Eenadu Ramoji : రామోజీ అంటే తెలుగునాట తెలియని వారుండరు..! పొద్దున్నే ఈనాడు చదవనిదే బయటకు రానివారు ఎందరో..! వారానికోసారి సితార.., నెలకోసారి చతుర, విపుల చదివి మనసు తృప్తి పరుచుకున్న వారు ఎందరో ఉన్నారు..! “అన్నదాత” ద్వారా సేద్యం నేర్చుకుని.., సుస్థిర సాగు చేసిన రైతులు వేలాది మంది ఉన్నారు. ఇలా రామోజీరావు మనసు, మైండ్ నుండి వెలువడిన ఈ కమర్షియల్ మ్యాగజైన్లు చరిత్ర పుటల్లోకి ఎక్కేయబోతున్నాయి. ఇప్పటికి అయితే “విపుల, చతుర, బాల భారతం, తెలుగు వెలుగు” మాత్రమే నిలిపివేస్తున్నట్టు రామోజీ ఫౌండేషన్ ప్రకటించింది. కానీ ఈ ప్రభావం కొద్దిరోజుల్లోనే “అన్నదాత”పై స్పష్టంగా ఉండనుంది. ఇక ఈనాడు కూడా నడపడం అంత ఈజీకాదు..!!
Eenadu Ramoji : ఈరోజు ఆ సంస్థ ఏమని ప్రకటించింది అంటే..!?
రామోజీ ఫౌండేషన్ నుండి ఓ ప్రకటన వచ్చింది. విపుల, చతుర, బాల భారతం, తెలుగు వెలుగు” మ్యాగజైన్లు ప్రచురణ నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. నిజానికి ఈ మ్యాగజైన్లు గత ఏడాది ఆగష్టు నుండి ప్రచురణ నిలిపివేశారు. కేవలం ఆన్లైన్ లో మాత్రమే అందుబాటులో ఉంచారు. కానీ ఏప్రిల్ నుండి పూర్తిగా ఇవి ఆన్లైన్ లో కూడా ఉండవు. ఇక మూసేసినట్టే. 1978 లో విపుల, చతుర ప్రారంభమవ్వగా.., 2012 లో తెలుగు వెలుగు.., 2013 లో బాల భారతం ఆరంభమయ్యాయి. విపుల, చతుర మంచి పాఠకాదరణ పొందాయి. కొన్నేళ్ల పాటు మ్యాగజిన్ లోకాన్ని ఎలాయి. కథలు, నవలలతో తెలుగు వారికి దగ్గరయ్యాయి. కానీ… స్వాతి, ఇతర మ్యాగజైన్లు నుండి పోటీని తట్టుకోలేక కొన్నేళ్లుగా అమ్మకాలు బాగా తగ్గాయి.
* బాలభారతం, తెలుగు వెలుగు నిజానికి మంచి పుస్తకాలు. పిల్లల కోసం లోకమంతటి నుండి సంగ్రహించిన మంచి అంశాలను బాల భారతంలో ప్రచురిస్తారు. తెలుగు భాష అభ్యున్నతి కోసం తెలుగు వెలుగు ఉండేది. అయితే అనుహ్యంగా ఇవి ఏనాడూ సక్సెస్ కాలేదు. ఈనాడు ఏజెంట్లు ద్వారా బలవంతంగా అమ్మించారు. ఎలాగోలా గిట్టుబాటు చేసుకునేవారు.
అన్నదాత బ్లాక్ మెయిల్ బిజినెస్ ఎన్నెల్లో..!?
రైతుల కోసం, వ్యవసాయం కోసం మాత్రమే పుట్టినది అన్నదాత. దశాబ్దాల కాలంగా తెలుగు రాష్ట్రాల్లో కీలకమైన వ్యవసాయ మ్యాగజిన్ గా నిలిచిపోతుంది. ఈ అన్నదాతలో ఆరంభమైన తర్వాత 2005 వరకు బాగానే బిజినెస్ ఉండేది. కానీ కొన్ని బలవంతపు అమ్మకాల ద్వారా ఇది దెబ్బతినే స్థితికి చేరుకుంది.
