Eenadu ; “ఈనాడు” దిన పత్రికకు తిరుగులేదు. ప్రజాదరణ తగ్గలేదు. ఇప్పటికీ నంబర్ వన్ గానే ఉంది. తెలుగు మీడియాని శాసిస్తుంది..! ఇవన్నీ నిజాలే. కానీ వీటిని చూసుకుని….
కానీ “ఈనాడు”కి పాఠకాదరణ తగ్గింది. సర్క్యులేషన్ సగానికి పడిపోయింది. సిబ్బంది కత్తిరింపు ఏనాడో మొదలయింది. పది నెలలుగా లే ఆఫ్ లు అమలవుతున్నాయి. ఆ అక్షరంలో వాడి తగ్గింది..! అనే నిజాలు మర్చిపోతే ఎలా..!? అంతర్గత వాస్తవాలను దాచిపెట్టి.. బయటకు ఒక డాబు ప్రదర్శించి.. అందరూ దాన్ని ఫాలో అవ్వాలి అంటే మీడియా ఉన్నదెందుకు..? “న్యూస్ ఆర్బిట్” కి కొన్ని విలువలున్నాయి. మాకు తెలిసిన వాస్తవాలను ప్రాధమిక సోర్సుల ద్వారా ధృవీకరించుకుని ప్రచురిస్తాం. ఈ నేపథ్యంలోనే మేము ప్రచురించిన ఒక ఆర్టికల్ కి “ఈనాడు” లీగల్ నోటీసు ఇచ్చింది. ఆ ఆర్టికల్ ఏమిటో దానిలో నిజాలేమిటో ఈ కథనంలో చూద్దాం..!!
మేము ప్రచురించిన ఆర్టికల్ లింక్ ఇదీ. (“ఈనాడు” ఎత్తేయ్ – మందుబిళ్ళలు ఎట్టేయ్..!? రామోజీ మదిలో కీలక ఆలోచనలు..!!(Click Here) ఆలోచనలు ఇలా ఉన్నాయని మాత్రమే ప్రచురించాం..! దీన్ని తప్పు పడుతూ ఈనాడు లీగల్ నోటీసు పంపించింది. ఈనాడుపై దురుద్దేశ పూర్వకంగా రాస్తున్నారని, అసలు అటువంటి ఆలోచనలే లేవు అంటూ నోటీసులో పేర్కొన్నారు.
Eenadu ; ఇవీ వాస్తవాలు కాదా..? మా ఆర్టికల్ మూలాల్లోకి వెళితే..!!
మరో మూడేళ్ళలో ఈనాడు ప్రింట్ ఆపేసి, డిజిటల్ ఎడిషన్ తీసుకువచ్చి.. ఇప్పుడు ఈనాడు జిల్లా యూనిట్ కార్యాలయాలుగా ఉన్న వాటిని భరత్ బయోటెక్ మందుల నిల్వ కేంద్రాలుగా మార్చే అవకాశాలున్నాయని మేము ప్రచురించాం..! ఎందుకంటే….
* ఎక్కడైనా పత్రిక సర్క్యులేషన్ పడిపోతే యాజమాన్యం ఏం చేస్తుంది..!? ప్రమోషన్ బాగా పెంచుకుని, మార్కెటింగ్ టీమ్ ని బలోపేతం చేసి ఇంటింటికీ పత్రిక వెళ్లేలా జాగ్రత్తలు తీసుకుంటుంది.. కానీ “ఈనాడు” అలా చేయలేదు. గత ఏడాది వ్యవధిలో దాదాపు 6 లక్షలు కాపీలు తగ్గిపోయినా ఈనాడు పెంచుకునే ప్రయత్నం చేయలేదు. నిరుడు వరకు “ఇంటింటికీ.., డోర్ టు డోర్ తిరిగి మా పత్రిక వేయించుకోండి” అని బతిమాలి ప్రమోట్ చేసే వాళ్ళు ఉండేవారు. ఈనాడు వాళ్ళను తొలగించింది. అంటే ఈనాడు సర్క్యులేషన్ పై శ్రద్ధ తగ్గించింది. ఇదే సమయంలో డిజిటల్ ఎడిషన్ ని పూర్తి మార్పులు చేసింది. పెయిడ్ సబ్ స్క్రిప్షన్ పెట్టింది.
* 2020 జనవరి నాటికి ఈనాడు ప్రధాన పత్రిక 16 పేజీలు, జిల్లా పత్రిక 16 పేజీలు అంటే మొత్తం 32 పేజీలు ప్రింట్ చేసేవాళ్ళు. కానీ ప్రస్తుతం మొత్తం మీద 16 పేజీలు మాత్రమే ప్రింట్ చేస్తున్నారు. ప్రధాన పత్రికలోనే జిల్లా కోసం కొన్ని పేజీలు కేటాయించారు. మొత్తం మీద 16 పేజీల్లో పత్రిక అందిస్తున్నారు. ఈ క్రమంలోనే “ఈనాడు”కు వన్నె తెచ్చిన స్పెషల్ పేజీలను (రయ్ రయ్, హాయ్, సుఖీభవ, ఈతరం) ప్రింట్ ఆపేసారు. డిజిటల్ కి మాత్రమే పరిమితం చేశారు.
