చట్ట ప్రకారం చిన్న స్థాయి ఉద్యోగులను వీధిన పడేయడం ఎలా..?
చట్ట ప్రకారం ఉద్యోగులను పీకేయడం ఎలా..?
చట్ట ప్రకారం వారికి వేతనాలు కోసేయ్యడం ఎలా…?
చట్ట ప్రకారం పాపాలు చేయడం ఎలా…?
ఇవన్నీ బహుశా ఎవరికీ తెలియవు అనుకుంటారేమో…! కానీ మీడియా మొఘల్.., తెలుగు నాట “వార్తావ్యాపార నిపుణుడు” రామోజీరావుకు బాగా తెలుసు. ఆయన మానస పుత్రిక ఈనాడు సంస్థలో “కాగల కార్యాన్ని కరోనా”తో తీర్చుకుంటున్నారు. వందలాది ఉద్యోగులను రోడ్డున పడేసి.., ఉద్యోగాల నుండి పీకేసి.., లే ఆఫ్ లు అంటూ మెలికలు పెట్టేసి.., జీతం కోసేసి నానా అవస్థలు పెడుతున్నారు. కానీ ఒక్క ఉద్యోగి కోర్టుకి వెళ్ళలేరు.., ఒకవేళ వెళ్లినా రామోజీ దొరకరు. అదే ఆయన ప్రత్యేకత. అదే ఆయన నిపుణత. ఎందుకో.., ఏమిటో.., ఎలానో… చూద్దాం పదండి…!
తెలియని ప్రపంచం…! చట్టం చుట్టం..!
ఈనాడు సంస్థలో అనేక ఉప భాగాలున్నాయి. అందరికీ తెలిసి ఈనాడు అనే పత్రిక నడిచేది “ఉషోదయ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్” అనే పేరుతో.., కానీ దీనిలో అనేక విభాగాలున్నాయి. అనేక ఉద్యోగులున్నారు. వీరి నిర్వహణకు, జీతాల ఖాతాలకు, లొసుగులకు, చట్టాలకు విభాగాలను సృష్టించారు. “భవిష్యత్తులో ఉద్యోగులను తీసేయాల్సి వస్తే వారు కోర్టుకి వెళ్లే అవకాశం ఉండకూడదు” అనే సుదీర్ఘ లక్ష్యంతో ఇవన్నీ ఏర్పాటవుతుంటాయి.
ఉదాహరణకు…
* మార్గదర్శి మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (ఈ సంస్థ ద్వారా ఈనాడు పత్రికకు యాడ్లు సేకరిస్తుంటారు. దీనిలో మళ్ళీ రెండు విభాగాలున్నాయి. కరోనా ఆరంభానికి ముందు దీనిలో ప్రతి జిల్లాలో దాదాపు 20 మంది చొప్పున సుమారుగా 1200 మంది వరకు ఉండేవారు. వీరికి వేతనాలు ఉండవు. యడ్లుపై కమీషన్లు ఉంటాయి. సగటున ఒక్కొక్కరికి నెలకు రూ. 12 వేలు వస్తుంటుంది.
* న్యూస్ టుడే ప్రైవేట్ లిమిటెడ్ (ఈ సంస్థ ద్వారా ఈనాడు పత్రికకు వార్తలు అందిస్తుంటారు. క్షేత్రస్థాయిలో (గ్రామా, మండల) వార్తలు సేకరించి పత్రికకు పంపిస్తారు. వీరికి జీతాలు ఉండవు. వార్తకు ఇంత అంటూ ఇస్తుంటారు. సగటున ఒక్కొక్కరికి నెలకు రూ. 10 వేలు వస్తుంటుంది.
* ఈనాడు డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్ (దీనిలో ఈనాడులో అదనంగా కావాల్సిన వారిని నియమించుకుంటారు. ఇది రిజిస్టర్ ప్రకారం కేవలం వెబ్ మీడియా మాత్రమే. కానీ దీనిలో పని చేసేవారు ఈనాడు, ఈటీవీ, ఈటీవీ భరత్ వంటి భిన్న రంగాలకు ఇవ్వాలి. దీనిలో వేతనం మరీ దారుణం) ఇంకా అనేక ఉప భాగాలున్నాయి. ఇవన్నీ పాపాలను కడిగేసుకునే క్రమంలో కోర్టులకు దొరకకుండా, చట్టం పరిధిలో అన్నీ జరిగేలా ఉండేందుకు ఏర్పాటైనవే.
కరోనాతో కడుపులు ఎలా కొట్టారంటే…!!
