపాలు వెలిగించి.. కంచాలు బాదేసి.. గో గో కరోనా గో పాట పాడమన్న మోడీ గారేమయ్యారో తెలీదు.. కరోనా తాండవం ఇలాగే కొనసాగితే.. లాక్ డౌన్ లేకపోతే దేశం ఏమవుద్దో ఊహించగలమా..!?
Corona Lockdown: పది లక్షలకు చేరుకుంటే ఊహించగలమా..!?
గత ఏడాది దేశం మొత్తంమీద రోజుకి పది కేసులు వస్తున్న దశలో లాక్ డౌన్ విధించారు. రోజుకి 1000 కేసులు వస్తున్న దశలో లాక్ డౌన్ తీసేసారు. ఆ పై కరోనా విజృంభించింది. రోజుకి 6 వేలు, 25 వేలు.., 50 వేలు.. అలా అలా… గత ఏడాది సెప్టెంబర్ సమయానికి రోజుకి 90 వేల కేసుల వరకు చేరుకుంది. ఆ తర్వాత నెమ్మదిగా తగ్గుముఖం పట్టింది. ఇప్పుడు మళ్ళీ మొదలయింది. రోజుకి లక్ష నుండి మొదలై… ప్రస్తుతానికి రోజుకి రెండు లక్షల ఎనభై వేల కేసుల వరకు చేరుకుంది. అంటే ఇదే అత్యధికం. రోజు రోజుకి దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది. మూడు రేపో, ఎల్లుండో మూడు లక్షలు వస్తాయి. ఆపై అయిదు లక్షలు కష్టం కాదు. ఆపై పది లక్షలకు చేరుకుంటే దేశంలో ఎక్కడా ఆసుపత్రులు, పరుపులు, రోడ్లు కూడా ఖాళీ ఉండవు. అప్పుడు దేశం పరిస్థితి ఏమిటి..!? ఒకవేళ రోజుకి పది లక్షల కేసులు నమోదైతే దేశంలో కరోనా కరాళనృత్యాన్ని ఎవరైనా ఆపగలరా..!? ఆ దారుణ స్థితిని ఊహించగలమా..!?
లాక్ డౌన్ ఇప్పుడు ఎందుకు పెట్టరు..!?
కరోనా కేసులు పెరుగుదల అలా ఉంది. రెండో దశలో లక్షణాలు ఘోరంగా ఉంటున్నాయి. కొత్త కొత్త ప్రమాదాలు ముంచుకొస్తున్నాయి. త్వరగా తగ్గడం లేదు. మరణాల రేటు పెరుగుతుంది. గాలి ద్వారా కూడా సోకుతుంది అని చెప్తున్నారు. మరి ఇప్పుడు పరిష్కారం ఏమిటి..!? కరోనాని నియంత్రించడం ఎలా..!? లాక్ డౌన్ పెడితే ప్రయోజనం ఉండదా..!? అంటే ఉంటుంది. కచ్చితంగా ఉంటుంది. ఒక నెల రోజుల పాటూ లాక్ డౌన్ పూర్తిగా విధిస్తే.. కరోనా పేషేంట్లను నయమయ్యే వరకు ఆసుపత్రులకు పరిమితం చేస్తే.. మొదటి 14 రోజులు.. కొత్త కేసులు.. వాటి ద్వారా ట్రేస్ అయిన రెండో 14 రోజులు మరిన్ని కేసులు బయటపడతాయి.. ఆ పై లాక్ డౌన్ ఉంటుంది కాబట్టి కొత్తగా మళ్ళీ లక్షల్లో వచ్చే అవకాశం అయితే ఉండదు. సో.. ఈ స్థితి నుండి బయటపడాలి అంటే లాక్ డౌన్ ఒక్కటే మార్గం. జనాలని బయట తిరగకుండా నియంత్రించడం ఒక్కటే మార్గం..!
మరి మార్కెట్..? ఆర్ధికం..!?
ఎస్… లాక్ డౌన్ విధించడానికి వేరే సమస్యలేమీ లేవు. అప్పటిలా మార్కెట్ పడిపోతుంది. ఆర్థికరంగం దెబ్బ తింటుంది. నాడు సుమారుగా దేశం రూ. రెండున్నర లక్షల కోట్ల ఆదాయం కోల్పోయినట్టు.. ఇప్పుడు కూడా భారీగానే కోల్పోతుంది. గత ఏడాది కరోనా లాక్ డౌన్ ఇబ్బందుల నుండి మార్కెట్లు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. కొనుగోళ్లు పెరుగుతున్నాయి. అన్నీ స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ లాక్ డౌన్ అంటే మళ్ళీ వెనక్కు వెళ్ళాలి. దేశానికి పెద్ద దెబ్బ తగులుతుంది. పేదలకు ఆకలి చావులు పెరుగుతాయి. ఎన్ని లక్షల కోట్ల ప్యాకేజీలు ఇచ్చినా పేదలకు అందవు. అందుకే … “దేశ ఆర్థికరంగం దెబ్బతింటే దేశానికి, కేంద్రానికి బాధ్యత ఉంటుంది.. కానీ నీకు కరోనా వస్తే నీకే బాధ్యత ఉంటుంది.” సో.. దేశం బాధ కంటే.., కేంద్రం బాధ కంటే నీ బాధ నువ్వు పడు అనే ఏకైక ఉద్దేశంతో మోడీ వర్యులు ఈ సారి కంచాలు మోగించామని.. దీపాలు వెలిగించమని… లచ్చ కోట్ల ప్యాకేజీలను చెప్పడం లేదు..! ఈ బాధలన్నీ ఎందుకులే అనుకుని… జనాలూ మీరు ఎవరికి వారు జాగ్రత్తగా ఉండండి అని ప్రభుత్వం చేతులెత్తేసింది..! ఇప్పుడు ఒకటే పరిష్కారం.. ఎవరికీ వారు స్వతహాగా లాక్ డౌన్ ప్రకటించుకోవడమే..!!