ఏలూరుకు ఒక వ్యాధి వచ్చింది. వారం రోజులు వణికించింది. వేలాది మందిని భయపెట్టింది. రాష్టాన్ని కంగారు పెట్టింది. ప్రపంచాన్ని అప్రమత్తం చేసింది. అంతలోనే మాయమయింది. నిజాలు పూర్తిగా తెలియకుండానే తగ్గేసింది..! కానీ ఆ భయం జ్ఞాపకాలు, ఆ వ్యాధి ఆనవాళ్లు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. నిపుణులు కొన్ని నివేదికలిచ్చారు. శాస్తవేత్తలు కొన్ని అంశాలు చెప్పారు. కానీ బయటకు కనిపించని.., లోలోపలే అనుమానాలు కలిగించిన అనేక వాస్తవాలు దాగున్నాయి. ఆ నివేదికల్లోనూ.., ఆ పరిశోధనలోనూ అనేక భయానక సందేహాలు దాగున్నాయి..!!
* ఏలూరులో పురుగు మందులు ఎక్కువగా వాడడం వలనే ఆ వ్యాధి వచ్చింది. రోగుల రక్త నమూనాలో ఎక్కువగా పురుగు మందుల అవశేషాలు కనిపించాయి. అదే వ్యాధి కారణం – ఇదీ ఢిల్లీ ఎయిమ్స్, హైదరాబాద్ లోని రసాయన పరిశోధన శాస్త్రవేత్తల నివేదిక సారాంశం..!
ఈ అనుమానాలు తీర్చేదెవరు..!?
* పురుగు మందులు వాడడం ఏలూరులో కొత్త కాదు. ఆ మాటకొస్తే ఏలూరె కాదు దేశం మొత్తం ఇదే తరహాలో పురుగు మందుల వాడకం జరుగుతుంది. పంటలు, కూరగాయలు, పళ్ళు ప్రతీ చోట పురుగు మందులను వాడుతున్నారు. 10 శాతం సేంద్రియ విధానాలు తప్పితే మిగిలిన 90 శాతంలో పురుగు మందులు లేకుండా సేద్యమే లేదు. ఏలూరులో ఈ నెలలోనో, గత నెలలోనో ఎక్కువగా పురుగు మందులు వాడలేదు. రొటీన్ లో భాగంగా ఏళ్ల తరబడి వాడుతున్నారు. మరి ఏనాడు రాని వింత వ్యాధి.., దేశంలో ఎక్కడా రాని వింత వ్యాధి ఒక్క వారంరోజులు గ్యాప్ లోనే ఏలూరులోనే ఎందుకు వచ్చినట్టు..!?
* ఏలూరు వ్యాధి వారం రోజులు మాత్రమే విపరీతంగా వచ్చింది. అంటే ఆ నిపుణులు / శాస్తవేత్తలు చెప్పినట్టు ఈ వారంలోనే ఆ రోగులు పురుగు మందులు ఉన్న ఆహారాలను తిని ఉండాలి..! అంటే కేవలం వారం లేదా పది రోజులు ప్రత్యేకంగా పురుగు మందులు కలిపరు కదా..? కూరగాయలు / పళ్ళు/ తినే పదార్ధాలు ఏవైనా పురుగు మందులు కలపడం రొటీన్ గా జరిగేదే తప్ప కొంత వ్యవధి తీసుకుని జరిగేది కాదు..!
ఇవీ పరిశోధిస్తే మంచిది కదా..!?
ఇక్కడ ప్రభుత్వం కానీ, నిపుణులు కానీ, శాస్త్రవేత్తలు కానీ… ఒక కామన్ పాయింట్.., కామన్ సెన్స్ తో ఆలోచించాల్సిన పాయింట్ వదిలేశారు. అది తేలితేనే కొంత వాస్తవాలు బయటకీ వచ్చే వీలుంది..!
* మనుషుల రక్త నమూనాలను సాధారణంగా ఆసుపత్రి ల్యాబ్ లు మాత్రమే పరిశీలిస్తాయి. వారికి ఉన్న వనరులను బట్టి నిర్ధారిస్తారు. కానీ తొలిసారిగా IICT (భారతీయ రసాయన పరిశోధన సంస్థ), ఢిల్లీలోని ఎయిమ్స్ పరిశోధించాయి. ఏలూరు వింత వ్యాధి వచ్చిన రోగుల రక్త నమూనాలు తీసుకుని పరిశీలించారు. అందులో ఈ పురుగు మందులు ఉన్నాయి కాబట్టి అదే కారణం అని తేల్చేశారు..!! కానీ పురుగు మందులు ఇప్పుడే కాదు, ఇక్కడే కాదు. అన్ని చోట్లా, అన్ని వేళలా వాడతారు కాబట్టి..! ఇదే తరహాలో ఆ వ్యాధి రాని వారి రక్త నమూనాలు, వేరే ప్రాంతాల వారి రక్త నమూనాలు ఈ నిపుణులు పరిశోధించలేదు. అలా చూస్తే, కచ్చితంగా ఇవే తరహా పురుగు మందుల అవశేషాలు ఆ నమూనాలో కూడా బయట పడేవి ఏమో..!? అలా చేస్తే వేరే ఎక్కడా.., వేరే ఎవ్వరి రక్త నమూనాల్లోనూ ఈ పురుగు మందుల అవశేషాలు లేకపోతేనే “ఏలూరు వింత వ్యాధికి పురుగు మందులే కారణం” అని నిర్ధారించాలి.
అంటే సింపుల్ గా … రోగం వచ్చిన చోట చేసిన పరీక్షలు.. రోగం రాని చోట కూడా జరిగితే … అక్కడ ఉన్న లక్షణాలు ఇక్కడ లేకపోతేనే అసలైన కారణాలు తెలిసినట్టు. కానీ “ఊరకే, ఏదో ఒక కారణం చెప్పాలి, చూపించాలి” కాబట్టి శోధనలు చేసేసి ఇదీ అని నిర్ధారించేస్తే అనుమానాలు తీరవు, అసలు కారణాలు తెలియవు..!! అయితే ఇవన్నీ ప్రభుత్వానికి, సైన్సు పెద్దలకు తెలియక కాదు. ఏలూరులో వ్యాధి ప్రస్తుతం తగ్గుతుంది.., అసలే ఆరోగ్య శాఖ మంత్రి ఊరు.. కాబట్టి.., ఇంకా ఎందుకు లోపలి వెళ్లడం అని ఆపేసి ఉంటారు. కానీ పైన మనం చెప్పుకున్న అనేక వాస్తవాలు తేలాల్సి ఉంది. ప్రపంచానికి కళ్ళు తెరిపించాల్సి ఉంది..!!