* ఈనాడు సంస్థ ద్వారానే అనుబంధంగా ప్రింట్ అయ్యే బాల భారతం, తెలుగు వెలుగు, చతుర, విపుల, సితార వంటి మ్యాగజైన్స్ ని ఈనాడు పూర్తిగా మూసేసింది. ఈనాడు సంస్థ నష్టాల్లో ఉంది, పరిస్థితి బాలేదు అని స్వయంగా ఆ యాజమాన్యమే ఒప్పుకుంది. గత ఏడాది జూన్ నుండి ఇప్పటికీ “లే ఆఫ్” కొనసాగిస్తుంది. 60 శాతం మంది ఉద్యోగులకు మాత్రమే పని కల్పిస్తుంది. గడిచిన ఏడాది వ్యవధిలో ఈనాడు తరపున క్షేత్రస్థాయిలో పని చేసే ప్రమోటర్లు (సర్క్యులేషన్ సిబ్బంది), రీటా(యాడ్) స్టాఫ్, అనే విభాగాలకు చెందిన దాదాపు 2 వేల మందిని తొలగించారు.
* ప్రింట్ ఎడిషన్ కి సంబంధించి కొన్ని మెట్లు కిందకు దిగుతున్నారని స్పష్టం. ఇదే సమయంలో డిజిటల్ ఎడిషన్ కి సంబంధించి కొన్ని మెట్లు పైకి ఎక్కుతున్నారనేది కూడా స్పష్టం. డిజిటల్ సబ్ స్క్రిప్షన్ తీసుకురావడం, ఈమెయిల్ అలెర్ట్, ఎడిషన్ లో వేగం, కొత్త కొత్త కథనాలు కేవలం డిజిటల్ లో మాత్రమే ఇవ్వడం వంటి మార్పు చేస్తున్నారు. సో… ఈ పాయింట్లు ఆధారంగా చేసుకుని… రానున్న మూడేళ్ళలో ప్రింట్ ఆపేసి.. డిజిటల్ పై దృష్టి పెడుతున్నారు అని రాస్తే తప్పేమిటి..!? ఎందుకు భుజాలు తడుముకోవడం..!?
భారత్ బయోటెక్ తో సంబంధాల గురించి..!!
ఇక “న్యూస్ ఆర్బిట్” కథనంలో భారత్ బయోటెక్ నిల్వ కేంద్రాలుగా “ఈనాడు” జిల్లా కార్యాలయాలు ఉపయోగించనున్నారని… దీనికి కూడా కారణాలు లేకపోలేదు.
* భారత్ బయోటెక్ యాజమాన్యానికి – ఈనాడు యాజమాన్యానికి బంధుత్వం ఉంది. మూడేళ్ళ కిందటే వియ్యం అయ్యింది. ఇది వ్యాపార బంధుత్వం కూడా అవుతుంది అని సమాచారం వచ్చింది. వియ్యంకులు కలిసి వ్యాపారం చేస్తారు అని రాయడంలో తప్పు లేదు. దేశం మొత్తం మీద పత్రికా ప్రింట్ రంగం పడిపోయి.. ఫార్మా రంగం దూసుకెళ్తున్న నేపథ్యంలో ఈనాడు యాజమాన్య వారసులు కూడా అటు అడుగులు వేయడంలో తప్పేముంది..!?
* భారత్ బయోటెక్ విడుదల చేసిన కోవాక్జిన్ టీకాని ఈనాడు తనకు ఉన్న అన్ని మీడియా విభాగాలు (ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్) ద్వారా బాగా ప్రమోట్ చేసింది. ప్రత్యేక ఇంటర్వ్యూలు, కథనాలు, నిపుణుల అభిప్రాయాలు ఇచ్చారు. “ఈ టీకా తీసుకోండి, ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు” అని ప్రజలను నమ్మించేలా అనేక కథనాలను డబ్బా కొడుతూ ఈనాడు ప్రచురించింది. భారత్ బయోటెక్ కొవాక్జిన్ తో పాటూ పోటీగా కోవీషిల్డ్ కూడా సీరం ఇన్స్టిట్యూట్ విడుదల చేసింది. ఈనాడు సంస్థ భారత్ బయోటెక్ కోవాక్జిన్ కి ఇచ్చిన ప్రచారం, ప్రయారిటీలో కనీసం పదో వంతు కూడా కోవిషీల్డ్ కి ఇవ్వలేదు. అంటే ఇది భారత్ బయోటెక్ – ఈనాడు వ్యాపార బంధాలను బయటపెడుతున్నట్టే కదా..!?
* ఓ వైపు ఈనాడు ప్రింట్ కి ఎడిషన్ కి కష్టాలు. మరోవైపు డిజిటల్ ఎడిషన్ కి మార్పులు. ఇక సైలెంట్ గా భారత్ బయోటెక్ ఉత్పత్తుల ప్రచారం. వీరి వియ్యం.. ఇవన్నీ ఆలోచిస్తే ఈనాడు ఆపేసి.., భారత్ బయోటెక్ మందుల వ్యాపారంలో దిగి.. జిల్లాల్లో నిల్వలకు ఉపయోగించే అవకాశాలున్నాయి… అని రాయడంలో తప్పేముంది..!? ఇదేమైనా నేరమా..!? “ఈనాడు” అనవసర తొందరపాటు తప్ప.., ఇంకేం లేదు..! ఇక నలభై ఏడేళ్ల “ఈనాడు” పెద్దల విచక్షణకె వదిలేస్తున్నాం..!!
Vijayawada TDP: కేశినేని నాని Vs టీడీపీ కోవర్టులు ..! కృష్ణాజిల్లాలో టీడీపీ బ్లాస్టింగ్..!