Janasena Party: ఏపిలో రాజకీయం వేడెక్కుతోంది. ఇప్పట్లో ఎన్నికలు లేకపోయినా అన్ని రాజకీయాలు ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్న విధంగా ఇప్పటి నుండే యాక్టివ్ అవుతున్నాయి. ఈ క్రమంలో జనసేన పార్టీలోకి పలువురు నేతలు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వినబడుతున్నాయి. జనసేనలో చేరాలి అనుకుంటున్న వారిలో అధికార వైసీపీ నేతలు ఉన్నారు. వీళ్లు ప్రస్తుతం పార్టీలో స్తబ్దుగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇస్తుందా లేదా అన్న అనుమానం వాళ్లలో ఉంది. వాళ్లు టీడీపీ నుండి బయటకు వచ్చారు కాబట్టి ఆ పార్టీలోకి వెళ్లలేరు. వీళ్లంతా జనసేన పార్టీలోకి వెళ్లడానికి తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. వీళ్లల్లో నర్సాపురం మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు పేరు ప్రముఖంగా వినబడుతోంది. ఆయన రకరకాల పార్టీలు మారారు. 2004 వరకూ టీడీపీలో ఉన్నారు. ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిన తరువాత 2009 ఎన్నికలకు ముందు ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆ తదుపరి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తరువాత వైసీపీలో చేరారు, వైసీపీ నుండి టీడీపీకి వచ్చారు. టీడీపీ నుండి మళ్లీ వైసీపీకి వెళ్లారు. ప్రస్తుతం ఆయన వైసీపీలో అంత సంతృప్తిగా లేరు. ఇటీవలే వైసీపీ ఎమ్మెల్యేని అనవసరంగా గెలిపించానంటూ బహిరంగ వేదికపైనే చెప్పుతో కొట్టుకున్నారు. ఆయన జనసేనలోకి వెళ్లి పొత్తులో భాగంగా నర్సాపురం నుండి పోటీ చేయాలన్న కోరికతో ఉన్నారు.
జనసేన – టీడీపీ పొత్తు ఉంటే గెలుస్తామన్న ధీమా
వాస్తవానికి వీళ్లు జనసేనకు వెళ్లే వారు కాదు. కానీ టీడీపీ – జనసేన పొత్తు పొడుస్తుందని భావించే జనసేనలోకి వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. జనసేన – టీడీపీ పొత్తు ఉంటే గెలుస్తామన్న ధీమా కూడా వాళ్లలో ఉంది. అందుకే జనసేన వైపు అడుగులు వేయడానికి సిద్ధం అవుతున్నారు. కొత్తపల్లి సుబ్బారాయుడు తరువాత విశాఖపట్నంకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే. ఆయన 2019 ఎన్నికల తరువాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాతే ఆ పార్టీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు ఆ సీటు ఇస్తారు అన్న గ్యారెంటీ లేదు. రాజకీయంగా సేఫ్ కోసమే వైసీపీలో ఆయన చేరారు. వైసీపీలో సీటు ఇవ్వరు కాబట్టి జనసేనలోకి వెళ్లి పొత్తులో భాగంగా సీటు తీసుకుని పోటీ చేయాలని సంప్రదింపులు జరుపుతున్నారు. అలానే పశ్చిమ గోదావరి జిల్లాలో మరో మాజీ ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన కూడా జనసేనలోకి వెళ్లడానికి సంప్రదింపులు జరుపుతున్నారు.
Janasena Party: 2019కి జనసేనలో వెళ్లాలని కూడా..
తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ కీలక నాయకుడు కూడా జనసేన వైపు చూస్తున్నారు. ఆయన 2019కు ముందే జనసేనకు వెళ్లాలని అనుకున్నారు. కానీ వెళ్లలేదు. దానిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఆయనపై సీరియస్ అయ్యారు. బహిరంగంగానే ఆయనను తమ పార్టీలోకి తీసుకోము అని చెప్పేశారు. రెండేళ్ల క్రితం ఆయన వైసీపీలో చేరారు. వైసీపీలో ఆయనకు సీటు ఇచ్చేది లేనిది అనుమానమే. అందుకే మళ్లీ వెనక్కు వచ్చేయాలని అనుకుంటున్నారు. టీడీపీ లేదా జనసేనలో చేరి ఉమ్మడి అభ్యర్ధిగా 2024 ఎన్నికల్లో పోటీ చేయవచ్చు అని భావిస్తున్నారు. ఈ నాయకుడు పార్టీ పెద్దలతో కూడా పరోక్షంగా మాట్లాడుతున్న సమాచారం.
Janasena Party: గంటా శ్రీనివాసరావు కూడా..?
వీళ్లందరితో పాటు గంటా శ్రీనివాసరావు కూడా ఉన్నారు. ఆయన ప్రస్తుతం టీడీపీలోనే ఉన్నారు. టీడీపీ నుండి బయటకు రాలేదు. కానీ యాక్టివ్ గా లేరు. అయిష్టంగా, ఇన్ యాక్టివ్ గా పార్టీలో ఉన్నారు. వేరే పార్టీలో చేరడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ కుదరలేదు. వైసీపీలోకి వెళ్లాలని భావించారు. కానీ అవంతి శ్రీనివాస్, విజయసాయి రెడ్డి ఆయన చేరికను తీవ్రంగా వ్యతిరేకించడంతో సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. దీంతో బీజేపీలోకి వెళ్లాలని అనుకున్నా, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో బీజేపీ దోషిగా ఉండటంతో ఆ పార్టీలోకి వెళితే రాజకీయ భవిష్యత్తు ఉండదని అటు వైపు చూడటం లేదు. అందుకే జనసేనలోకి వెళ్లి పోటీ చేసి, ఎమ్మెల్యే అయి తరువాత టీడీపీ – జనసేన ప్రభుత్వంలో మళ్లీ మంత్రి అవ్వచ్చు అనేది ఆయన భావనగా ఉందని అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఇటువంటి వాళ్లను ఎంత మందిని ప్రోత్సహిస్తారు..? జనసేనలో మొదటి నుండి కష్టపడిన వాళ్లకే ప్రాధాన్యత అంటారా..? అనేది కీలకం. ఎందుకంటే విశాఖపట్నం జిల్లాతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో జసనేనకు గట్టి నాయకులు ఉన్నారు. ఏమి జరుగుందో వేచి చూద్దాం..!