కరోనా వచ్చింది. సర్క్యూలేషన్ పడిపోయింది. యాడ్లు లేవు. ఆదాయం లేదు. రోజుకి రూ. కోటి ఆదాయం కోల్పోతున్నాం. అందుకే ఇక పత్రిక నడిపించలేం అంటూ ఏప్రిల్ లో కొందరు చిన్నస్థాయి ఉద్యోగులకు కబురు పెట్టారు. మే 15 నుండి మార్గదర్శి మార్కెటింగ్ విభాగంలో ఉండే కొందరు చిన్నస్థాయి ఉద్యోగులను ఆపేసారు. ఇలా 550 మందిని ఆపేసారు. ఉన్నపలంగా పీకేశారు. వీరికి కమీషన్ రూపంలో ఇస్తుంటారు. అంటే వీరు పూర్తిస్థాయి ఉద్యోగులు కాదు, యాడ్లూకి కమీషన్ ఇస్తుంటాం.., యాడ్లు వద్దు, కమీషన్ ఇవ్వము అని చెప్పేసి ఆపేసాము… అంటూ కోర్టులకు చెప్పుకోవచ్చు. వీరికి చట్టం వర్తించదు. ఇలా వీరి కడుపులు కొట్టారు. పాపం… ఈ ఉద్యోగులు రామోజీ అతి తెలివి తెలిసి.., ఈనాడు ఊబి గురించి తెలిసి కూడా ఆ ఆఫీస్ ముందు ధర్నాలు చేశారు.
* న్యూస్ టుడే లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కలిపి 2800 మంది పని చేస్తున్నారు. వీరికి వార్తకి ఇంత, ఫోటో కి ఇంత (రూ. 25 ) అని పబ్లిష్ లెక్కలను చూసి ఇస్తుంటారు. ఇప్పుడు జిల్లా పేజీలు లేవు, ఉన్నా పేజీలు కుదించారు. వార్తలు, ఫోటోలు పెద్దగా రావట్లేదు. అందుకే వీరి ఆదాయమే 80 శాతం పడిపోయింది. కానీ ఏ ఒక్కరూ మాట్లాడలేరు. ఎందుకంటే వీరికి చట్టం వర్తించదు. (వీళ్ళు పార్ట్ టైం పని చేస్తారు, వార్తా ఉంటె ఇస్తారు, డబ్బులు ఇస్తాం. అని కోర్టుకి సమాధానం సిద్ధంగా ఉంటుంది.)
* ఇక ఈనాడు డిజిటల్.., రీటా.., సీజ్, సర్క్యులేషన్ విభాగాల్లోనూ దాదాపు 1200 మందిని పీకి పడేసారు. వీరికి అదే పరిస్థితి. ఆదాయం లేదు, అవసరం లేదు. ఇక్కడ కూడా కోర్టులు ఏమి పని చేయవు.
మొదట లే ఆఫ్, ఇప్పుడు పీకుదల…!
ఇక ఈనాడు ప్రధాన వనరు ఉషోదయ విషయానికి వద్దాం. దీనిలో ఉన్న ఉద్యోగులకు మాత్రం చట్టం, కోర్టు వర్తిస్తుంది. కానీ…. అక్కడ ఉన్నదీ రామోజీ.., వీటికి అతీతంగా తప్పించగలరు…! అందుకే మూడు నెలల కిందట లే ఆఫ్ మంత్రం వేశారు. “నష్టాల్లో ఉన్నాం, లే ఆఫ్ ప్రకటిస్తున్నాం” అంటూ జూన్ నుండి అమలు చేస్తున్నారు. తాజాగా సెప్టెంబర్ నుండి వ్యూహం ఏమిటంటే..!
* లే ఆఫ్ అమలు చేసినా సంస్థ నష్టాలు భర్తీ కాకుంటే ఉద్యోగాలను పీకేయొచ్చు. బయటకు పొమ్మనవచ్చు. అందుకే జిల్లాల వారీగా పీకే జాబితా రెడీ చేసుకున్నారు. ముందు వరుసలో ఫోటో గ్రాఫర్లవి ఉన్నాయి. ఆ తర్వాత రూ. 50 వేలు జీతం పైబడిన సబ్ ఎడిటర్లవి ఉన్నాయి. ఇలా… దాదాపు 300 మందిని వెళ్లగొట్టె (చట్ట ప్రకారమే) ప్రక్రియ నడుస్తుంది. ఇప్పటికే మూడు నెలల నుండి సగం వేతనాలతో నెట్టుకొస్తున్న ఈ ఉద్యోగులకు వచ్చే నెల నుండి ఉద్యోగం ఉండదు అంటే భయం మొదలయింది. (కథనం సశేషం…….)
Vijayawada TDP: కేశినేని నాని Vs టీడీపీ కోవర్టులు ..! కృష్ణాజిల్లాలో టీడీపీ బ్లాస్టింగ్..!