* టీడీపీ అధికారంలో ఉంటె అన్నదాత సర్క్యులేషన్ వేరేలా ఉండేది. టీడీపీ ఎమ్మెల్యేలకు – ఈనాడు రిపోరేటర్లకు ఉన్న సన్నిహిత పరిచయాల ద్వారా అన్నదాత చందాలను ఎమ్మెల్యేల ద్వారా వసూలు చేసేవారు. ఏటా.. ఎమ్మెల్యేల చేతనే రైతులకు ఈ అన్నదాత పుస్తకాలను బహుమతిగా ఇప్పించేవారు.
* ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేత కనీసం 200 , 500 వరకు అన్నదాత పుస్తకాలను ముందుగానే వార్షిక చందా కట్టించుకుని.., ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేల ద్వారానే రైతులకు పంపిణీ చేయించేవారు. తద్వారా రైతులకు ఎలాగోలా చేరిపోయివి. వీటికి సంబంధించిన నగదు కూడా ముందే అందిపోయేది. అలా రాష్ట్రం మొత్తం మీద రైతులు – ఎమ్మెల్యేలు అనే సెంటిమెంట్ తో కమర్షియల్ గా అన్నదాతకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకున్నారు. కానీ ఇప్పుడు అన్నదాత బ్లాక్ మెయిల్ బిజినెస్ సాగట్లేదు. కాకపోతే అన్నదాతకు ఎడిక్ట్ అయిన కొద్దిమంది రైతులు మాత్రం ఇప్పటికీ ఆ మ్యాగజిన్ ఎక్కడ ఉన్నా వెళ్లి వెతుక్కుని చదువుతుంటారు. మొత్తం మీద వచ్చే ఏడాది నాటికి ఈ ప్రచురణ కూడా నిలిపివేసే అవకాశాలున్నాయి.
మిగిలేది ఈనాడు మాత్రమే..!!
చతుర, విపుల, సితార, బాల భారతం, తెలుగు వెలుగు, అన్నదాత… వీటి గురించి ఎన్ని చెప్పుకున్నా ఇవన్నీ ఈనాడు కుటుంబ బంధాలే. ఈనాడు లేకపోతే ఇవి లేవు. ఈనాడు ఛరిష్మాతో ఇవన్నీ సైడ్ బిజినెస్ లుగా ఉండేవి. ఇప్పుడు ఇవి చరిత్రలో కలిసిపోనున్నాయి. ఇవి పోతే పోయాయి… ఈనాడు ఉంటె చాలు అంటూ రామోజీ అభిమానులు కోరుకుంటున్నారేమో..!! అది కూడా అనుమానమే. డిజిటల్ మీడియా వేగం, సోషల్ మీడియా పైత్యం కలిసి… అన్నిటి కంటే ఈనాడులో లోపిస్తున్న నాణ్యత, క్రెడిబిలిటీ కారణంగా ఈనాడు కూడా చరమాంకంలో ఉన్నట్టే చెప్పుకోవచ్చు. దీన్ని కూడా పూర్తిగా ప్రచురణ ఆపేసి, కేవలం ఆన్లైన్ ఎడిషన్ గా తెచ్చే చర్చలు కూడా జరుగుతున్నాయి. లేదా.. మొత్తం అమ్మేసి.. రామోజీ పూర్తిగా ఈనాడు నుండి తప్పుకునే చర్చలు జరుగుతున్నాయి. అంటే… ఈనాడు ఏమి సేఫ్ కాదు. ఇది కూడా పైకి నడుస్తుంది. లోలోపల మాత్రం కొన్ని చర్చలు, ఆలోచనలు జరుగున్నాయి..!!