వైసిపి ఆపరేషన్ ఆకర్షకి పదును పెట్టింది. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి దీనికి బాగా పని చెప్తున్నారు. జగన్ ఆదేశిస్తున్నారో.., లేదా ఆయనే ముందడుగు వేస్తన్నారో కానీ… టిడిపి ని ఖాళీ చేయాలని మాత్రం ఆయన కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తుంది. రెండు నెలల కిందట చీరాల ఎమ్మెల్యే కారణం బలరాం ని లాగేసారు. ఆయన కూడా దూకేశారు. తర్వాత పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు విషయంలో కప్పదాట్లు జరిగాయి. ఇప్పుడు మాజీ మంత్రి విషయంలో మళ్ళీ పుకార్లు, ప్రచారం ఊపందుకుంది. ఈరోజు ఉదయం నుండి జిల్లాలో హాట్ టాపిక్ ఇదే.
ప్రకాశం జిల్లాలో టీడీపీకి అండ, ఒక రకంగా రాష్ట్ర టీడీపీలో ఓ సామజిక వర్గానికి దన్నుగా ఉన్న మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు అతి త్వరలోనే వైసీపీలోకి వెళ్లేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారని సమాచారం. అందులో భాగంగానే వారి కుటుంబంలో కొందరిని కండువా కప్పించారు. మూడు నెలల కిందటే సిద్ధ కుటుంబంలోని ఇద్దరు గ్రానైట్ వ్యాపారాలు వెళ్లి జగన్ ని కలిసి పార్టీలో చేరిపోయారు. ఇప్పుడు శిద్ధా వంతు వచ్చింది అంటున్నారు. చర్చలు జరుగుతున్నాయట. ఒకవేళ అంతా ఒకే అనుకుంటే రేపు చేరినట్టే. లేకుండా ఆగుతుంది.
కుటుంబ ఒత్తిడి సహా చాలా కారణాలు…!
టీడీపీలో శిద్ధా పెద్ద వికెట్. పార్టీకి ఆర్ధిక దన్ను, కీలక నాయకుల్లో ఒకరు. పాలిట్ బ్యూరో సభ్యుడిగానూ, శ్రీశైలం దేవస్థాన చైర్మన్ గాను, ఎమ్మెల్సీ గాను, మంత్రి గాను చేసారు. ఆయన ఏం చేసిన వివాదం లేకుండా సైలెంట్ గా చేసుకు వెళ్లిపోతుంటారు. ఇప్పుడు కూడా వైసీపీలోకి వెళ్ళాలా? వద్ద? అంటూ మల్లగుల్లాలు పడుతూనే చివరికి చేరేందుకు మొగ్గు చూపినట్టు తెలుస్తుంది. అందుకు అనేక కారణాలున్నాయి. జిల్లాలో శిద్ధా కుటుంబానికి చాలా క్వారీలున్నాయి.
గ్రానైట్ తవ్వకాల్లో ఆరితేరిన ఆ అన్నదమ్ములు, బంధువర్గానికి ఇటీవల ప్రభుత్వం రూ. 1000 కోట్ల వరకు ఫైన్ వేసింది. వారి అక్రమాలను నిగ్గు తేల్చింది. ఇవి కట్టలేక, ప్రభుత్వంతో పోరాడలేక సతమతమవుతున్నారు. అందుకే రాజకీయంగా ఈ కుటుంబ సభ్యులందరూ కొద్దీ రోజులుగా చర్చించుకుంటున్నారు. భిన్న అభిప్రాయాలూ వచ్చినప్పటికీ టీడీపీపై నమ్మకం లేకపోవడం, వైసిపి మాంచి స్వింగ్ లో ఉండడంతో కొన్ని ఒత్తిళ్ల మేరకు నెమ్మదిగా ఒక్కొక్కరు వైసీపీలోకి వెళ్లాలని, ఆ పార్టీకి దన్నుగా ఉండాలని డిసైడ్ అయ్యారన్నమాట. పనిలో పనిగా శిద్ధా ఇటీవల ఆయన బాగా నమ్మే ఓ స్వామీజీని కూడా కలిసి వైసిపిలో తన భవిష్యత్తుపై సలహాలు తీసుకున్నారట.
నామినేటెడ్ పదవి కోసం…!
పార్టీలో చేరేందుకు సిద్ధమే. కానీ కొన్ని షరతులు తమవి నెరవేర్చాలని ఆ కుటుంబం బలంగా కోరుతుందని సమాచారం. తమ గ్రానైట్ క్వారీలపై ఉన్న ఫైన్ తగ్గించేయడం…! కుటుంబంలో ఒకరికి కీలకమైన నామినేటెడ్ పదవి ఇవ్వడం…! వచ్చే ఎన్నికల్లో రాఘవరావుకి లేదా కుమారుడికి కోరిన చోట టికెట్ ఇవ్వడం…! వంటి షరతులు పెట్టినట్టు తెలుస్తుంది. అయితే వీటిపై వైసిపి వర్గాల నుండి సానుకూల సంకేతాలు రాలేదట. చేరాల్సిన వారు చేరవచ్చు, తర్వాత సంగతి తర్వాత అంటూ పార్టీ పెద్దల నుండి ఆదేశాలు రావడంతో అటూ, ఇటూ ఊగిసలాడుతున్నారు. ఇదే సమయంలో చంద్రబాబు కల్పించుకుని సిద్ధతో మాట్లాడే ప్రయత్నం చేయడం… శిద్ధా తమ సామజిక వర్గం నాయకులతో అంతర్గతంగా మాట్లాడుతుండడం… రెండు, మూడు రోజుల్లో ఆయన నిర్ణయం ఉంటుందనే టాక్ వినిపిస్తుంది.
Vijayawada TDP: కేశినేని నాని Vs టీడీపీ కోవర్టులు ..! కృష్ణాజిల్లాలో టీడీపీ బ్లాస్టింగ్..!