“నిత్యం ఉషోదయంతో సత్యం నినదించే గాక” ఇది ఈనాడు పత్రిక ఉప శీర్షిక. ఆ సత్యాలేమిటో కొన్నేళ్లుగా చూస్తున్నాం. ఒక రంగునీ, ఒక పార్టీని మెడలో వేసుకుని కళ్ళు మూసుకుపోయి చెప్పే ఆ సత్యాలు ఏమిటో అందరం చూస్తూనే ఉన్నాం…! ఇప్పుడెందుకు ఈ టాపిక్ మళ్ళీ అంటే ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం వార్షికం పూర్తి చేసుకుంది. నరేంద్ర మోడీ భజన చేసుకుంది ఈనాడు. అయితే పక్కనే ఏపీ ప్రభుత్వం కూడా వార్షికం పూర్తి చేసుకుంది అనే విషయాన్నీ, సత్యాన్ని ఈనాడు కి కనిపించలేదేమో. సమయానుగుణంగా పసుపు, కాషాయం రంగుల జెండాలు వేసుకుని… పెద్ద పత్రికగా చలామణి అవుతున్న ఈనాడు అంతర్గత వాస్తవాలు, ఉద్దేశాలు ఇవీ.
కాషాయ డోలు మెడలో…!
సాధారణంగా ఈనాడు అంటే టిడిపి అనుబంధ పత్రిక అని తెలిసిందే. అయితే ఇక్కడ కొన్ని షరతులు వర్తిస్తాయి. అవసరం, సందర్భం, అధికార ముద్ర ఉన్న గొడుగు కిందకు ఈనాడు చేరుతుంది. దీనిలో భాగంగా రాష్ట్రంలో టిడిపి అధికారంలో ఉంటె ఆ పార్టీకి అనుగుణంగా చాకచక్యంగా వార్తలు వండుతుంది. ఒకవేళ రాష్ట్రంలో టిడిపి అధికారంలో లేకుంటే ఈనాడు ఆటలు సాగవు అందుకే… కేంద్రంలో ఏ పార్టీ ఉందొ చూసుకుని ఆ రంగుని మోస్తుంది. అదే నేపథ్యంలో ప్రస్తుతం ఈనాడు మెడలో కాషాయ డోలు వేసుకుని మోస్తుంది. బాకా ఊదుతుంది. ఆ ఫలితంగానే ఈ వార్తలు. రెండు రోజుల కిందట ఈనాడులో నరేంద్ర మోడీ పెద్ద ఫోటో వేస్తూ పెద్ద పెద్ద కథనాలు రాశారు. గతంలో కూడా కేంద్రంలో (2014 నుండి 2019 ) మధ్య బిజెపి జెండా మోశారు. కానీ చంద్రబాబు బిజెపి తో ఉన్నంత కాలం బిజెపిని ఈనాడు భుజాన మూసుకుంది. ముద్ర , స్వచ్చ్ భారత్, వంటి అనేక మోడీ మార్కు పథకాలను రామోజీ తన పత్రికలో బాకా ఊదుకుంటూ అవార్డుల కోసం తాపత్రయం ప్రదర్శించి, మొత్తానికి తెచ్చుకున్నారు. అలా అలా, 2018 నాటికీ చంద్రబాబు, బిజెపి బంధం తెగిపోవడంతో ఈనాడు కూడా ఆరెంజ్ జెండా వదిలేసి పూర్తిగా పసుపు జెండా మోసింది. 2019 నుండి ఇక రాష్ట్రంలో జగన్ ఉండడంతో మళ్ళీ కాషాయ జెండాకి మారింది. ఇదే ఈనాడు పెట్టుకున్న నిత్యం ఉషోదయంతో సత్యం నినదించడం అంటే…! ప్రధాని మోడీ వార్షికం అంతగా హైలైట్ చేసినప్పుడు ఇక్కడ సీఎం జగన్ ప్రభుత్వం కూడా ఎంతో కొంత చేసి ఉండాల్సిందని ఈనాడుపై విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ ప్రకటనలు తీసుకుంటూ, కనీసం ప్రభుత్వ వార్షికంపై మంచో చెడో కూడా అక్షరం ముక్క రాయలేదు.
అటు కన్నీరు… ఇటు భజన…!
ఈనాడు ముసలి కన్నీరు మరో వార్తలో కూడా మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. మే 15 నుండి మే 18 వరకు ఈనాడులో వరుసగా వలస కార్మికుల కష్టాలపై కథనాలు వచ్చాయి. వారి కష్టాలు, బాధలు, కళ్ళకు కట్టినట్టు ఫొటోలతో సహా ప్రచురించారు. భేష్… శెభాష్… కానీ అదే సమయంలో కేంద్ర మంత్రి నిర్మల కేంద్రం తెచ్చిన 20 లక్షల కోట్ల ప్యాకేజి ప్రకటిస్తున్నారు. ఈనాడులో దాన్ని రోజూ పెద్ద పెద్ద అక్షరాలతో ఎద్దుకుంటున్నారు. కాషాయ డోలు వాయిస్తున్నారు. ప్యాకేజీలో సామాన్యుడికి పెద్దగా ఒరిగేది లేకపోయినా, పేదోడికి బాగు చేసేది లేకపోయినప్పటికీ ఈనాడులో ?ఆహా ఓహో అంటూ కథనాలు వార్చారు. అదే సమయంలో లోపలి పేజీల్లో వలస కార్మికుల కష్టాలు రాసుకొచ్చారు. చుసిన అందరికి “బాగుంది, ఈనాడులో కేంద్రం ఇచ్చిన 20 లక్షల కోట్లను హైలైట్ చేస్తున్నారు.. అలాగే వలస కార్మికుల కష్టాలు కూడా హైలైట్ చేస్తున్నారు అంటూ చెప్పుకున్నారు…!! కానీ ఇక్కడే ఉంది ఈనాడు బుర్ర “నిజానికి ప్యాకేజి వార్తలను ముడిపెడుతూ వలస కార్మికుల కథనాలు వివరిస్తూ… ఆ భారీ ప్యాకేజీలో ఈ పేదలకు వచ్చేది ఏంటి అని ప్రశ్నిస్తూ ఒక్క వార్తా రాలేదు. ప్యాకేజీకి, వలసలకు నేరుగా సంబంధం ఉంటుంది… రాయాలంటే చాలా రాయొచ్చు… కానీ ఈనాడు ముదురు తెలివి చూపించి దేనికవి విడిగా రాసుకుని, ప్రచురించుకుని ఆ వలస కార్మికుల ఇబ్బందులు బిజెపికి ఏ మాత్రం తగలకుండా జాగ్రత్త పడింది. 2024 నాటికి నేరుగా రామోజీ (అప్పటికి యాక్టీవ్ గా ఉంటె) బిజెపి, టిడిపి మధ్య సయోధ్య కుదుర్చి పెళ్లిళ్ల పేరయ్యలా మారి, పెళ్లి చేసినా ఆశ్చర్యం అవసరం లేదు.